జీవన పోరాటం…(పూర్తి నవల)

 

                                                                                             జీవన పోరాటం       

జీవితంలో తప్పే చేయని వారు ఎవరూ ఉండుండరు. అలా తప్పు చేసిన వాళ్ళను ఒకటి చట్టం దండిస్తుంది లేకపోతే దేవుడు దండిస్తాడు. కానీ, చేసిన తప్పును అర్ధం చేసుకుని తమకు తామే దండన వేసుకుని జీవించే వారూ ఉన్నారు. కొన్ని సమయాలలో వీళ్ళు చేసే తప్పులవలన తప్పు చేసిన వాళ్ళూ, వాళ్ళకు సంబంధించిన వారూ బాధించపడినప్పుడు జీవితమే పోరాటంగా మారుతుంది.

కానీ, ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని నిదానంతోనూ, వివేకంగానూ ఎదుర్కోంటే సమస్యల నుండి బయటపడొచ్చు అనేది నా నమ్మకం.

సీరియల్ లోని పాత్రలు అలాంటి ఒక జీవిత పోరాటంలోనే చిక్కుకుంటారు. వాళ్ళ చిక్కులకు పరిష్కారం దొరికిందా?..... సీరియల్ చదివి తెలుసుకోండి.

                         *********************************PART-1***********************************

కలకత్తా లోని హౌరా రైల్వే స్టేషన్ ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది.

లోపలకు వెళ్ళాలన్నా సరే, బయటకు వెళ్ళాలన్నా సరే...జన సముద్రాన్ని ఈత కొడుతూనే వెళ్ళాలి.

మతం, భాష, జాతి, రాష్ట్రం అని ఏన్నో విభాగాలు కలిగిన మనుష్యుల ప్రజా సమూహం అక్కడ ఉండటంతో అదొక చిన్న భారత దేశం లాగానే కనబడుతుంది.

రోజూ అదేలాగనే కనిపిస్తోంది.

సమయం ప్రొద్దున 11.30.

తిరుపతి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో ప్రయాణం చేయాలనుకున్న వారు మూడో నెంబర్ ప్లాట్ ఫారం పైన కాచుకోనున్నారు. ఖాలీ పెట్టెలతో రైలు వస్తున్నదని ప్రకటన  వినిపించడంతో, ప్రయాణీకులందరూ హడావిడిగా తమతమ వస్తువులతో రైలు ఎక్కటానికి రెడీ అయ్యారు.

టికెట్టు రిసర్వ్ చేసుకున్న వారు నిదానంగా తమ రైలుపెట్టెలు ఎక్కి తమతమ సీట్లలో కూర్చున్నారు. రిసర్వేషన్ చేసుకోని వారికోసం ఉన్న జెనెరల్ పెట్టెలలో గుంపు ఒకొళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఎక్కటానికి ఆందోళన పడుతున్నారు.

సుమారు ఐదు నిమిషాలు దాటినా, ఒక్కరు కూడా రైలు పెట్టెలోకి వెళ్ళినట్లు తెలియటంలేదు. ఎందుకంటే, లోపలకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న వారందరూ తాము లోపలకు వెళ్లకపోయినా పరవాలేదు, తనకు ముందు ఇంకెవరూ పెట్టెలోకి ఎక్కకూడదనే కారణం వలన మిగతావారిని అడ్డుకోవడానికి తమ బలాన్నంతా ఉపయోగిస్తున్నారు.

కానీ, పరంధామయ్య మాత్రం 'పోర్టర్ ఒకతన్ని బేరమాడి....కిటికీ దగ్గరున్న సీటును పట్టుకుని హాయిగా కూర్చున్నారు.

సూట్ కేసును తన కాళ్ళ కింద పెట్టి గొలుసుతో సీటు పక్కనున్న ఇనుప కడ్డీకి కట్టి తాళం వేసి, తాళంచెవిని జాగ్రత్తగా బద్రపరచుకున్నారు. ఇంకో సంచిని తనకూ, కిటికీకి  మధ్య దిండులాగా పెట్టుకున్నారు. సంచీలో నుంచి ఒక దుప్పటి తీసి రాత్రి పూట ఉపయోగించుకోవటానికి తన భుజాలపై వేసుకున్నారు.

రైలు బయలుదేరటానికి ఇంకా చాలా సమయం ఉన్నది.

ప్రయాణీకులు మాట్లాడిన(అరిచిన!)బెంగాలీ, హిందీ, తమిల్, కన్నడం అని ఒక కలగలపు భాష పెట్టెనే అధరగొడుతోంది.

ప్లాట్ ఫారం పైన, రైలు పెట్టెలోనూ చిన్న చిన్న వస్తువుల వ్యాపారం చురుకుగా జరుగుతున్నది.

పరంధామయ్య, తన చుట్టూ క్షుణ్ణంగా గమనించినప్పుడు తెలుగు తెలిసిన ఎవరూ ఆయన కూర్చున్న చోట ఉన్నారనే తెలియటం లేదు. ఆయనకి హిందీ బాగా వచ్చు గనుక దాని గురించి బాధపడలేదు.

మీకు ఇప్పుడొక ఒక సందేహం రావచ్చు!

' రైలు పెట్టెలో వందాలాది ప్రయాణీకులు ఉంటే...ఎందుకు పరంధామయ్య మీద మాత్రం ఇంత శ్రద్ద?' అని అడగటం తెలుస్తోంది.

దానికి ఒక కారణం ఉంది.

రైలు బయరుదేరటానికి కొద్ది నిమిషాల ముందు ఆయన జీవితాన్నే మార్చి వేయబోయే సంఘటన జరగబోతోంది.

'అది ఏమిటి?' అని అడుగుతున్నారా!

కొంచం ఒర్పు వహించండి. దానికి ముందు పరంధామయ్య గురించిన వివరాలు చెప్పి ముగిస్తాను.

అతను అనో, లేక ఆయన అనో అని చెప్ప లేని 40 ఏళ్ళు. మనం 'ఆయన అనే చెబుదామే! సొంత ఊరు గుడివాడ కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైన తరువాత కూడా రాజకీయాలూ, సినిమాలు తప్ప వేరే విశేష మార్పులు చూడని గ్రామం.

ప్రొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి అంటూ ఒక రోజుకు రెండుసార్లు ప్రభుత్వ బస్సులు వచ్చి వెడతాయి. అందులో ప్రయాణం చేయటానికి ఇష్టపడే వాళ్ళు...మొదట్లో దాన్ని(బస్సును)కొంచం దూరం తోసుకు వెళ్ళి 'స్టార్ట్' చెయ్యాల్సి ఉంటుంది. ఒక వేల అది పాడైపోతే బాగుపడి వచ్చేంతవరకూ వేరే బస్సు లేదు. మధ్య మధ్యలో ఒక 'మినీ' బస్సు వచ్చి వెడుతుందికానీ, దానికీ ఎటువంటి పూచీ లేదు. పక్క ఊర్లలో ఏదైనా సంబరాలు జరిగితే 'మినీ' బస్సు అటు వెళ్ళిపోతుంది.

పరంధామయ్య యొక్క ముత్తాతకు - ముత్తాతలు తరతరాలుగా జమీందార్లుగా -- బ్రిటీష్ పరిపాలనలో ముఖ్య ప్రముఖులుగానూ ఎడ్ల బండీలలో తిరుగుతూ ఉండేవారు. వాళ్ళ మాటకు ఊరే కట్టుబడి ఉంటుంది.

ఇప్పుడు 'పెద్దింటి ఇళ్లు అనే పేరు మాత్రమే సొంతం. కనీసం గ్రామ పంచాయితీ ప్రెశిడెంట్ గా కూడా పరంధామయ్య లేడు రోజైతే ఊరు మధ్యలో ఉన్న అమ్మోరి గుడి ముందున్న జంక్షన్లో పది పదిహేను స్థంబాలలో 'రంగు రంగుల జెండాలు ఎగరటం మొదలైందో...అప్పుడే 'నేను గెలుస్తానా?' అనే అపనమ్మకం కూడా పరంధామయ్య మనసులో జెండాలా ఎగిరింది. పోటీ చేసి ఓడిపోవటం కంటే పోటీ చేయకుండా తప్పుకోవటమే గౌరవం అని అనుకున్నారు. అప్పట్నుంచి వ్యవసాయం, వ్యాపారం అని ఉండిపోయారు. సమాజ కార్యక్రమాలలో అంటీ అంటనట్టు నడుచుకునేవారు.

పరంధామయ్యను విజయవాడలోని ఒక కాలేజీలో చేర్చి చదివించారు ఆయన తండ్రి. ఆయన కూడా కష్టపడి చదివి గ్రామంలోనే 'డిగ్రీ' ముగించిన మొదటి తెలివిగల మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ, పై చదువు చదవటానికి ఆశపడినప్పుడు...వ్యవసాయం చూసుకోవటానికి  తనకు సహాయంగా ఉంటాడని కొడుకు చదువుకు ముగింపు కార్డు చూపించాడు తండ్రి. పరంధామయ్య కూడా వ్యవసాయం చేయటాన్ని గౌరవానికి భంగం అనుకోకుండా పూర్తి శ్రద్దతో పనిచేయడం వలన రోజు రోజుకూ వాళ్ళ ఆస్తుల లెక్క పెరుగుతూ వచ్చింది.

కాలంలో పంట వేయాలో తెలుసున్న పరంధామయ్య తండ్రి వయసులో పెళ్ళి చేయాలో వయసులో పరంధామయ్యకు పెళ్ళి చేయటంతో, పెద్ద ఇంటికి కోడలుగా రాజరాజేశ్వరి వచ్చి చేరింది. లోటు ఏమీ లేని గుణవంతురాలిగా ఉండటం వలన, పరంధామయ్యపరంధామయ్య జీవిత ప్రయాణం హాయిగా వెడుతున్నది.

కానీ, పెళ్ళై పది పదిహేను సంవత్సరాలు పూర్తి అయినా, వారసుడ్ని కనివ్వలేకపోయేనే నన్న బాధ ఆమెనూ, ఇంట్లో ఉన్న మిగిలిన వారినీ బాధకు గురి చేసింది. బాధ తోనే పరంధామయ్య తల్లి-తండ్రులు ఒకరి తరువాత ఒకరు కన్ను మూయటం వలన, ఇంటి పూర్తి బాధ్యత పరంధామయ్య నెత్తి మీద పడింది.  

ఆస్తులన్నీ ఆకాశాన్ని చూస్తున్న భూమిలాగా ఉన్నాయి. భూగర్భ నీటి యొక్క లోతు దిగిపోవటంభావి నీటి పారుదల అబద్దం అవడం ప్రారంభించటంతో, పూర్తిగా వ్యవసాయంపైనే ఆశ, నమ్మకం పెట్టుకోకుండా వేరే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టటానికి పరంధామయ్యకు చదువు నేర్పిన తెలివితేటలు అతనికి సహాయపడింది.

గ్రామంలోని తన పొలంలో పండిన పత్తితో పాటు మిగిలినవారి దగ్గర నుండి కూడా పత్తిని కొని, 'కమీషన్ ఏజంట్లు పిచ్చి లాభాలు కొట్టేయకుండా ఉండటానికి, కలకత్తాకే నేరుగా  తీసుకువచ్చి అమ్మటం వలన ఆయనకు మంచి లాభం దొరికింది. హిందీ, బెంగాలీ సరళంగా తెలిసుండటంతో, వ్యాపారం లాభకరంగా చేయగలిగాడుదానికోసమే సారి కూడా ఆయన కలకత్తా వచ్చాడు.

కానీ, ఊరు తిరిగి వెళ్ళటానికి రిజర్వేషన్ దొరకలేదు. అందువలన జెనెరల్ బోగీలో ప్రయాణం చేస్తున్నాడు. రైలు బయలుదేరబోతోందని ప్రకటన వచ్చిన తరువాత ప్లాట్ ఫారం మీద హడావిడి మొదలైయ్యింది.

అప్పుడు........

యౌవనదశలో ఉన్న ఒక అమ్మాయి భుజం మీద నిద్రపోతున్న పసిబిడ్డతో, చేతిలో ఒక గుడ్డ సంచితో పరిగెత్తుకు వచ్చి పెట్టిలో ఎక్కింది.

ఒక విధమైన భయం కలిసిన ఆందోళనతో హడావిడీగా ఒక్కొక్కరి మొహం చూస్తూ వచ్చిన ఆమె... పరంధామయ్యను చూసిన వెంటనే 'తెలుగోడు అనేది అర్ధంచేసుకోనుంటుంది. గబగబ నడుస్తూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని,"అయ్యా...నన్ను కాపాడండి. ముగ్గురు మొరటోళ్ళు నన్ను తరుముకుంటూ వస్తున్నారు. వాళ్ళ చేతులకు దొరికితే  నన్ను నాశనం చేస్తారు" అంటూ బోరుమని ఏడ్చింది.

అలాగే ఆయన కాళ్ళ దగ్గర ముడుచుకుపోయి కూర్చుని, అప్పుడప్పుడు తలెత్తి తనని తరుముకుంటూ వచ్చిన మొరటోళ్ళ కనబడుతారేమోనని కలవరపాటుతో ప్లాట్ ఫారం వైపు చూస్తోంది.

మహాభారతంలో దుశ్శాసనుడు వివస్త్రను చేయటానికి వచ్చినప్పుడు, తనవల్ల ఏమీ చేయలేనన్న ఆలోచన వచ్చినప్పుడు పాంచాలి అంతవరకు తన రెండు చేతులతో పట్టుకున్న చీరను వదిలేసి, రెండు చేతులూ పైకెత్తి శ్రీక్రిష్ణ పరమాత్మను సహాయనికి పిలిచిందే...అదేలాగా అమ్మాయి కూడా సహాయం అడిగి కాళ్ళ దగ్గర పడున్నది గ్రహించారు...జాలి పడ్డారు పరంధామయ్య.

              *********************************PART-2**********************************

(ముక్కూ మొహం తెలియని ఒక వ్యక్తికి తాముగా ముందుకు వచ్చి చేసే సహాయానికి ఆకాశాన్నీ, భూమినీ   పరిహారంగా ఇచ్చినా సరిపోదు)

సహాయం అడిగి తన కాళ్ళ దగ్గర పడున్న ఆమె ఎదో పెద్ద ఆపదలో ఉన్నదని అక్కడున్న తెలుగు తెలియని వాళ్ళు కూడా సులభంగా అర్ధం చేసుకున్నారు.

అప్పుడు కొంతమంది హడావిడిగా ఎవరినో వెతుకుతున్నట్టు ఒక్కొక్క కిటికీలో నుండీ రైలు పెట్టెలోకి క్షుణ్ణంగా  చూస్తూ వస్తుండటం చూశారు.

అమ్మాయినే వెతుకుతున్నారని గ్రహించిన పరంధామయ్య వెంటనే పనిలోకి దిగారు. బిడ్డను తీసుకుని ఎదురుగా కూర్చున్న ఆడవాళ్ళ దగ్గర ఇచ్చి బెంగాలీలో ఏదో చెప్పారు. వాళ్ళల్లో ఒకామె బిడ్డని తన చీర కొంగులో చుట్టి మొహం కనబడకుండా గుండెలకు  హత్తుకుని ఉంచుకుంది.

అమ్మాయిని కాళ్ళదగ్గర ముడుచుకుని పడుకోబెట్టి తన భుజంపైన వేసుకున్న దుప్పటితో ఆమెను పూర్తిగా కప్పారుహడావిడిగా వచ్చిన ముగ్గురూ, పెట్టె మొత్తం వెతికారు. అందులో ఒకడు తెలుగు వాడు. మిగిలిన ఇద్దరూ బెంగాలీ వారు.

వాళ్ళవల్ల ఆమె ఉన్న చోటును కనుక్కోలేకపోయారు. పరంధామయ్య మాత్రం అంత  వేగంగా పని చేసుండకపోతే ఆమె ఖచ్చితంగా వాళ్ళకు దొరికిపోయేది.

అలా జరిగుంటే ఆమె గతి ఏమై పోయుంటుందని అనుకుని ఆమెకోసం జాలి పడ్డారు.

సమయంలో రైలు బయలుదేరటంతో, ముగ్గురు మొరటోళ్ళూ పెట్టెలోనే ఉండి, అటూ, ఇటూ చూస్తూ ఆమెకోసం వెతుకుతున్నారు.

"ఖచ్చితంగా పెట్టెలోనే ఉండాలి. అది పెట్టెలోకి ఎక్కటం నేను చూశాను" అని అందులో ఒకడు నమ్మకంగా చెప్పాడు. పెట్టెలోని ప్రతి చోటునీ క్షుణ్ణంగా చూసుకుంటూ వచ్చిన వాళ్ళు, పరంధామయ్య కూర్చున్న చోటు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడున్న అందరికీ ఆందోళన పట్టుకుంది.

తనని తాను ధైర్యపరచుకుని ముగ్గురిలో తెలుగు తెలిసున్న అతన్ని చూసి, "ఏంటయ్యా...ఏమిటి వెతుకుతున్నారు?" అని కొంచం స్వరం పెద్దదిచేసి అడిగారు పరంధామయ్య.

దానికి అతను, "ఏమీ లేదండీ, ఏమీలేదు" అని చెబుతూ మిగితా ఇద్దరితో కలిసి అక్కడ్నుంచి జారుకున్నాడు. అక్కడున్న వారికి అప్పుడు గాని గుండె దఢ తగ్గలేదు.

అరగంట వెతకిన తరువాత వాళ్ళులో కొంచం కొంచం గా నమ్మకం తగ్గింది. తరువాతి స్టేషన్ వచ్చిన తరువాత పెట్టెలో నుండి దిగి మిగితా పెట్టల్లో వెతకటానికి వెళ్ళిపోయారు.

ఎక్కడ వెతికినా ఆమె దొరకలేదనే కడుపు మంట, కచ్చె వాళ్ళ మొహంలో అతుకున్నట్టు బాగా తెలుస్తోంది. వాళ్ళు ముగ్గురూ తీవ్రంగా వివాదించు కుంటున్నారు.

ఇంతలో రైలు స్టేషన్ నుండి బయలుదేరి మెల్ల మెల్లగా వేగం పుంజుకుంది.

పరంధామయ్య కిటికీలో నుండి   ముగ్గురునీ చూస్తూనే ఉన్నారు. అలా ఆ ముగ్గురునీ కనుమరుగయ్యేంత దూరం వరకు చూస్తూనే ఉన్నారు. అప్పటికే రైలు వేగం ఎక్కువ అయ్యిందివాళ్ళు  కనుమరుగైన తరువాత వాళ్ళు ఇతర పెట్టెలోనూ ఎక్కలేదని, బండీ వెడుతున్న వేగానికి పెట్టెలోనూ ఎక్కలేరని నమ్మారు.

ఆపద తొలగిపోయిందని అమ్మాయి దగ్గర చెప్పారు. ఆమె తడబడుతూ లేచి కూర్చుని తన బిడ్డను తీసుకుంది. ఆమె లోని భయం పూర్తిగా తగ్గలేదని ఆమె ముఖమూ, వణుకుతున్న చేతులు చూపెడుతున్నాయి.

ఎవరైనా తనని వెతుకుతున్నారా అని అన్వేసిస్తున్నట్టు అప్పుడప్పుడు అటూ ఇటూ చూస్తోంది.

కొంచం కొంచంగా భయం తగ్గుతూ సహజ స్థితికి వచ్చిన తరువాత కూడా నీరసంగా కనబడింది. నిద్ర లేచిన బిడ్డకు ఆకలి కాబోలు...ఏడుపు మొదలెట్టింది.

రైలులో అమ్మకానికి వచ్చిన బిస్కెట్టు, పండ్లు, టీ లాంటివి కొని ఇచ్చాడు. ఆమెకూ ఆకలి. వద్దని చెప్పకుండా తీసుకుని ఇద్దరూ తిన్నారు.

రైలు ఊర్లు దాటి వెడుతుంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రయాణీకులు మధ్య మధ్య దిగేరు. అప్పుడు ఆయన తన ఎదురు సీటులో కూర్చోమన్నప్పుడు...ఆమె సీటులో కూర్చుంది.

కొత్తగా ఎక్కిన ప్రయాణీకులు మిగిలి ఉన్న చోటును నింపటంతో, పెట్టెలో రద్దీ తగ్గలేదు. ఆమె దగ్గర 'టికెట్టు లేదని అమె యొక్క భిక్కు భిక్కు మంటున్న చూపులే చెబుతున్నాయి. టికెట్ చెకింగ్ స్టాఫ్ పెట్టెలోకి ఎక్కి ఆమె దగ్గరకు వచ్చి, ఆమె దగ్గర టికెట్టు లేదని తెలుసుకుని హిందిలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది ఆమెకు అర్ధం కాలేదు. కానీ, పరంధామయ్య కు అర్ధమయ్యింది. వచ్చే స్టేషన్ లో దిగిపోవాలని చెబుతున్నారు.

"ఎక్కడికి వెళ్ళాలి?"-- అడిగాడు పరంధామయ్య.

జగ్గయ్యపేట కు దగ్గరలో ఉన్న వెంకటాద్రి పురం" హీన స్వరంతో సమాధానం వచ్చింది.

పరంధామయ్య ఆమెకోసం విజయవాడ వరకు అపరాధంతో కలిపి టికెట్టుకు డబ్బులిచ్చి రసీదు తీసుకున్నారు.

చిన్నగా తలెత్తి చూసినప్పుడు...ఆమె కళ్ళు ఆయనకు శతకోటి ధన్యవాదాలు చెబుతూ కన్నీరు కారుస్తున్నాయి.

పెట్టెలోని వాళ్ళంతా నిద్రలో ఉన్నారు! కానీ, పరంధామయ్య కు నిద్ర రాలేదు. '  అమ్మాయి ఎవరు? ఆమెను తరుముకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరు? ఏందుకు ఆమెను తరుముకుంటూ వచ్చారు? ఈమె మంచిదా...చెడ్డదా?' అంటూ పల రకాల ప్రశ్నలు. ప్రశ్నలన్నిటికీ ఆమె దగ్గర నుండి సమాధానాలు ఎదురు చూసి కాచుకోనున్నారు.

ఆమె కూడా నిద్రపోలేదు! కిటికీలో నుంచి ఆమె చూపులు ఎక్కడో దూరంగా చూస్తున్నాయి. మాట్లాడుతేనే దుఃఖం తగ్గుతుందని అనుకోవటంతో, "నీ పేరేమిటమ్మా?" అని అడిగారు.

" మంగమ్మ " సన్నటి స్వరంతో చెప్పింది.

"నిన్ను తరుముకొచ్చినవారు ఏవరు...ఎందుకు తరుముకుంటూ వచ్చారు?"

" ముగ్గురిలో ఒకతన నా భర్త. మిగిలినవారు అతని స్నేహితులు. చెయ్యకూడని పనిలో నన్ను...నా భర్తే..."

అంతకు పైన మాట్లాడలేక నొరు నొక్కు కుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.

పరంధామయ్య కు అంతా అర్ధమయ్యింది. ఆమె దయనీయ స్థితి తెలుసుకుని కలత  చెందారు. ఆమెను ఇంకేమీ ప్రశ్నలు అడగ కుండా వదిలేశారు. కిటికీ ఊచల మీద తల ఆనించుకుని ఆలొచనలో మునిగిపోయారు. ' దేశంలో ఆడవాళ్ళను ఎనెన్ని రకాలుగా కష్టపెడుతున్నారు?' అని ఆలొచించినప్పుడు మనసు భారం అయ్యింది. ఎప్పుడు నిద్రపోయేరో తెలియలేదు.

ప్రొద్దుటి ఎండ చుర్రుమని ముఖం మీద పడటంతో మేలుకున్నారు. రైలు ఏదో ఒక స్టేషన్ లో ఆగున్నది. హడావిడి పడుతూ క్రిందకు దిగి టిఫినూ, వాటర్ బాటిల్ కొనుక్కుని రైలు పెట్టెలోకి ఎక్కిన వెంటనే...రైలు బయలుదేరింది.

ఆమె దగ్గర ఒక ప్యాకెట్ ఇచ్చారు.

బిడ్డకు కొంచం పెట్టి, తాను తింటున్నప్పుడు ఆమెకు 'తరువాత ఏమిటీ?' అన్న ప్రశ్నతో ఆమెలో భయం చోటు చేసుకుంది.

పరిగెత్తుకునొచ్చి రైలు ఎక్కినప్పుడు పెట్టెలో తనకి ఇలా సహాయం దొరుకుతుందని అలొచించి కూడా చూడలేదు. భర్త అనే మృగం దగ్గర నుండి తప్పించుకుంటే చాలు  అనే ఒకే ఒక ఆలొచనే ఉండేది.

ఇంటి నుండి బయలుదేరి, తెలియని వీధులలో నుండి రైల్వే స్టేషన్ కి వచ్చి - రైలు ఎక్కి - మొరటోళ్ళ దగ్గర నుండి తప్పించుకుని - సగం దూరం వచ్చిన తరువాతే తన సోయలోకి వచ్చింది.

ఇప్పుడే ఆమె పరంధామయ్య గురించి ఆలొచించటం మొదలుపెట్టింది. 'ఎవరీయన?  ఎందుకని ఇన్ని సహాయాలు తానుగా ముందుకు వచ్చి చేస్తున్నారుఈయన మంచివారా లేక నా భర్తలాగా ఇంకొక నయవంచకుడా?' అని పలు రకాలుగా ఆలొచించి కన్ ఫ్యూజ్ అయ్యింది.

కానీ, మరు క్షణమే ఆలొచనను మార్చుకుంది. 'లోకంలో మంచి మగవాళ్ళూ ఉన్నారు. చెడ్డవాడితో కలిసి కాపురం చేసి కష్టాలు పడ్డందువలన ఈయన్ని కూడా మనసు తప్పైన మనిషిగా తూకం వేస్తోంది అని ఆలొచించింది.

అప్పుడు ఆయన అన్నారు, "మనో భారాన్ని ఎవరి దగ్గరైనా చెప్పుకుంటేనే భారం తగ్గుతుంది. నువ్వు నీ జీవితంలో ఏన్నో కష్టాలు అనుభవించి ఉంటావని నిన్ను చూస్తేనే తెలుస్తోంది. అది నా దగ్గర చెప్పాలనుకుంటే చెప్పు...కానీ, నిర్భంధం లేదు" అన్నారు.

ఆమెకు ఇదే మొదటిసారి ఆయన కళ్ళను నేరుగా చూడటం. 'ఇంత మంచి మనిషిని అనవసరంగా తప్పుగా అనుకున్నామే?’ అని బాధ పడ్డది. జరిగిపోయిన తన జీవితం గురించి ఆయన దగ్గర కొంచం కొంచంగా చెప్పి ముగించింది.

              ***********************************PART-3********************************

(మంచివాళ్ళతో పాటు చెడ్డవాళ్ళు, మంచివారులాగా నటించి కలిసి జీవిస్తారు. ఆలా ఉన్నప్పుడు చెడ్డజాతి వారిని కనుక్కోవటం జరిగేపనికాదు)

ఆమె పేరు మంగమ్మ. జగ్గయ్యపేట దగ్గరున్న వెంకాటాద్రి పురం ఆమె సొంత ఊరు. వర్షం అనేది సంవత్సరానికి ఒకటి రెండు రోజులే చూస్తారు.

గ్రామానికి చుట్టూ ఉన్న చిన్న అడవి ప్రాంతంలో ఉన్న ఎండిపోయిన చెట్లను ముక్కలు చేసి కట్టెలుగానో, లేక బొగ్గుగానో అమ్ముతారు గ్రామంలోని చాలా మందికి అదే వృత్తి.

పేదరికం రేఖకు కింద ఉన్న వాళ్ళను చూపించాలనుకుంటే, మంగమ్మ కుటుంబమే దానికి ఉదాహరణం.

రోజు కారోజు సంపాదించుకునే కూలీ డబ్బులే వాళ్ళకు ఆహారం. ఆమె తల్లి-తండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. అందులో మంగమ్మే పెద్ద కూతురు.

ఆడపిల్లా ఐదో క్లాసు దాటలేదు...దాటటం కుదరలేదు. క్లాసు వరకూ స్కూలుకు వెళ్ళటానికి కారణం...చదువు మీద శ్రద్ద ఉండి కాదు. స్కూల్లో పెడుతున్న మధ్యాహ్నం భోజనం కొసమే ననడం నిజం.

25 ఏళ్ల వయసు దాటినా ఆమె తల్లి-తండ్రులు ఆమెకు పెళ్ళి చేయాలనే ఆలొచన కూడా చెయ్యలేకపోయారు. నగలకు, కట్నానికి, సారెకు--అన్నిటికీ డబ్బులు కావాలే! దానికి వాళ్ళు ఎక్కడికి వెడతారు?

పిల్లలను తలచుకుని రాత్రి, పగలు కన్నీరు కార్చడమే వాళ్లవల్ల అయ్యింది. 'దేవుడే దారి చూపిస్తాడు అనే నమ్మకంతో రోజులు గడిపారు.

పరిస్థితుల్లోనే అపద్భాందువుడిలాగా వచ్చి నిలబడ్డాడు వాళ్ళకు బందువైన ఏడుకొండలు. వాడికీ అదే ఊరే. వాడి కుటుంబం కూడా పేద కుటంబమే.

బ్రతకటం కోసం చిన్న వయసులోనే కలకత్తా వెళ్ళిపోయాడు. చాలా కష్టపడి పైకొచ్చి రోజు మంచి పొజిషన్లో ఉన్నాడు. ఎండాకాలంలో జరిగే అమ్మోరి జాతరకు, సంక్రాంతికి ఊరికి వచ్చి వెడుతూ ఉంటాడు.

హఠాత్తుగా ఒక రోజు మంగమ్మను పెళ్ళిచేసుకుంటానని అడుగుతూ మంగమ్మ ఇంటికి వచ్చాడు. సరే ననే మీ అంగీకారం మాత్రం చాలు...ఖర్చంతా నాదేనని హామీ ఇచ్చాడు.

దేవుడు కరుణించేడని మంగమ్మ తల్లి-తండ్రులు ఆనందపడ్డారు. ఎక్కువ  ఆలొచించకుండా వాళ్ళ అగీకారం తెలిపారు. మూడింట ఒక భారాన్ని ఖర్చులేకుండా దింపి కింద పెట్టారు.

భర్తతో కలకత్తా బయలుదేరినప్పుడు...తాను అదృష్టవంతురాలు నని ఆనందపడటమే కాకుండా, గర్వ పడింది. కలకత్తా వచ్చి చేరిన తరువాత ఏదో కొత్త లోకానికి వచ్చినట్లు ఫీలైంది.

మొదట్లో జీవితం ఉత్సాహంగా ఉన్నది. మనసులో ఊహించు కున్నదానికంటే కలకత్తా  అతిపెద్ద అద్భుతంగా తెలిసింది. భర్తకు ప్రముఖ 'కంపెనీ' లో నైట్ డ్యూటి. సాయంత్రం బయలుదేరి వెడితే తెల్లవారు జామున తిరిగి వస్తాడు. పగలంతా నిద్రపోతాడు.

అప్పుడప్పుడు ఆమెను బయటకు తీసుకు వెళ్ళాడు. ఒకసారి సముద్ర తీరానికి తీసుకు వెళ్ళాడు. సముద్రతీర అందాన్ని తిలకించి స్థంభించిపోయింది. 'ఇదేనా స్వర్గం?' అని ఆలొచంచి బ్రమ పడింది.  

కొన్ని సార్లు మార్కెట్టుకు తీసుకు వెళ్లాడు. అతను కొనిచ్చిన దుస్తులను ఆనందంగా వేసుకునేది. కానీ, అమెగా ఏదీ అడిగి కొనుక్కోలేదు. పుట్టినింటి పేదరికం ఆమెను అంత పక్వ పర్చి ఉంచింది. కొడుకు పుట్టాడు. కొడుకుకు సత్యపాల్ అని ఆధినిక బెంగాలీ పేరు పెట్టాడు ఏడుకొండలు. ఇదేం పేరని మంగమ్మ అడిగినప్పుడు 'ఇంకా గ్రామ వాతావరణం నుండి నువ్వు బయటకు రాలేదా. ఇది పట్నం పేరు. అలాగే ఉంటుంది అని చెప్పాడు.

కొడుకు సత్యపాల్ పుట్టి ఐదారు నెలల వరకు అంతా బాగానే గడిచింది. కానీ, పోను, పోనూ భర్త ఏదో తప్పైన దారిలోనే సంపాదిస్తున్నాడని ఆమె ఫీలైంది. గుచ్చి గుచ్చి అడిగినప్పుడు...కలకత్తా లోని రెడ్ లైట్ ఏరియాలో 'బ్రోకర్ పని చేస్తున్నాడని తెలిసింది.

మంగమ్మ తల మీద పిడుగు పడినట్లు అయ్యింది. కడుపుకు పావు గ్లాసు గంజి నీళ్ళు తాగినా నీతిగా తాగిన కుటుంబం వాళ్లది. రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య  అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. రోజులు గడుస్తున్న కొద్ది అది పోట్లాటగా మారి, రోజూ అతను తాగి రావడం...ఆమెను కొట్టి బాధ పెట్టటం మొదలైయ్యింది. సరిగ్గా ఇంటికి రావటం లేదు. తనకి ఆదరణగా ఎవరూ దగ్గరలో లేకపోవటం; కుటుంబ గౌరవాన్ని కాపాడటం కోసం అన్నిటినీ తట్టుకుంది. కానీ, ఒకరోజు అతను చెప్పింది ఆమెకు భారీ దెబ్బగా తగిలింది.

అవును, ' వ్యాపారంలో' ఆమె కూడా దిగాలని, సంపాదించాలని ఆజ్ఞ వేశాడు. అతని కాళ్ళ మీద పడి బ్రతిమిలాడింది. 'నువ్వు ఎలాగైనా పో...నన్ను వదిలేయి అని వేడుకుంది.

దేనికీ అతని మనసు కదలలేదు. నేను చెప్పింది చెప్పిందే అని కర్కసంగా ఉన్నాడు.

రోజు ప్రొద్దున ఇంటికి వచ్చిన అతను, "సాయంత్రం వస్తాను. మర్యాదగా నాతో పాటూ బయలుదేరి రావాలి. లేకపోతే జరిగేదే వేరు" అంటూ హెచ్చరించి వెళ్ళాడు. దారుణాన్ని తట్టుకోలేక...'ఎలాగైనా అమ్మా-నాన్నల దగ్గరకు వెళ్ళి చేరిపోవాలి అని నిర్ణయించుకుంది.

అక్కడ ఉండే ఒక్కొక్క క్షణం అపదే అనేది గ్రహించింది. తనకీ, బిడ్డకూ కావలసిన కొన్ని దుస్తులు తీసుకుని సంచీలో పెట్టుకుంది. అవసరానికి కావాలి కాబట్టి డబ్బు కొసం వెతికినప్పుడు -- చెతిలో చిల్లి గవ్వ కూడా లేదనేది తెలిసింది.

మధ్య రోజుల్లో ఏడుకొండలు ఆమె దగ్గర డబ్బులేమీ ఇవ్వటం లేదు. ఇంటికి కావలసిన వస్తువులను కూడా సగం సగం, ఇష్టం లేకపోయినా కొని పడేశాడు. కొన్ని సమయాలలో వంట చేయటానికి ఏమీ లేక వంట చేయకుండా పస్తు పడుకునేది.

సమయంలో కూడా అతని దగ్గర ఏమీ అడిగి తీసుకోవటానికి ఆమె ఆత్మగౌరవం చోటివ్వలేదు!

డబ్బులే లేకుండా జగ్గయ్యపేటకు ఎలా వెళ్ళేది? ఎక్కువ ఆలొచించలేదు. 'మొదట నగరం విడిచి వెళ్ళిపోవాలి -- అనుకున్న వెంటనే...ఉన్న కొంచం చిల్లర డబ్బులు తీసుకుని, బిడ్డను ఎత్తుకుని బయటకు వచ్చింది.

ఇంటి బయట భర్త స్నేహితుడొకడు ఆమెను అడ్డుకున్నాడు. "థూ కుక్కా...దారి వదులరా" అంటూ అరుస్తూ వాడి మీద ఉమ్మేసింది. అందువల్ల భయపడ్డాడో ఏమో...జరిగి దారి వదిలాడు. కానీ, సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఆమెను వెంబడించాడు.

అక్కడా, ఇక్కడా విచారించి, రైలు స్టేషన్ వెళ్లటానికి ఎక్కాల్సిన సిటీ బస్సులో ఎక్కింది. అతనూ ఎక్కాడు. ఆమెను వెంబడించిన అతను  ఇచ్చిన వార్త వలన భర్త వస్తాడనేది ఎదురు చూసి జాగ్రత్తగా రైలు స్టేషన్ లోకి దూరింది.

అప్పుడొచ్చిన ఒక ప్రకటనలో...తిరుపతి వెళ్ళే రైలు గురించిన సమాచారం విని కొంచం కొంచం అర్ధం చేసుకుని వేగంగా నడుచుకుంటూ మూడో నెంబర్ ప్లాట్ ఫారం లో ఉన్న రైలు ఎక్కింది. అప్పుడే భర్త స్నేహితుడు చూశాడు.

తరువాత జరిగింది మీకు తెలుసుగా!

వివరాలన్ని అడిగి తెలుసుకున్నాక పరంధామయ్య, ఆదరణగా చెప్పారు: "ఇక నువ్వు దేనికీ భయపడటానికో, బాధపడటానికో అవసరం లేదు. విజయవాడలో దిగి, నిన్ను జగ్గయ్యపేట బస్సు ఎక్కించి నేను ఊరికి బయలుదేరుతాను" అన్నారు.

'భర్త తన చెయ్యి వదిలేసినా కూడా దేవుడు పూర్తిగా తన చేయి వదలలేదుఅని అనుకుంటూ ప్రశాంతంగా ఉన్నది మంగమ్మ. ఆమె కళ్ళకు పరంధామయ్య సాక్షాత్తు దైవంలాగా తెలిసారు. 

రాజరాజేశ్వరికి ఫోన్ చేసి మాట్లాడారు.

"ఏమండీ...ఎక్కడున్నారు?" -- ఆందోళనగా అడిగింది.

"రైలులో వస్తున్నాను. విజయవాడలో నాకు ఒక పనుంది. అది ముగించుకుని రాత్రికి వస్తాను...అది సరే నువ్వెందుకు అంత ఆందోళనగా మాట్లాడుతున్నావు?"

"మీరు రాత్రి పూట రావద్దు. విజయవాడలో రాత్రికి స్టే చేసి ప్రొద్దున వస్తే చాలుగుడివాడ నుంచి టాక్సి పట్టుకుని వచ్చేయండి"

"నువ్వెందుకు అంత ఆందోళనతో మాట్లాడుతున్నావు? అక్కడ ఏమిటి సమస్య...చెప్పు" ---అదికార స్వరంతో అడిగాడు.

అంతకుపైన ఆమె ఏదీ దాచ దలుచుకోలేదు. "మీరు వెళ్ళిన తరువాత ఇక్కడ కుల కలహాలు చోటుచేసుకుంది. వీధికి వీధి కొట్టుకుంటున్నారు. రాత్రి పూట గుడిసెలకు నిప్పు పెడుతున్నారు. ఇళ్ళ మీద రాళ్ళు రువ్వుతున్నారు. పోలీసు బలగాలను ఎక్కువగా దింపటం వలన భయం లేదండి"

గుండే దఢ తగ్గ కుండానే చెప్పి ముగించింది.

"ఇంత గోల జరిగింది. నా దగ్గర ఎందుకు ఏమీ చెప్పలేదు?"--స్వరంలో కోపం తెలుస్తోంది.

"ఇందులో మనకేమీ సమస్య లేదండి. అందువలన మీరు వెళ్ళిన పనిని ప్రశాంతంగా ముగించుకుని రావాలని ఏమీ చెప్పలేదు..."

పరంధామయ్య నమ్మేటట్టు నిదానంగా చెప్పి ముగించింది. కానీ, పనివాడు వెంకయ్య చెప్పిన విషయాల వలన ఆమె బెదిరిపోయిందనేదే నిజం.

              *********************************PART-4**********************************

(విధి చాలా చాలా బలమైనది. దాన్ని అడ్డుకుందామని మనం ఏ పని చేసినా దాన్నీ దాటి అది తన పని చేస్తుంది.)

పరంధామయ్యకు వారసులు లేకపోవటంతో ఆయన ఆస్తులన్నీ తమకే దొరకుతుందని ఆయన సమకాలికులు, వాళ్ళ వారసులు పగటి కలలు కన్నారు.

పరంధామయ్య కన్ను మూసిన తరువాతే ఆస్తులు తమ చేతులకు వస్తాయి కాబట్టి ఆయన ఎప్పుడు మరణిస్తారోనని కాచుకోనున్నారు. ఆయనకు ప్రస్తుతం 40 ఏళ్ళే అవుతోంది కాబట్టి, ఆయనగా మరణించాలంటే చాలా రోజులు కాచుకోవాలి. అంతవరకు కాచుకోవటానికి ఆయన సమకాలికులలో కొందరికి ఓర్పులేదు.  

అందువలన. కుల కలహాలను ఉపయోగించుకుని ఆయన్ను చంపటానికి ప్లాన్ వేశారు. సమయం చూసి పరంధామయ్య బయట ఊరు వెళ్ళటం వలన, ఆయన తిరిగి వచ్చే రోజుకోసం కడుపు మంటతో ఎదురుచూస్తున్నారు. మంచికాలం... రహస్య పన్నాగం వెంకయ్య చెవులలో పడింది. అతను ఆందోళన చెందుతూ పరిగెత్తుకు వచ్చి రాజరాజేశ్వరి దగ్గర చెప్పాడు.

అది విన్నప్పుడు ఆమెకు నెత్తిమీద పిడుగు పడినట్లు అనిపించింది. అందుకోసమే 'రాత్రి పూట రావద్దు అని చెప్పింది. అయన జాగ్రత్తగా ఇళ్లు చేరాలని దేవుళ్ళందరినీ వేడుకుంది.

రైలు విజయవాడ చేరుకున్నప్పుడు రాత్రి తొమ్మిది దాటింది. సమయం తరువాత మంగమ్మను బస్సు ఎక్కించ లేరు. తనని కూడా రాత్రి పూట ఊర్లోకి రావద్దని చెప్పింది భార్య. ఏం చెయ్యాలో తెలియక బుర్ర గోక్కున్నారు పరంధామయ్య.

అప్పుడు మంగమ్మ చెప్పింది: నాకు కొంచం డబ్బులు ఇచ్చి సహాయపడండి. నేను ఇక్కడ రైల్వే స్టేషన్ లోనే ఉండి ప్రొద్దున్నే నా ఊరికి వెళ్ళిపోతాను

పరంధామయ్యకు మంగమ్మ చెప్పింది నచ్చలేదు. ఒక అమాయకురాలుని మధ్య దారిలోనే వదిలి వెళ్ళటానికి ఆయన మెత్తని మనసు చోటివ్వలేదు. 'రాత్రి పూట పోలీసులు విచారిస్తే ఏం సమాధానం చెబుతుంది?' ఇంకెవరైనా ఆమెకు అవాంతరం కలిగిస్తే...?'

ఆమెను జాగ్రత్తగా ఊరికి బస్సు ఎక్కించేవరకు అమెకు సెక్యూరిటీ ఇవ్వాల్సింది తన బాధ్యత అని అనుకున్నారు.

రాత్రికి రైల్వే స్టేషన్ లోనే పడుకుని, ప్రొద్దున బస్ స్టేషన్ కు వెళ్ళి ఆమెను జగ్గయ్యపేట బస్సు ఎక్కించి పంపించే తాను ఊరుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అట్లాగే ప్రయాణీకుల వెయిటింగ్ హాలుకు వెళ్ళి ఒక కుర్చీలో కూర్చున్నాడు.

ఆమె కూడా ఆయనకు దగ్గరగా గోడను ఆనుకుని, బిడ్డను వొళ్ళో పడుకోబెట్టుకుని నేల మీద కూర్చుంది. కానీ, వాళ్ళు అక్కడ పడుకోలేకపోయారు. అన్ని దోమలు ఉన్నాయి అక్కడ.

పరంధామయ్యను చూడటానికే మంగమ్మకి కష్టం అనిపించింది. 'ఊర్లో ఎంత పెద్ద మనిషి. ఆయన ఇల్లు పెద్దదిగా, విశాలంగా, వసతులతో ఉంటుంది? అలాంటి ఆయన ఇప్పుడు నాకొసం ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు? ఇలాంటి మంచి మనుషులు ఉండబట్టే ప్రపంచంలో వర్షాలు కొంచమైనా పడుతున్నాయి అంటూ ఆలొచిస్తున్నది.

సుమారు 10 నిమిషాలు అయ్యుంటుంది. దోమ కాటులను తట్టుకోలేక లేచి అటూ ఇటూ నడవటం మొదలుపెట్టారు పరంధామయ్య. తరువత ఏదో ఆలొచన వచ్చింది. వెంటనే ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె లేచి నిలబడ్డది.

"ఇక్కడ రైలు స్టేషన్లో ప్రయాణీకుల వసతికోసం అద్దె గదులు ఉన్నాయి. నువ్వు వచ్చేటట్లైతే రూము తీసుకుని స్టే చేద్దాం. కానీ నిర్బంధం ఏమీ లేదు" -- సంకోచిస్తూ చెప్పారు.

రెండు రోజుల ప్రయాణ బడలిక తీరాలి...ప్రశాంతంగా నిద్రపోవాలని శరీరం వేడుకుంది.

హఠాత్తుగా ఆయన అలా అడుగుతారని ఆమె ఎదురు చూడలేదు. కానీ, రెండు రోజులుగా ఏదీ ఎదురుచూడక తనని కాపాడుతూ వచ్చిన ఆయనను నమ్మి ఎక్కడకైనా వెళ్ళొచ్చు అని ఆమె మనసు చెబుతోంది.

సమాధానం చెప్పటానికి ఆమె తీసుకుంటున్న సమయం గురించి ఆలొచించి "నీకు ఇష్టం లేకపోతే వద్దు" అని చెప్పి వెనుతిరిగారు.

"మీరు వెళ్ళి రూము తీసుకుని స్టే చేయండి. నేను ఇక్కడే ఇక్కడున్న ప్రయాణీకులతో కలిసి ఉంటాను. ప్రొద్దున్నే నన్ను బస్సు ఎక్కించండి"

"లేదు మంగమ్మ. రాత్రి సమయంలో పోలీసులో, లేక ఇంకెవరైనా నిన్ను ఏదైనా ప్రశ్నలు అడిగితే ఎం సమాధానం చెబుతావుఅందువల్ల నేనూ ఇక్కడే..."

ఆమె వెంటనే అడ్డుపడి, "లేదండీ...మీరు ఇక్కడ నిద్ర పోలేరు. రూముకే వెలదాం"

రైల్వే స్టేషన్లో గది ఒకటి అద్దెకు తీసుకుని తానూ, తన సహోదరి ఉండబోతునట్టు 'లెడ్జర్ లో రిజిస్టర్ చేశారు.

కూర్చూనే రెండు రోజులు రైల్లో ప్రయాణం చేసిన బడలికతో నిద్ర ఆయన్ని స్వాధీనం చేసుకుంది.

కానీ, మంగమ్మ మాత్రం నిద్ర పోలేకపోయింది. తుఫాన గాలి వలన మద్య కడలిలో ప్రమాదంలో చిక్కుకున్న ఓడలోంచి తప్పించుకుని, ఈదుకుంటూ తీరం చేరుకున్న ఉపశమనం ఏర్పడింది ఆమెలో. తన భర్త వలన అనుభవించిన బాధలు, దాంట్లో నుండి తప్పించుకురావటానికి తాను పడ్డ శ్రమను తలచుకుంటే ఇంకా వొణుకు పుడుతోంది. 'ముందూ వెనుకా తెలియని ఈయన నాకు ఇన్ని సహాయాలు చేయటానికి ఏమిటి కారణం?'

దాని గురించి ఎన్నిసార్లు ఆలొచించినా...'ఆయన దయా గుణమే కారణం' అనే జవాబే దొరికింది.

'ఇలాంటి మంచి మనిషి ఒకరు నాకు భర్తగా దొరకలేదే?' అనే ఆలొచన ఆమె మనసులో వచ్చి పోతూ ఉన్నది.

'ఇన్ని సహాయాలు చేసిన ఈయనికి నేను విధంగా క్రుతజ్ఞతలు చెప్పగలను?' అని ఆమె ఆలొచించించడం ప్రారంభించినప్పుడే విధి అక్కడ ఆడుకోవటం మొదలుపెట్టింది.

కలకత్తాలోనే ఉండుంటే సమయానికి ఎన్నో మృగాలకు బలి అయి ఉంటానుదాంట్లోంచి నన్ను కాపాడింది ఈయన. రెండు రోజులుగా నన్ను ఎంతో నాగరికతతో , మర్యాదతో చూసుకున్నారు. ఒకే గదిలో ఉంటున్నా క్షణం వరకు ఎటువంటి అసభ్యకర చూపూ కూడా తనవైపు చూడకుండా నిద్రపోతున్నారు. ఇలాంటి క్రమశిక్షణ గల మనిషిని నేను పెళ్ళి చేసుకోవటానికి నోచుకోలేదే'-- ఇలా ఆలొచిస్తున్నప్పుడే ఆమెలో విపరీతం ఏర్పడింది.

' రాత్రి మాత్రం ఈయనకు భార్యగా ఉండి నన్నే ఇచ్చుకుంటే ఏం? నా భర్త చేసిన దారుణాలను తలుచుకుంటూ మిగిలిన జీవితాన్ని గడపటం కంటే...ఈయనతో ఉన్న రెండు రోజులను తలచుకుంటూ మిగతా జీవితాన్ని సంతోషంగా జీవించొచ్చే?'

న్యాయధర్మాలు, తన చేష్ట వలన తమకి భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రభావాలు, దీనివలన ఇతరులకు రాబోయే బాధింపులు--అని దేని గురించీ ఆలొచించే మనొస్థితిలో ఆమె అప్పుడు లేదు.

లేచి పరంధామయ్య దగ్గరకు వచ్చి ముఖాన్ని చూసింది. పాపం...అలసట మరియు కల్లాకపటం లేని మనసు. ప్రశాంతంగా నిద్రపోతున్నారు.

ఆయన్ని చూస్తున్న కొద్దీ ఏదో తెలియని ఒకవిధమైన ఆకర్షణ అమెను ప్రభావితం చేసింది.

మత్తు తలకెక్కిన వాళ్ళు తరువాత తాము ఏమి చేస్తున్నాం అనేదే తెలుసుకోరు. అది తొలగినప్పుడే వాళ్ళు చేసింది వాళ్ళకు అర్ధమవటం మొదలవుతుంది.

మంగమ్మకి 'పరంధామయ్య అనే మత్తు ఎక్కింది. నిప్పు పైన దూది తానుగా వచ్చి పడినప్పుడు అది అంటుకోవటానికి ఎక్కువసేపు అవలేదు.

వాళ్ళ జీవితంలో ఇక వీచబోయే తుఫానలకు రోజు రాత్రే మూలాధారం అనేది పాపం వాళ్ళ సమయంలో తెలుసుకోలేదు!

                **********************************PART-5*********************************

(క్రమశిక్షణతో ఉండటమే కుటుంబ జీవితానికి ప్రధానమైనది. క్రమశిక్షణ తప్పి జీవించే జీవితం పోకిరితనమైనదని యోచిస్తారు)

హఠాత్తుగా జరిగి ముగిసిన సంఘటన యొక్క తాకిడి నుండి పరంధామయ్య బయటకు రాలేకపోయాడు. మొదట్లో అదేదో 'కల అని కూడా ఆలొచించారు. అది నిజమే నని నమ్మినప్పుడు...'అది కలగానే ఉండిపోకూడదా?' అని అనుకుని బాధ పడ్డారు. ముందూ వెనుక తెలియని మహిళతో కలిసి ఒకే గదిలో ఉన్న తప్పును తలచుకుని తనని తానే నిందించుకున్నారు.

రాత్రంతా నిద్ర లేకుండా అల్లాడిపోయారు.

పాపం...ఆయన మాత్రం ఏం చేయగలరు?

'పిల్లలు పుట్టే భాగ్యమే లేదు అని వైద్యులు చెప్పినప్పుడు విలవిలలాడిపోయింది రాజరాజేశ్వరి. 'గొడ్రాలు అనే పేరు వ్యాపించటం విని కూలిపోయింది. కొంచం కొంచంగా ఆమెకు దాంపత్య జీవితంపై ఆసక్తి తగ్గిపోయింది. భార్య మనసెరిగిన పరంధామయ్య కూడా గత కొద్ది సంవత్సరాలుగా దాంపత్య జీవితానికి దూరంగా ఉండిపోయారు.

ఈరోజు హఠత్తుగా తన మగతనానికి పరీక్ష రావటంతో తడబడ్డాడు. రేపు భార్య ముఖం ఎలా చూడను అని సిగ్గుతో తల వంచుకున్నారు.

అన్నిటికీ మంగమ్మే కారణమని ఆమె మీద నేరం మోపటానికి ఆయన మనసు అంగీకరించలేదు. తాను జాగ్రతగా ఉండుంటే ఇది జరిగుండేది కాదు అని నమ్మారు.

ఇలా పలు పలు ఆలొచనలు వచ్చి ఆయన బుర్రను తాకటంతో ఆయన నిద్రపోలేకపోయేరు. ఎర్ర బడ్డ కళ్ళతో కుర్చీలో కూర్చుని తన స్థితిని తలుచుకుని వేదన పడుతున్నారు.

ప్రొద్దున్నే కళ్ళు తెరిచిన మంగమ్మ ఆయన్ను చూసి హడలెత్తిపోయింది. రాత్రి జరిగింది సాధారణంగా తీసుకుంటారని అనుకున్నది. ఇలాగూ ఒక మగ మనిషి ఉంటాడు అని  ఆమె ఎదురు చూడనే లేదు. ఇప్పుడు ఆయనతో మాట్లాడటానికి ఆమెకు సిగ్గుగానూ, భయంగానూ ఉన్నది.

ఆయన కూడా మౌనంగా ఉండటంతో చాలా బాధ పడ్డది మంగమ్మ. 'ఇంత మంచి మనిషిని నేరం చేసేననే మనోస్తితికి తీసుకువెళ్ళేనే?' అని పశ్చాత్తాప పడింది.

అలాంటి మౌన పరిస్థితి యొక్క తీవ్రతను తగ్గించటానికి ఎవరైనా ఒకరు మాట్లాడి తీరాల్సిందే! ఆయన దగ్గరకు వచ్చి తడబడుతూ నిలబడ్డది.

"అయ్యా, నిన్న జరిగిన తప్పుకు నేనే కారణం. దానికి ఇంత బాధ పడక్కర్లేదు. మీరు ఎంత న్యాయమైన మనిషో తెలుసుకోలేకపోయిన కుక్కను...నేను తప్పు చేశాను. నన్ను మన్నించి...ఉరికి వెళ్ళటానికి కొంచం డబ్బిచ్చి సహాయపడితే...నేను వెళ్ళి చేరిపోతాను. తరువాత జన్మజన్మలకూ మీ కంటికే కనబడను. నన్ను మన్నించి పంపించండయ్యా" అంటూ వేడుకుంది.

ఆయన సమాధానం ఏమీ చెప్పకుండా లోతైన ఆలొచనలో ఉన్నట్లు కనబడ్డారు.

మంగమ్మకి ఏడుపు పొంగుకుంటూ వచ్చింది. ఆయన కాళ్ళ మీద పడి రోదించింది. "అయ్యా, నన్ను మన్నించి పంపించేసి దీన్ని మరిచిపొండయ్యా. మీకు ఇక ఎటువంటి సమస్య లేకుండా ఊరు వెళ్ళి జేరిపోతానయ్యా"

ఆమె ఏడుపునే కొంచం సేపు చూస్తున్న ఆయన చెప్పారు: "మంగమ్మా...నిన్ను మీ ఊరు పంపించటం లేదు. నాతోనే తీసుకు వెళ్ళబోతాను"

అదిరిపడ్డది మంగమ్మ. 'ఏమైంది ఈయనకు?' అని ఆందోళన చెందింది.

ఆమె షాక్ అవటం చూసి.

"ఇష్టపడో...ఇష్టపడకనో నిన్ను ముట్టుకున్నాను. ఇకమీదట నువ్వు నా  రక్షణలో ఉండటమే న్యాయం" -- ఆయన స్వరంలో అధికమైన పట్టుదల తెలుస్తోంది.

తల తిరిగింది మంగమ్మకి. కొంచం కూడా ఎదురుచూడని ఆయన యొక్క   నిర్ణయన్ని తలచుకుని వొణికిపోయింది. ఆయనతో వెడితే తన వలన కుటుంబంలో ఎన్నెన్ని సమస్యలు తలెత్తుతాయో అని ఆలొచించినప్పుడు ఏడుపు గొంతుకు అడ్డుపడింది. ఆయన ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటారని ఎదురుచూడనే లేదు. ఏది ఏమైనా దాని నేను సమ్మతించ కూడదు అని ఖచ్చితంగా నిర్ణయించుకుంది.

"అయ్యా, నా మీద మీరు చూపిస్తున్న సానుభూతికి చాలా సంతోషపడుతున్నాను. కానీ, మీ నిర్ణయాన్ని నేను ఆమొదించనేలేను. అది అంగీకరించే అదృష్టం నాకు లేదు. రెండు రోజులు నాకోసం మీరు కష్టపడ్డదంతా చాలు. నా వల్ల మీకు ఇక ఎటువంటి సమస్య రాకూడదు. దయచేసి నా దారిలో నన్ను పోనివ్వండి" -- బ్రతిమిలాడింది.

"మీ అమ్మా-నాన్నలను గురించి ఒక్కసారి ఆలొచించు మంగమ్మా. కలకత్తాలో భర్తతో చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటూ ఉంటారు. దాన్ని చెడపటానికి వెళ్ళబోతావా? మీ చెళ్ళెళ్ళ గురించి ఆలొచించు. భర్త వదిలేసిన దానివిగా వెడితే వాళ్ళకు పెళ్ళిల్లు జరుగుతాయా? నీ భర్త వచ్చి నీ మీదే తప్పంతా నని చెప్పి మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా? అతన్ని ఎదిరించి నువ్వు మంచి దానివని నిరూపించగలవా?"

మీ ఊరికి వెళ్లి...నీకు మాత్రం కాకుండా నీ కుటుంబం మొత్తానికి కష్టం ఇవ్వబోతావా? రైల్లో వచ్చేటప్పుడే నిన్ను మా ఇంటికి తీసుకు వెల్దామని కూడా ఆనుకున్నాను. కానీ, నీ దగ్గర ఏం చెప్పి...ఎలా నిన్ను తీసుకు వెళ్ళాలి అని ఆలొచిస్తూ ఉన్నాను. కానీ, ఇప్పుడు నిన్ను కాపడవలసిన బాధ్యత నాకు వచ్చేసింది"

ఆయన మాటల్లో ఉన్న న్యాయాన్ని అర్ధం చేసుకుంది. 'పెద్ద మనుష్యులు పెద్ద మనుష్యులే'...నా కుటుంబం గురించి ఆయన ఎంత శ్రద్ధతో ఆలొచించారు? నేను కూడా, నా భర్త దగ్గర నుండి తప్పించుకుని ఊరు వెళ్ళి చేరితే చాలు అని మాత్రమే ఆలొచించాను. దాని వలన నా కుటుంబానికి ఇంత పెద్ద సమస్య వస్తుందనేది నేనెందుకు ఆలొచించలేదు?'--అని అనుకుంది.

ఊరికి వెళ్ళే ఆలొచనను విడిచిపెట్టింది'అలాగైతే నాకు వేరే దారి ఏముంది? ఇక ఈయనతో వెళ్ళాల్సిందేనా?'

'అలా వెడితే ఆయన ఇంట్లో...?'.....తలచుకుంటేనే ఆమెకు భయం వేసింది.

"ఏం మంగమ్మా?"

'అయ్యా, నన్ను కొంచం ఆలొచించుకో నివ్వండి?'

గోడ చివరగా కూర్చుని కళ్ళు మూసుకుంది.

చాలా సేపైన తరువాత ఆయన మొహాన్ని నేరుగా చూసింది: "అయ్యా, మీ మాటల్లో ఉన్న నిజాన్ని గ్రహించి...నా ఉరికి వెళ్లకూడదు అని నిర్ణయించుకున్నాను. కానీ, మీతో రావాలంటే దానికి ముందు మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి"

"చెప్పు...ఏమిటి?"

ఒక పనిమనిషి గానే అక్కడికి వస్తాను. మీరు చెప్పేరు చూడండి... బద్రత మాత్రమే నాకు ఇవ్వాలి. అంతకు మించి నా దగ్గర నుండి మీరు ఎటువంటి ప్రతిఫలము ఎదురుచూడకూడదు"

"సరే"

"నన్ను పనిమనిషిగా మాత్రమే చూడాలిమిగిలిన పనివాళ్లను ఎలా చూస్తున్నారో నన్ను కూడా అలాగే చూడలి. నా దగ్గరకు వచ్చి ఏకాంతంగా మాట్లాడటమో, లేక నాకని ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వటానికి ప్రయత్నించ కూడదు"

"సరే మంగమ్మ"

"ఇంకొక విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి"

"చెప్పు"

మీ కుటుంబంలో నా వలన ఎలాంటి గొడవులూ రావు. గొడవ వచ్చేటట్టు మీరు ఏదైనా చేస్తే...మరు క్షణమే నా కొడుకుతో కలిసి కనిపించకుండా వెళ్ళిపోతాను. వీటన్నిటికీ సమ్మతమైతే చెప్పండి...వస్తాను"

ఆమె మాటల్లో ఒక స్పష్టత ఉన్నది.

"నిజంగా చెబుతున్నాను మంగమ్మ. నీ మీద నాకు ఎటువంటి 'ఆశ కలగలేదు. అందువలన నా వలన నీకు ఎటువంటి ఇబ్బందీ రాదు. నేను చెప్పేను కదా...రైలు లోనే నిన్ను నా ఇంటికి తీసుకు వెళ్ళాలి అనుకున్నాను అని. ఇప్పుడు అది నా భాధ్యత అని నా మనస్సాక్షి చెబుతోంది. మా ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉంటే అదే నాకు చాలు. నా వలన నీకు ఎప్పుడూ ఎటువంటి బాధ ఉండదు"

ఆయన మాటలను పూర్తిగా నమ్మి ఆయనతో వెళ్లటానికి అంగీకారం తెలిపింది. ఏడుకొండలకు భార్యగా ఉండటం కంటే ఈయన ఇంట్లో పనిమనిషిగా ఉండటం ఎంతో గౌరవమైనది అని అనుకున్నది.

నమ్మకంతోనే ఆయనతో వెళ్ళటానికి తయారైయ్యింది. ఆమె నమ్మకం నెరవేరిందా? కాలమే సమాధానం చెబుతుంది.

        *********************************PART-6**********************************

(ఒక కార్యం చేయటానికి ఒక పద్దతి, అది చేయటానికి సరైన పరికరం, దాన్ని చేయటానికి తగిన సమయము...చోటును సరిగ్గా ఎన్నుకుని మంచిగా చెయ్య గలిగినవాడే గొప్పవాడు అవుతాడు)

తాను ఊరికి తిరిగి వస్తున్నట్టు రాజరాజేశ్వరికి ఫోన్ చేసి చెప్పాడు పరంధామయ్య. అప్పుడు కూడా ఆమె భర్తను కార్లోనే ఊరికి రమ్మని బలవంతం చేసింది.

మంగమ్మతో కారులో వెళ్ళటం మంచిదే. బస్సులో వెడితే బస్సు స్టాండ్ నుండి ఇంటికి నడిచి వెడుతుంటే పలువురు పలురకాలుగా చూస్తారు. కానీ, కారులోనే రమ్మని రాజరాజేశ్వరి ఎందుకు బలవంతం చేస్తోంది? గందరగోళంగా ఉంది ఆయనకి. అయినా కానీ దాని కారణం ఏమిటని గట్టిగా అడగలేదు. ఊరికి వెళ్ళిన తరువాత అడగొచ్చులే అనుకుని వదిలేశారు.

గుడివాడలో బస్సు దిగినప్పుడు ఆయనకు తెలిసిన ఒకాయన అడిగారు: "మీ ఊర్లో పరిస్థితి ఎలా ఉంది?"

పరంధామయ్యకు ఏం చెప్పాలో తెలియలేదు. "ఏం...మా ఊరికేమిటి?" అని తిరిగి  అడిగారు.

"బయట ఊరు నుండి వస్తున్నారా?... మీకు  విషయమే తెలియదా? ఊర్లో కులం గొడవలు వచ్చి ఇద్దర్ని చంపేసారు. ఊరు మొత్తం పోలీసులు ఉన్నారు. అయినా కానీ గొడవులు తగ్గటం లేదు. రాత్రి అయితే చాలు జనం ప్రాణాలకు భయపడి ఇంట్లోనే ఒదిగి ఉంటున్నారు. 'ఎవరైనా బయటకు వస్తే కాల్చేస్తాం' అని పోలీసులు భయపెట్టి ఉంచారు. అయినా గొడవలు తగ్గటం లేదు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ మీకు విషయం చెప్పలేదా?"

నాతో మాట్లాడినప్పుడు రాజరాజేశ్వరి ఎందుకు ఆందొళనగా మాట్లాడింది...ఉరికి కార్లోనే రమ్మని ఎందుకు చెప్పిందో అనేది ఆయనకు ఇప్పుడు అర్ధమయ్యింది.

ఊరి సరిహద్దులోనే పోలీసులు కారును ఆపి, పూర్తిగా పరిశీలించారు. ఆయన ఎవరనేది పూర్తిగా తెలుసుకుని ఆయన్ని ఊరిలోకి అనుమతించారు.

వీధి మొత్తం పోలీసులు తిరుగుతున్నారు. ఎక్కువమంది జనం కనిపించలేదుఇంటికి వచ్చిన వెంటనే పరిగెత్తుకు వచ్చి స్వాగతం పలికింది రాజరాజేశ్వరి .

"హమ్మయ్య...ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది" అంటూ శ్వాస వదుల్తూ నడుస్తూ చెప్పిన ఆమె వెనక్కి తిరిగి మంగమ్మను చూసింది.

"ఈమె పేరు మంగమ్మ. కలకత్తాలో ఈమె భర్త ఈమెను చాలా చిత్రవధ చేసాడట. అతని దగ్గర నుంచి తప్పించుకుని వచ్చిన ఈమెను రైల్లో చూశాను. పాపం, ఇప్పుడు అనాధ. ఎక్కడికీ వెళ్ల లేదు. అందువలన మనింట్లోనే పనిలో పెట్టుకుందామని పిలుచుకు వచ్చాశాను. నువ్వేమంటావ్ రాజేశ్వరి?"

"ఏమిటండి, మీరు చెప్పిన దానికి నేను ఎప్పుడు ఎదురు చెప్పాను? వీళ్ళకని మనమేమీ ప్రత్యేకంగా వంట చేయం కదాఇంకో ఇద్దరు ఎక్కువ తిన్నందువలన మనమేమీ తరిగిపోము?"

రాజరాజేశ్వరిని ఆశ్చర్యంగా చూసింది మంగమ్మ. పేరుకు తగినట్లు పెద్ద మనసు, మానవత్వం నిండి ఉన్న ఆమెను చూసి నిర్ఘాంతపోయింది.

వల్లీ, ఈమెను తీసుకు వెళ్ళి నీతో ఉంచుకో. ఇంటి పనులను ఆమెను కూడా చేయ్యమని చెప్పు"....గబగబ ఆదేశాలిచ్చింది.

ఆమెకు చేతులెత్తి నమస్కరించి, "మీకు చాలా ధన్యవాదాలమ్మా" అన్నది మంగమ్మ.

వల్లీ అమెను ఇంట్లోకి తీసుకు వెళ్ళింది.

ఇంటి శుభ్రతను, ప్రశాంతతను చూసి మంగమ్మ బాగా ఇష్టపడింది. కలకత్తాలో అశుభ్రత,  ఎప్పుడూ హడావిడిగా ఉండే వీధులలో నుండి మళ్ళీ గ్రామ ప్రశాంతత-శుభ్రత  పరిస్థితుల్లోకి తిరిగి వచ్చినందు వలన మంగమ్మ మనసు హాయిగా ఉన్నది.

పరంధామయ్య కొంత సమయం రెస్టు తీసుకున్న తరువాత భార్య రాజరాజేశ్వరిని పిలిచి గ్రామ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంకయ్య చెప్పిన వివరాలు విన్న తరువాత ఆవేశంగా లేచారు.

"వాళ్ళను ఏం చేస్తాను చూడు?" అని కోపంగా అరిచారు.

"తొందరపడకండి! కోపగించుకుని ఏది చేసినా నష్టం వాళ్లకు మాత్రం కాదు...మనకీ ఏర్పడుతుంది. అందుకని..."

"అందుకని...?"

"ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి"

"దానికి మనం ఏం చేయాలి?"

"వారసులు లేరనే కారణం వలనే కదా వాళ్ళు ఇంత కుట్ర చేశారు. మనకు ఒక వారసుడు వస్తే?"

"ఏమిటి రాజేశ్వరీ...వేళాకోళమా?

"వేళాకోళం కాదండి.'సీరియస్ గానే చెబుతున్నాను. ఎవరికీ తెలియకుండా చట్టపూర్వంగా ఒక పిల్లాడ్ని దత్తతు తీసుకుంటే ఏం?"

పరంధామయ్యకు కూడా అలాంటి ఆలొచన ఉండేది. ఇప్పుడు రాజరాజేశ్వరి కూడా చెప్పేసింది...ఇక దానికి కావలసిన ఏర్పాట్లు మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

"విజయవాడలో నా స్నేహితుడొకడు అడ్వకేట్ గా ఉంటున్నాడు.  వాడిని కలిసి ఆలొచన అడగాలి"

"ఫోనులోనే అడగొచ్చుగా?"

"లేదమ్మా. వీటన్నిటినీ నేరుగా కలుసుకుని మాట్లాడాలి"

మన ఊర్లోనూ, బయట ఊర్లలనూ కొంచం జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఎప్పుడూ వెంకయ్యను మీతో ఉంచుకోండి. చీకటి పడటానికి ముందే ఇంటికి వచ్చేయండి"

"సరే మంత్రి గారూ!--నవ్వుతూ కొంటె మర్యాదను చూపించేరు పరంధామయ్య. ఆయన మనసును అంతవరకు వేధిస్తున్న 'నేరం' చేశేమే నన్న ఆవేదన కొంచంగా తగ్గటంతో ఆయన మామూలు స్థితికి వచ్చారు.

గలగలమని నవ్వింది రాజరాజేశ్వరి.

భార్య కూడా ఒక విధంగా భర్తకు మంత్రే కదా!

విజయవాడ వెళ్ళిన పరంధామయ్య, అక్కడ అడ్వకేట్ చెప్పిన ఆలోచన ప్రకారం అక్కడున్న ఒక పిల్లలను దత్తతు ఇచ్చే నిర్వాహంలో రిజిస్టర్ చేసి వచ్చారు. కొన్ని రోజులు పడుతుందని వాళ్ళు చెప్పటంతో అంతవరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు.

రోజులు వారాలైయ్యి, వారాలు నెలలైనై.

మంగమ్మ తప్ప మిగిలిన పనివాళ్ళందరూ సాయంత్రం వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోవటంతో ఆమె ఒంటరి అయిపోతుంది. అందువలన రాజరాజేశ్వరి అప్పుడప్పుడు మంగమ్మను పిలిచి తనకు కొన్ని సహాయాలు చేయమని చెబుతుంది. తరువాత మంగమ్మ రాజరాజేశ్వరికి మాట తోడు అయ్యింది. మంగమ్మ యొక్క గుణం కొద్ది కొద్దిగా రాజరాజేశ్వరికి నచ్చడంతో ఆమెను ఎప్పుడూ తన పక్కనే ఉంచుకుంది.

మంగమ్మ పిల్లాడు సత్యపాల్ మీద రాజరాజేశ్వరి ఎక్కువ ప్రేమ చూపించింది.  వాడుకూడా ఆమెకు బాగా దగ్గరయ్యాడు. అది చూసి మంగమ్మ చాలా సంతోషపడింది.  

అప్పుడప్పుడు మంగమ్మ దగ్గర మాట్లాడి ఆమె కుటుంబం గురించి, పెళ్ళి గురించి, కలకత్తాలో జీవించిన జీవితం గురించి, భర్త పెట్టిన చిత్రవధల గురించి, అతని దగ్గర  నుండి తప్పించుకోవడం గురించి అడిగి తెలుసుకుంది. కానీ విజయవాడ సంఘటన గురించి మాత్రం మంగమ్మ చెప్పకుండా దాచేసింది.  

సత్యపాల్ బాగా దగ్గరవటంతో మిక్కిలి ఆనందించిన రాజరాజేశ్వరి యొక్క మనసులో  వేరొక  ప్లాన్ పుట్టింది. దత్తతు పిల్లాడికోసం కాచుకోనవసరం లేకుండా వీడినే దత్తతు తీసుకుంటే ఏం? అనేదే అది!

భర్తతో తన ఇష్టాన్ని చెప్పింది. ఆయన కూడా దానికి ఒప్పుకున్నారు. కానీ, మొదట మంగమ్మ దగ్గర మాట్లాడమని సలహా ఇచ్చారు.

మంగమ్మ కూడా దానికి మనస్స్పూర్తిగా అంగీకరించింది. అది ఎలా పద్దతిగా చేయాలో అలాగే చేయండి" అన్నది.

వారసుడు లేని వాళ్ళకు ఒక వారసడు దొరుకుతాడు. సత్యపాల్ భవిష్యత్తు బాగుంటుంది.  చేసిన పాపానికి నేను పరిహారం చేసినట్లు అవుతుంది అని ఆలొచించింది.

ఆ రోజు నుండి సత్యపాల్ ని తన కొడుకులాగా భావించి ప్రేమంతా ఒలకబోసింది రాజరాజేశ్వరి. వాడు కూడా ఆమె దగ్గరే, ఆమె కొంగు పుచ్చుకునే కాలం వెళ్లబుచ్చాడు.

'నన్ను పట్టుకున్న పీడ నాతోటే పోనీ. సత్యపాల్ జీవితమైనా బాగుండనీఅని శాంత పడింది తల్లి.

కాని విధి వాళ్ళకు వేరొక పధకం తయారుగా ఉంచింది.

ఒక రోజు మంగమ్మ విడిగా వెళ్ళి డోక్కున్నది రాజరాజేశ్వరి గమనించేసింది. ఆమెను తన గదికి పిలిచుకు వెళ్ళి గుచ్చి గుచ్చి అడగటంతో ఆమె గర్భంగా ఉన్న విషయం  ఖాయపరచుకుంది.

కలకత్తాలో చివరి కొన్ని నెలలుగా మంగమ్మ దాంపత్య జీవితం గడపలేదు. భర్తకు దూరంగా ఉన్నది. ఈమెను తన భర్త రైల్లో కలుసుకున్నాడు. విజయవాడలో ఒక రోజు రాత్రి ఆమె, ఈయన ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆమెను ఈయన ఇంటికే తీసుకు వచ్చారు. ఇవన్నీ కలిపి ఆలొచిస్తే ఆమెకు ఒక సమాధానమే దొరికింది.  

"అలాగైతే...అలాగైతే?"

తాను ఈ ఇంట్లో ఉండబోయేది ఈరోజే చివరి రోజు అనేది మంగమ్మకు బాగానే అర్ధమయ్యింది. కాబట్టి, రాజరాజేశ్వరి కాళ్ళ మీద పడి ఆ రోజు విజయవాడలో జరిగిందంతా మర్చిపోకుండా మొత్తం చెప్పి ముగించింది.......

"అమ్మా...ఆ రోజు జరిగిన దానికి నేను మాత్రమే కారణం. అయ్యగారు ఒక సత్య హరిశ్చంద్రుడు. ఆయన్ని సందేహించకండి. నాకు ఎటువంటి శిక్చ అయినా విధించాడు...మనస్పూర్తిగా అనుభవిస్తాను. ఆయన్ని ఏమీ అనకండి. రేపు తెల్లవారు జామున ఎవరికీ తెలియకుండా ఊరు వదిలి వెళ్ళిపోతాను"---వెక్కి వెక్కి ఏడ్చింది.

మంగమ్మ మాట్లాడుతూ వెడుతుంటే రాజరాజేశ్వరి మనసులో వేరొక పధకం రూపు దిద్దుకుంటోంది.

"నువ్వు ఇళ్ళు వదిలి వెళ్ళిపోతే సమస్యలు సరైపోతాయా?"  

"వేరే ఏం చేయాలో నాకు తోచటం లేదమ్మా. మీరు ఏం చెప్పినా నేను చేస్తానమ్మా"

"ఏం చెప్పినా చేస్తావా?"

"తప్పకుండా చేస్తానమ్మా. నన్ను నమ్మండమ్మా"

"సరే, కళ్ళు తుడుచుకుని నా దగ్గరకు రా...చెబుతాను"

భయపడుతూ దగ్గరకు వెళ్ళింది.

గుసగుసమనే స్వరంలో ఆమె చెబుతూ వెడుతుంటే మంగమ్మ కళ్ళు ఆశ్చర్యంతో వికసించినై.  ఆమె చెవులను ఆమె నమ్మలేకపోయింది!

          *****************************************PART-7***************************************

(మంచిని అందుకోవాలని అనుకున్నప్పుడు మంచి వ్యక్తులను పొందటం తప్ప పెద్ద యుద్దం ఇంకేదీ లేదు)

రాజరాజేశ్వరి చెప్పిన పధకం విని ఆశ్చర్యపోయిన మంగమ్మ దగ్గర మాటలు కొనసాగించింది రాజరాజేశ్వరి: నాకు సంతాన భాగ్యం లేదని తెలుసుకున్న తరువాత ఆయన్ని రెండో పెళ్ళి చేసుకోమని బ్రతిమిలాడాను. దానికి ఆయన ఖచ్చితంగా ఒప్పుకోనని చెప్పేరు. కానీ, ఇప్పుడు చూడు... దేవుడే ఒక సంధర్భం ఏర్పరచి ఆయనకు ఒక వారసుడ్ని ఇచ్చేడు. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను మంగమ్మా"

రాజరాజేశ్వరి తనని తిడుతుంది,శపిస్తుంది, ఇంటి నుండి తరిమేస్తుందని ఎదురు చూసిన మంగమ్మకి ఆమె చెప్పింది ఆశ్చర్యపరిచింది.

"వారసులు లేని మా ఆస్తిని అపహరించటానికి చాలామంది పధకాలు వేస్తూ ఉన్నారు. దానివలన ఆయన ప్రాణానికే ముప్పు వస్తుందేమోనని నేను వణికిపోయాను. వాళ్ళ పధకాలన్నీ నీవలన తవుడు పొడి అవబోతోంది.

తాను చేసిన తప్పు వలన ఈ కుటుంబానికి ఇలాంటి ఒక మంచి జరుగుతుందని ఆమె ఎదురుచూడలేదు.

"ఇక మీదట నువ్వు నాకు పనిమనిషి కాదు. నా చెల్లివి. నన్ను వదిలిపెట్టి నిన్ను ఎక్కడికీ వెళ్ళనివ్వను మంగమ్మా" ఉద్రేకపడి మాట్లాడింది రాజరాజేశ్వరి.

"అమ్మగారూ...మీకు నావలన ఒక మంచి జరుగుతుందంటే దానికి నేను మనస్పూర్తిగా సహాయపడతానమ్మా. తిన్నింటివాసాలు లేక్కపెట్టే వాళ్ళు ఉన్నారని విన్నను. కానీ, నేను అలాంటి దానిని కానమ్మా. నేను చేసిన పాపానికి పరిహారం చెయ్యగలిగితే అదే నాకు పెద్ద పుణ్యం"

భర్తను పిలిచి విషయం చెప్పింది. తన వలన మంగమ్మ గర్భం దాల్చిందని తెలుసుకుని ఆయన కంగు తిన్నాడు. అయినా కానీ ఆమెను జాలిగా చూసాడు. మంగమ్మో 'వాగ్ధానం మీరొద్దు అనేట్లు ఆయన్ని చూసి తలవంచుకుంది.

రాజరాజేశ్వరి తన పధకం గురించి ఇద్దరి దగ్గరా వివిరించింది.

తాను గర్భంగా ఉన్నట్లు ఇంట్లో వాళ్ళతోనూ, బయట వాళ్ళతోనూ చెప్పాలి. ఏదో ఒక కారణం చెప్పి మంగమ్మతో హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అక్కడ మంగమ్మ ' రాజరాజేశ్వరి '  అనే పేరుతో హాస్పిటల్లో చూపించుకుంటూ రావాలి. పుట్టే బిడ్డకు హాస్పిటల్ రిజిస్టర్ లోనూ, ప్రభుత్వం ఇచ్చే బర్త్ సర్టిఫికేట్ లోనూ ఆ బిడ్డ పరంధామయ్య - రాజరాజేశ్వరి దంపతులకు పుట్టిందని రాసుండాలి.

తల్లిపాలు తాగేంత వరకు బిడ్డ మంగమ్మ దగ్గర పెరగాలి. ఆ తరువాత రాజరాజేశ్వరి దగ్గర పూర్తిగా వదిలిపెట్టి, ఆమె బిడ్డగానే పెంచటం అంటూ...అంతవరకు బంధువులో,  తెలిసిన వాళ్ళో వాళ్ళను చూడకుండా చూసుకోవాలని రాజరాజేశ్వరి తన పధకాన్ని వివరించినప్పుడు ఆశ్చర్యపోయారు పరంధామయ్య.

పుట్టుబోయే బిడ్డ యొక్క మంచి భవిష్యత్తు కోసం, ఆస్తులన్నిటికీ వారసుడు పుట్టాలనే కారణం కోసం, రాజరాజేశ్వరికి ఉన్న 'గొడ్రాలు అనే అవమన పరిచే పేరు పోగొట్టటానికీ మంగమ్మ ఈ త్యాగం చెయ్యాలని మంగమ్మ రెండు చేతులూ పుచ్చుకుని అడిగింది రాజరాజేశ్వరి. 

"అమ్మగారూ...నాకు పూర్తి సమ్మతం. ఎలాంటి పరిస్థితిలోనూ ఈ నిజాన్ని నా వల్ల బయటకు రాదు"--నీరు నిండిన కళ్ళతో చేతిలో చెయ్యేసి చెప్పింది మంగమ్మ.

మరుసటి రోజే రాజరాజేశ్వరి గర్భంగా ఉన్నదనే వార్త అనుకున్న ప్రకారం వ్యాపింపచేశారు. పనివాళ్ళందరికీ తలా వెయ్యి రూపాయలిచ్చేరు పరంధామయ్య. మంగమ్మ కూడా పనిమనుష్యులతో కలిసి నిలబడి తానూ వెయ్యి రూపాయలు తీసుకుంది. 

ఒక్కొక్కరూ వచ్చి రాజరాజేశ్వరిని అభినందించి వెళ్ళారు. ఊర్లోని పలువురు సంతోష పడ్డారు. ఎదురుచూసినట్లే కొంతమంది కడుపు మంటతో రగిలిపోయారు. వారసుడు వచ్చేడు కాబట్టి ఆస్తులు చైజారిపోయేయని కొందరు గొణుక్కున్నారు.

రాజరాజేశ్వరి మాత్రం వేరే దేని గురించి ఆందోళన చెందకుండా తన పధకాన్ని కరెక్టుగా అమలు పరచటం లోనే తన పూర్తి దృష్టి పెట్టింది.

ఆసుపత్రి పరిశోధనల కోసం విజయవాడకు రాజరాజేశ్వరిని నకిలీగా తీసుకువెళ్ళి వచ్చారు పరంధామయ్య. మంగమ్మ వాళ్ళతో పాటూ వెళ్ళొచ్చింది.

తిరిగి వచ్చిన తరువాత, కాలం గడిచి దాల్చిన గర్భం వలన రాజరాజేశ్వరి గర్భ సంచీ చాలా బలహీనంగా ఉన్నదంటూ...ఆమెను హైదరాబాద్ లోని పెద్ద హాస్పిటల్లో తరచూ చూపిస్తూ చికిత్స చేసుకోవాలని డాక్టర్ చెప్పినట్లు ముగ్గురూ అందరితో చెప్పుకుంటూ వచ్చారు.

పనివాళ్ళ ముందు మంగమ్మని 'చెల్లీ' అని పిలవటం మొదలుపెట్టింది రాజరాజేశ్వరి. ఆమె వేళా విశేషం వలనే తన కడుపు పండిందని చెబుతూ వచ్చింది.

మిగిలిన వాళ్ళకు ఇది ఈర్ష్య ఏర్పరచినా, రాజరాజేశ్వరి మాటలను ఎవరు ఎదిరించి ఎం చెప్పగలరు?

ఈలోపు హైదరబాద్ గచ్చిబౌలి ఏరియాలో అన్ని వసతులతో కూడిన ఒక ఇళ్ళును కొన్నారు పరంధామయ్య. 

హైదరాబాద్ కు వెళ్ళే రోజును ఖాయం చేసారు. అందరి ముందూ మంగమ్మ మాత్రం తనతో రానివ్వండి అంటూ ప్రాధేయపడింది. పరంధామయ్య అందుకు ఒప్పుకున్నారు. పధకం వేసిన నాటకం నెరవేరటం మొదలైయ్యింది.

ఖాయం చేసుకున్న రోజున అందరూ హైదరాబాద్ బయలుదేరారు.

రైలు ఎక్కిన తరువాత అంతవరకూ తమ పధకం ఎటువంటి సందేహానికి చోటివ్వకుండా నేరవేరింది తలుచుకుని సంతోషించారు. అదే సమయం చివరివరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం గురించి కూడా గ్రహించారు.

హైదరాబాద్ చేరిన వెంటనే మంగమ్మని హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు. జాగ్రత్తగా ఆమె పేరు రాజరాజేశ్వరి అని, భర్త పేరు పరంధామయ్య అని రిజిస్టర్ చేశారు.

కడుపులో బిడ్డ ఆరొగ్యంగా ఉన్నదని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, నెల నెలా వచ్చి చూపించుకుంటే చాలని సలహా ఇచ్చి మంగమ్మ దగ్గర ప్రత్యేకంగా కొన్ని సూచనలిచ్చి పంపించారు డాక్టర్లు.

ఆమెను సొంత చెల్లెలు లాగనే చూసుకుంది రాజరాజేశ్వరి.  సత్యపాల్ కి మాటలు రాగానే తనని 'అమ్మా' అంటూ, పరంధామయ్యను 'నాన్నా' అని పిలవమని చెప్పింది. కానీ, మంగమ్మ పట్టుదలతో దాన్ని మార్చి 'పెదనాన్న-పెద్దమ్మా' అని పిలవమని చెప్పింది.  

మధ్య మధ్య పరంధామయ్య గ్రామానికి వెళ్ళి ఇళ్ళూ, పొలాలను చూసి వస్తున్నారు.

తన పత్తి వ్యాపారానికి హైదరాబాద్ ని కేంద్రంగా పెట్టుకుని బిజినస్ మొదలుపెట్టారు. బిజినస్ లోనూ ఆయనకు ఎటువంటి లోటూ రాలేదు.

మంగమ్మని జాగ్రత్తగా చూసుకున్న రాజరాజేశ్వరి ఇంటి పనులన్నీ ఆమే దగ్గరుండి   చేసుకుంది. మంగమ్మ ఆమెకు సహయాం చేయాలని వెడితే 'వద్దు అని ఆపేస్తుంది.  ఇంటి పనులకు పనిమనుషులను ఏర్పాటు చేస్తానని పరంధామయ్య చెప్పినప్పుడు వాళ్ళ నొటి మూలంగా ఇంటి విషయాలు బయటకు వెల్తాయని భయపడి వద్దని  చెప్పింది రాజరాజేశ్వరి. బిడ్డ పుట్టి ఆ బిడ్డ తల్లిపాలు తాగటం మరిచే వరకు కొత్త వారు ఎవరూ ఇంట్లోకి రాకూడదు అనే విషయంలో పట్టుదలగా ఉన్నది. 

డాక్టర్ రమ్మన్న తారీఖులలో మరిచిపోకుండా డాక్టర్ దగ్గరకు మంగమ్మని తీసుకు  వెళ్ళింది రాజరాజేశ్వరి. 'కడుపులోని బిడ్డకు ఏటువంటి కొరత లేదు అని డాక్టర్లు చెప్పినప్పుడల్లా వాళ్ళు చాలా సంతోష పడేవారు.  

ఒకరోజు మంగమ్మకి హఠాత్తుగా 'ప్రసవ నొప్పులు రావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి చేర్చారు. దగ్గరుండి చూసుకుంది రాజరాజేశ్వరి. గది బయట పరంధామయ్య ఎక్కువ ఎదురుచూపుతో మనశ్శాంతి తక్కువై అటూ ఇటూ నడుస్తున్నారు.  

ఆ రోజు సాయంత్రం అన్ని రోజులు వాళ్ళు తపస్సు చేసి ఎదురుచూస్తున్న ఆ మంచి వార్త దొరికింది.

మంగమ్మ అందమైన ఆడపిల్లను సుఖ ప్రసవంతో కన్నది.

తమకు ఒక వారసులు దొరికిన ఆనందంలో భార్యా-భర్తలు ఇద్దరూ పూరించి పోయారు.

రాజరాజేశ్వరి చేతులలో బిడ్డను చూసిన మంగమ్మ, తాను ఆమెకు చేసిన ద్రొహానికి, ఇప్పుడు పరిహారం చేసి ముగించింది తలచుకుని ప్రశాంతం చెందింది.

       ****************************************PART-8*****************************************

(అవినీతితో కాకుండా నిజాయితీతో వ్యాపారం చేసి సంపాదించిన డబ్బు మంచిని, సంతోషాన్ని ఇస్తుంది)

బిడ్డతో ఇంటికి వచ్చిన వాళ్ల దగ్గర ఉత్సాహం నదిలాగా ప్రవహించింది. ఆసుపత్రిలో ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ లో బిడ్డ తల్లి-తండ్రులు పరంధామయ్య - రాజరాజేశ్వరి అని ఉన్నది చూసి ఆపుకోలేనంత సంతోషం ఏర్పడింది.

కానీ, బిడ్డ తల్లిపాలు మరిచిపోయి తన దగ్గరకు వచ్చేంతవరకు జాగ్రత్తగా ఉండాలనేదీ జ్ఞాపకం తెచ్చుకుంటోంది.

బిడ్డను కంటికి రెప్పలాగా చూసుకుంటూ పెంచింది. బిడ్డకు గాయత్రీ వెంకటలక్ష్మీ' అని పేరు పెట్టింది. వెంకటలక్ష్మీ అనేది పరంధామయ్య తల్లి. 'గాయత్రీ' అని అందరూ ప్రేమతో పిలిచేరు.

---- గాయత్రీ యొక్క బర్త్ సర్టిఫికేట్ ను చూసిన రాజరాజేశ్వరి, ఆ బిడ్డను ఎత్తుకుని గుండెలకు హత్తుకుని ముద్దుల వర్షం కురిపించిది.

"నువ్వు నా కూతురివి. నేను కన్న బంగారానివి. ఇక ఎవరూ నన్ను గొడ్రాలు అని చెప్పటానికి వీలులేదు" అంటూ కన్నీటితో తనలో తాను మాట్లాడుకుంటోంది.

"ఇదిగో...నీ చెల్లెలు" అని చెప్పి సత్యపాల్ చేతుల్లో గాయత్రిని ఇచ్చింది. వాడు దాన్ని ఎత్తుకోలేక ఎత్తుకుంటుంటే వాళ్ళిద్దర్నీ దగ్గరకు తీసుకుని ముద్దులాడింది. మొదట్లో సత్యపాల్ ను దత్తతు తీసుకోబోతోందని వాడి మీద ప్రేమ వొలకబోసింది. ఇంకా వాడినే తన మొదటి బిడ్డగా అనుకుంటోంది. పిల్లల ప్రేమకొసం ఆమె ఇన్నాళ్ళు ఎదురుచూసింది పరంధామయ్యకు, మంగమ్మకు బాగా తెలుసు.

ఒక రోజు రాజరాజేశ్వరి అడిగింది "మనం హైదరాబాదులోనే ఉండిపోతే ఏమవుతుంది? ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయి కదా"

బయటకు కారణం అలా చెప్పినా, లోలోపల 'బంధువుల మొహాలను ఇక చూడక్కర్లేదు అనేదే నిజమైన కారణం.

పరంధామయ్య మనసులో కూడా ఈ ఆలొచన ఇంతకు ముందే ఏర్పడింది. గ్రామంలో వ్యవసాయం లేకపోతే అక్కడ ఆయనకు అసలు పనేమీ లేదు. ఏ పని లేకుండా ఖాలీగా ఊరంతా తిరిగుతూ వుండే వారు.

పల తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి, సుఖం ఉన్నా, ఖాలీగా కూర్చుని తినాలనే ఆలొచన, మనసు ఆయనకు లేదు. కాబట్టి, రాజరాజేశ్వరి ఆలొచనను  ఒప్పుకున్న పరంధామయ్య మొదట్లో తన చేతిలో ఉన్న డబ్బును హైదరాబాద్ నగరంలో జెండాలా ఎగురుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిపెట్టారు.  

ఆ వ్యాపారంలో మంచి లాభాలు రావటంతో అదే వ్యాపారాన్ని కొంచం కొంచంగా విస్తారము చేస్తూ మంచి అనుభవం సంపాదించారు.

వర్షాలు సరిగా పడకపోవటంతో వ్యవసాయ భూముల నుండి రావలసిన పంట పూర్తిగా రానందువలన, భూములను కొంచం కొంచంగా అమ్మి, ఆ డబ్బుతో హైదరాబాద్ చుట్టూ స్థలాలు కొని పడేశారు. తరువాత, ఆ స్థలాలో అపార్ట్ మెంటులు కట్టి అమ్మినందువలన ఆయనకు కోట్లలో లాభాలు వచ్చినై.

కుటుంబ పరిస్తితులు కూడా సంపూర్ణంగా ఆయనకు సహాయంగా ఉండటం ఆయనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చింది.

ఇంటి నిర్వహణాన్ని బాగా చూసుకున్నది రాజరాజేశ్వరి. మంగమ్మ ఆమెకు తోడుగా ఉన్నది. పని మనిషి అక్కర్లేదు అని ఇద్దరూ కలిసి తీర్మానించుకుని ఇంటి పనులను సరి సగం పంచుకున్నారు.

తల్లిపాలు తాగటం మరిచిపోయిన తరువాత గాయత్రిని పూర్తిగా రాజరాజేశ్వరి దగ్గర అప్పగించింది మంగమ్మ. ఆ సమయంలో మంగమ్మ కొంచంగా తడబడుతుందని ఎదురుచూసింది రాజరాజేశ్వరి. కానీ, రాజరాజేశ్వరి ఆస్తిని కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకుని తిరిగి ఆమె దగ్గరే అప్పగిస్తున్నట్టు ఎటువంటి తడబాటూ లేకుండా గాయత్రిని అప్పగించింది మంగమ్మ.  

అదిమాత్రమే కాదు...తనకు తానే గీసుకున్న లక్ష్మణ రేఖను ఏ రోజూ -- ఎటువంటి పరిస్థితుల లోనూ దాటేది కాదు. రాజరాజేశ్వరియే అడిగినా కూడా ఆమెను 'అక్కా' అని ఏరోజూ పిలిచింది లేదు. రాజరాజేశ్వరిని అమ్మగారూ అని పిలవటమే కాకుండా గాయత్రిని  చిన్నమ్మగారూ అని పిలవటం మొదలుపెట్టింది. ఎంతవరకు   కుదురుతుందో అంతవరకు గాయత్రికి దూరంగానే ఉన్నది. తాను ఏప్పటికీ ఆ ఇంట్లో పనిమనిషిననే కట్టుబాటును దాటేది కాదు. తన కొడుకు సత్యపాల్ కి కూడా కొంచం కొంచంగా ఆ మాటనే ఉగ్గుపాలు పోసినట్లు నేర్పడం మొదలుపెట్టింది.

పరంధామయ్యకు కూడా మంగమ్మ మీద ఎటువంటి ఆశ కలగలేదు. ఆమె, ఆమె కొడుకు సత్యపాల్ తన వలన కాపాడబడిన వాళ్ళూ అనేది మాత్రమే మనసులో గుర్తుపెటుకున్నారు. మంగమ్మ గురించి రాజరాజేశ్వరికి తెలిసిన తరువాత రాజరాజేశ్వరియే మంగమ్మను కంటికి రెప్పలా చూసుకోవటంతో పరంధామయ్యకు ఆ భాద్యత కూడా లేకుండా పోయింది.

గ్రామంలో ఉన్న అమ్మవారి గుడిలో వేసవి సంబరాలు వచ్చినప్పుడు, అందరూ బయలుదేరి గ్రామానికి వెళ్ళారు. ఊరే కలిసొచ్చి రాజరాజేశ్వరి బిడ్డను చూసింది. దాయాదులు, బంధువులు జనంతో పాటూ కలిసొచ్చి బిడ్డను చూసి వెళ్ళారు. కానీ, వాళ్ళ మొహాలలో నిరాశ, నిస్సృహ, కడుపు మంట ఉన్నది పరంధామయ్య గమనించటం మరువలేదు. 

కానీ, రాజరాజేశ్వరి దాన్ని నిర్లక్ష్యం చేసింది. చుట్టాల నిరాశ, నిస్సృహ, కడుపు మంట ఇక వాళ్ళను ఏమీచేయలేదని గర్వంతో ఉండిపోయింది.

తనకు ఇంత పెద్ద గౌరవాన్ని అందించిన మంగమ్మను గర్వంతోనూ,కృతజ్ఞతా భావంతోనూ చూసింది. మంగమ్మ...దీనికీ, తనకీ ఎటువంటి సంబంధం లేనట్లు వల్లితో కలిసి ఇంటి పనులు చేస్తోంది.

పరంధామయ్య ఇవన్నీ గమనించీ గమనించనట్లు ఉండిపోయారు.

కానీ, మంగమ్మకీ...ఆమె కొడుకుకూ వాళ్ళు ఇస్తున్న ముఖ్యత్వాన్ని చూసి పనిమనిషి వల్లీ లోలోపల ఈర్ష్య పడింది. 'ఎన్నో సంవత్సరాలుగా ఈ ఇంట్లో వాళ్ళకు ఏంతో విశ్వాసంగా ఉన్నానునిన్న వచ్చిన ఈమెకు ఇంత ముఖ్యత్వం, మర్యాదానా?' అని గొణుక్కుంది. కానీ, దాన్ని ఎలా బయట పెట్టగలదు?'

గ్రామంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ అందరూ హైదరాబాదుకు తిరిగి వెళ్ళారు. గాయత్రిని తమ కూతురుగానే గ్రామస్తులందరూ చూడటంతో పరంధామయ్య -- రాజరాజేశ్వరి దంపతులకు మహా సంతోషం. దాయాదులకూ, బంధువులకూ ఎటువంటి సందేహమూ రాకుండా ఉన్నందున మిక్కిలి తృప్తి పడ్డారు.

             *******************************************PART-9***************************************

(తాము కన్న బిడ్డల ముద్దు ముద్దు మాటల భాషను తియ్యగా అనుభవించలేని వారే కోకిల గానమూ, గజ్జెల చప్పుడూ తియ్యగా ఉంటాయని చెబుతారు)

పిల్లలు మంచిగా పెరుగుతూ వస్తున్నారు. సత్యపాల్ కు మూడేళ్ళ వయసు ముగిసినప్పుడు దగ్గరున్న స్కూల్లో చేర్చారు. అది చూసిన తరువాత తన కొడుకూ ఇలాంటి స్కూల్లో చదువుకునే అవకాశం దొరికిందే నని ఆనందపడింది మంగమ్మ.

కలకత్తలోనే ఉండుంటే ఈ వయసులో వాడిని నేను ఏ స్కూల్లోనైనా చేర్పించగలిగేదానినా? ఒక వేల చేర్చున్నా ఇలాంటి పెద్ద స్కూల్లో చేర్పించగలిగేదానినా?’ అంటూ ఆలొచించి రాజరాజేశ్వరికి తన మనసులోనే ధన్యవాధాలు తెలిపింది. ఎందుకంటే ఆమే తన కొడుకును ఈ స్కూల్లో చేర్పించాలని భర్తకు సలహా ఇచ్చింది.

కొడుకుకు కట్టిన స్కూల్ ఫీజు డబ్బు సంఖ్య తెలుసుకున్నప్పుడు మంగమ్మకి కళ్ళు తిరిగినై. దాని గురించి రాజరాజేశ్వరిని అడిగినప్పుడు "నా పెద్ద కొడుకు కోసం నేను ఖర్చు పెడుతున్నాను. నువ్వు నీ పని చూసుకో" అని చెప్పి మంగమ్మను అనిచివేసింది రాజరాజేశ్వరి. 

'కొన్ని సమయాలలో దేవుడు మనుషులకు కష్టాలు ఇచ్చినా అందులో నుండి వాళ్ళను ఆయనే తప్పించి, ఆయనే మంచి చేస్తారు అనేది ఇప్పుడు అనుభవించి తెలుసుకుంది మంగమ్మ.

సత్యపాల్ కూడా "పెద్దమ్మా...పెద్దమ్మా" అంటూ రాజరాజేశ్వరిని అతుక్కుపోయాడు.

గాయత్రి మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు మంగమ్మని 'అమ్మా' అని, సత్యపాల్ ని 'అన్నయ్యా' అని పిలవటం నేర్పింది రాజరాజేశ్వరి. కానీ మంగమ్మో, తనని 'పిన్ని అని పిలవాలని బలవంతం చేయటంతో... గాయత్రి అలాగే పిలవటం ప్రారంభించింది.  

రాజరాజేశ్వరి అది త్యాగం అని అనుకోగా, మంగమ్మో పాప పరిహారం అని అనుకున్నది.

పిల్లల ముద్దు ముద్దు మాటలతో ఇద్దరూ మైమరచిపోయారు.  ఇంట్లో ఉన్నప్పుడు పరంధామయ్య కూడా ఆ ఆనందంలో పాలు పంచుకుంటాడు.

గాయత్రికి మూడేళ్ల వయసు దాటినప్పుడు అదే స్కూల్లో చేర్పించింది రాజరాజేశ్వరి. పిల్లలిద్దరి మధ్యా ఎటువంటి వ్యత్యాసం చూపకుండా పెంచింది.

పిల్లలు పెరుగుతున్న కొద్దీ -- పరంధామయ్య వ్యాపరమూ చాలా బాగా పెరిగింది.  న్యాయమైన లాభం వస్తే చాలనే లక్ష్యంతో నాణ్యమైన ఉత్పత్తులతో అపార్ట్ మెంటులను కట్టివ్వడం వలన ఆయన కట్టిన అపార్ట్ మెంటులకు మంచి గిరాకీ ఏర్పడింది.

స్కూల్ ఫంక్షన్లలో, స్కూల్ జరిపే పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నప్పుడు ఆనందించి వాళ్ళను పొగడి ఉత్సాహపరచి తృప్తిపడ్డారు. చదువు మాత్రమే కాకుండా ఆటలలోనూ పాల్గొనాలని ప్రోత్సహించేది రాజరాజేశ్వరి. వీటన్నిటి గురించి ఏమీ తెలియని మంగమ్మో... రాజరాజేశ్వరి తన మీద చూస్పిస్తున్న దయ ఇది అని మాత్రం అనుకుని సంతోషపడింది.

ఆటల్లో, ముఖ్యంగా క్రికెట్ ఆటలో ఎక్కువ ఇష్టం చూపించాడు సత్యపాల్. గాయత్రి కూడా తనకు ఇష్టమైన రంగాలలో ఇష్టం చూపించింది. నృత్యం,ఆర్ట్,మాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకు వచ్చింది.

ఇంట్లోనైనా సరే, స్కూల్లోనైనా సరే... గాయత్రి మీద అనురాగం కురిపిస్తాడు సత్యపాల్.  

ఒకరోజు స్కూల్లో చెల్లెలు ఏడుస్తూ ఉండటం చూసి, సమాధానపరచి వివరం అడిగి తెలుసుకున్నాడు. చెల్లిని ఆమె క్లాసులో చదువుతున్న స్నేహితుడోకడు కొట్టాడని తెలుసుకుని, పరుగెత్తుకు వెళ్ళి అతన్ని కొట్టాడు. సమస్య స్కూల్ హెడ్ మాస్టర్ వరకు వెళ్ళటంతో, పేరంట్స్ ను రమ్మన్నారు.

రాజరాజేశ్వరి, మంగమ్మ వేగంగా అక్కడికి వెళ్ళారు. ఇంకొసారి సత్యపాల్ గనుక సహ విధ్యార్ధులను ఎవరినైనా కొడితే వెంటనే స్కూల్లో నుండి డిస్ మిస్ చేస్తానని చెప్పి  హెచ్చరించి పంపాడు హెడ్ మాస్టర్.

సత్యపాల్ తన నేరాన్ని ఒప్పుకోనేలేదు. చెల్లిని వాడు కొట్టాడు కాబట్టే వాడ్ని నేను కొట్టాను అని వాదించాడు. అందులో తప్పేమీ లేదని మొరాయించాడు.

అన్నా, చెల్లెల్ల మధ్య చిన్న చిన్న గొడవులు రావటం, అందులో వాళ్ళిద్దరూ గొడవపడటం కూడా అలవాటైపోయింది. కానీ, పిల్లలకు మధ్య ఇదంతా సహజం అని ఇద్దరు తల్లులూ పట్టించుకునేవారు కాదు. గొడవ పెద్దదైతే, చెల్లి కొసం సత్యపాల్ తగ్గుతూ గొడవ ముగిస్తాడు.  

గాయత్రి ఒక పట్టుదల మనిషిగా, తాను అనుకున్నది సాధించి  తీరాలనే గుణం కలిగిన పిల్లగా పెరగటం గమనించిన మంగమ్మ కొంచం ఆందోళన చెందింది. కానీ, అది రోజులు గడిచిన కొద్దీ మారుతుందని, ఆ భాద్యతనూ రాజరాజేశ్వరి తీసుకుంటుందని అని ఆలొచించి ప్రశాంతత చెందింది మంగమ్మ.

హటాత్తుగా గాయత్రి "రేయ్...అన్నయ్యా" అని సత్యపాల్ ను పిలవటం మొదలుపెట్టింది. అది విన్న రాజరాజేశ్వరి గాయత్రిని ఖండించింది. "పెద్దవాడిని మర్యాదతో మాట్లాడాలి" అని పాఠం నేర్పింది. కానీ మంగమ్మో, "రేయ్ అన్నయ్యా" అని పిలవటంలో హక్కు కలిగిన అనురాగం ఉన్నదని వాదించింది.  

"దానిపై బాగా గారాబం పెట్టి చెడుపుతున్నారు" అని చెప్పి వెళ్ళింది రాజరాజేశ్వరి.

అప్పట్నుంచి...'రేయ్ అన్నయ్యా" అనే పిలవటం మొదలుపెట్టింది.  

కానీ చిన్న వయసులోనే గాయత్రి మనసులో లోతుగా కూరుకుపోయిన విష విత్తనం అది అనేది మంగమ్మ గానీ, మిగిలిన వాళ్ళు గానీ అప్పుడు అర్ధం చేసుకోలేకపోయారు.

అలా అర్ధమయ్యుంటే అది మరింత పెరగటాన్ని అడ్డుకోనుంటారు. కానీ, విధి వాళ్ళకోసం వేరే పధకం వేసున్నది.

విధి ఆడుకోవాలని అనుకుంటే దాన్ని ఎవరు అడ్డుకోగలరు?

            **********************************************PART-10***********************************

(‘తాను అనే అహంకారంలో తేలుతున్నవారు ఇతరలకు ఇచ్చే దుఃఖాన్ని ఓర్పుతో నిదానంగా భరించే వాళ్ళు ఆ విధినే జయించవచ్చు)

మంచి కుటుంబంలో పుట్టినా, ఉన్నతమైన పరిస్థితితులలో పెరిగినా  కొన్ని సమయాలలో పిల్లల మనసులో తప్పైన భావనలు దూరిపోవటం వలన, అదే పెరిగి వృక్షమై వాళ్ళను తప్పైన దొవలో వెళ్ళేటట్టు చేస్తుంది. దానికి గాయత్రి కూడ ఉదాహరణ కావటంతో, ప్రశాంతగా ఉంటున్న ఆ కుటుంబాన్ని తుఫాన తాకటం మొదలైయ్యింది.

తన కంటే సత్యపాల్ కే ఇంట్లో అధికమైన అనురాగం, చనువు, ప్రాధాన్యం ఇవ్వబడుతోందనే అభిప్రాయం గాయత్రి మనసులో మెదలి అది పెరుగుతున్న కొద్దీ సత్యపాల్ మీద ఈర్ష్య గా మారింది.  

ఆమె మనసులో తుఫాన అంతర్భాగం కేంద్రీ కృతమవుతున్నప్పుడే, ఎప్పుడూ అతి జాగ్రత్తగా ఉండే మంగమ్మ అది గమనించింది. అయినా కానీ, ఆ ఆలొచనను మార్చుకోమని గాయత్రికి సలహా ఇవ్వటానికి భయపడ్డది.

అందువలన సత్యపాల్ తో చెప్పింది, "గాయత్రి నీ చెల్లెలురా. అది తెలిసో తెలియకో ఏదైనా తప్పుచేసినా, నిన్ను ఏదైనా అన్నా ఆ విషయాన్ని నువ్వు పెద్దది చేయకూడదు. ఆమె పైన ఎప్పుడూ అనురాగంతో ఉండాలి. ఏ కారణం చేత నైనా సరే చెల్లిని వేరుగా చూడకూడదు. సరేనా?"

నిజం చెప్పాలంటే చెల్లెలు విషయంలో సత్యపాల్ కు ఎటువంటి సలహాలు అవసరం లేదు. గాయత్రి అన్నయ్యను ఎంత ద్వేషించినా...అతను చెల్లి మీద అధికమైన అనురాగం, ప్రేమ చూపించేవాడు. ఇది మంగమ్మకు బాగా తెలుసు.

కానీ, ఏదో జరగ కూడనిది జరగబోతోందనే హెచ్చరిక భావము మంగమ్మను భయపెడుతూనే ఉన్నది. దాన్ని పోగొట్టుకోవాలనే సత్యపాల్ కు ఈ ఆలొచనను చెప్పింది.

గాయత్రి పెద్దదవుతున్న కొద్దీ ఆమెలో పలు సందేహాలు తలెత్తటం మొదలు అయ్యాయి.

'ఈ మంగమ్మ ఎవరు? ఏ విధంగా ఈమె మనకు బంధువు? ఆమ్మతో తోడ పుట్టిందా? అలా కూడా తెలియటం లేదే! ఎవరో ఒకడ్ని ఎందుకు నేను 'అన్నయ్యాఅని పిలవాలి? వీళ్ళకు మధ్య ఏదో ఒక మర్మం ఉన్నది. ఎందుకనో నాతో చెప్పకుండా దాస్తున్నారు. ఎవర్ని అడిగితే నిజం తెలుసుకో గలను?' - అని పలు ఆలొచనలు ఆమె మనసును గుచ్చుతున్నాయి.

దీనివలన చదువులోనూ, మిగిలిన కార్యకలాపాలలోనూ మనసు పెట్టలేకపోయింది గాయత్రి.

మంగమ్మ గురించి తెలుసుకోకపోతే తలపగిలి పోతుందేమోనని అనిపిస్తోంది గాయత్రికి.

ఒక రోజు ధైర్యం చేసి అడిగేసింది. మొదట్లో షాక్ తిన్న రాజరాజేశ్వరి ఆమెకు అవసరం లేని విషయాలలో తలదూర్చ వద్దని సలహా చెప్పి చూసింది. కానీ, గాయత్రి ఆమె సలహా వినకుండా నస పెడుతుంటే సహనం కోల్పోయి కోపం తలకెక్కటంతో ఆగ్రహం చెందింది.

"ఖచ్చితంగా జవాబు చెప్పే తీరాలా? ఇది నీకు అవసరం లేని విషయం. మాట్లాడకుండా నీ పనిచూసుకుని వెళ్ళిపో" అని అరిచింది........

ఆ రోజు వరకు ఎవరి దగ్గరా ఏర్పడని సందేహం ఈ రోజు గాయత్రి దగ్గర ఏర్పడటం చూసి భయపడింది రాజరాజేశ్వరి. 

'ఏ రోజూ నన్ను కోపగించుకోని తల్లి, ఈ రోజు ఎందుకు ఈ విషయం కోసం ఇలా కోపగించు కుంటోంది? నా కంటే అమ్మకి వాళ్ళే ముఖ్యమా?' అనే కోణంలో ఆలొచించటం వలన గాయత్రికి కొపం నశాలానికి ఎక్కింది.

'నాన్న దగ్గర అడిగితే మంచి సమాధానం దొరకొచ్చు అని ఆయన దగ్గరకు వెళ్ళింది.

తాను అమ్మ దగ్గర అడిగిందీ, దానికి ఆమె చెప్పిన సమాధనం చెప్పి..." మంగమ్మ ఎవరు?" అని ప్రశ్న వేసింది.

"అమ్మ బాగా కోపగించు కుందా?"

"అవును నాన్నా"--కళ్ళు నీళ్లతో నిండింది.  తండ్రైనా తనకు ఆదరణగా  ఉన్నారే అనే ప్రశాంతత ఏర్పడింది. కానీ, ఆ ప్రశాంతత ఎక్కువసేపు ఆమె దగ్గర నిలబడలేక పోయింది.

ఆయన చెప్పాడు: "అమ్మ నీ దగ్గర కోపగించుకుంది. కానీ నేను కోపగించుకోను. కానీ, సమాధానం మాత్రం ఒకటే. మంగమ్మ గురించిన ప్రశ్నలు మరిచిపో. ఇది ఎవరి దగ్గర అడిగినా నీకు సమాధానం దొరకదు. కానీ, తెలియవలసిన సమయంలో...తెలియవలసిన వయసులో ఖచ్చితంగా చెబుతాం. అంతవరకు చదువు మీద శ్రద్ద పెట్టు" -- ఓర్పుగానూ, దృడంగానూ చెప్పారు.

ఇప్పటికి ఎవరి దగ్గర నుండీ తనకు సమాధానం దొరకదు అనేది కవితకు బాగా అర్ధమైయ్యింది. కానీ, దానివలన నెమ్మదించాల్సిన రకం కాదు ఆమె. పెద్దవాళ్ళు దాచి దాచి పెడుతుంటే...నిజం తెలుసుకోవాలనే కచ్చే ఎక్కువై ఆమెను దహించి వేస్తోంది.

సరైన సంధర్భం కోసం కాచుకోనుంది.

ఆ తరువాత అందరి దగ్గరా ఎక్కువగా మాట్లాడటం తగ్గించింది.  వాళ్ళకు మధ్య ఒక చేదైన మౌనం ఏర్పడింది.

మంగమ్మ మాత్రం ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉన్నది. సత్యపాల్ ఎంత సమాధాన పరచినా ఆమె ఏడుపు ఆపలేదు. 'మనో భారాన్ని ఏడ్చే తీర్చుకోనీ' అని వదిలేశాడు.

సత్యపాల్ 'ఇంటర్ మీడియట్' ముగించినప్పుడు గాయత్రి 'పదో క్లాసు ముగించింది. వేసవి సెలవుల్లో వాళ్ళు గ్రామానికి వెళ్ళినప్పుడు, ఎవరి దగ్గర అడిగితే రహస్యం తెలుస్తుంది అని వెతికింది గాయత్రి. వల్లీ దగ్గర అడిగితే తెలుస్తుంది అని అనుకుని ఆమెను వేరుగా పిలిచుకు వెళ్ళి అడిగింది.

ఇంతకు ముందే మంగమ్మ మీద ఈర్ష్యతో కాలుతున్న వల్లీ, తన కడుపు మంటను పూర్తిగా వొలకబోసింది.

"ఒక సారి అయ్యగారు కలకత్తా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు, ఈమెను రైల్లో బిడ్డతో అనాధగా చూశారట. భర్త ఎక్కువ చిత్రవధలు పెట్టి బయటకు తరిమేసాడట. పనిమనిషిగా ఉంటుందని మంగమ్మని నా దగ్గరకు మొదట్లో పంపించారు. వచ్చిన రెండు నెలలకే ఈ చెండాలు రాలు ఏం మత్తు మందు పెట్టిందో తెలియలేదు...అమ్మగారే మంగమ్మని హటాత్తుగా 'చెల్లెలు అనేశారు. అది మాత్రమే కాదు......అందరూ హైదరాబాద్ కి మకాం మార్చారు. అమ్మగారిని ప్రతి రోజూ చూసే మాకు, ఇప్పుడు సంవత్సరానికి ఒక సారే చూడ గలుగుతున్నాము"

గాయత్రికి పలు సందేహాలు తీరినై. 'మొట్టమొదటిగా నాన్నకూ, మంగమ్మకీ ఎటువంటి సంబంధం లేదు. ఇంటి పనికోసమే పిలుచుకు వచ్చారు.

అమ్మను ఏ విధంగా మోసం చేసి చేతిలో ఉంచుకుందో కనిపెట్టాలి. అందులో నుండి అమ్మను విడిపించి ఆమెను ఇంటి నుండే తరిమేయాలి అని నిర్ణయించుకుంది.

ఆ తరువాత నుండి  కన్నవారితో సహజంగా మాట్లాడటం మొదలుపెట్టింది. కూతురిలో ఏర్పడిన మార్పు వాళ్ళకు కొంత ప్రశాంతతను ఇచ్చింది.

కానీ, మంగమ్మతో మాట్లాడటం మానేసింది. సత్యపాల్ దగ్గర మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు 'రేయ్ అన్నయ్యా" అనే మొదలు పెట్టింది. ఇప్పుడు ఆ 'రేయ్' అనడంలో నిర్లక్ష్యం, అగౌరవం నిండి ఉన్నది. సత్యపాల్ కు అది అర్ధమైనా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 

ఈ సమయంలోనే పరంధామయ్య తన వ్యాపారాన్ని తానొక్కడే చేయడం మొదలుపెట్టారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవటం వలన ఆయన తన వ్యాపారంలో ధ్యాస పెట్టలేకపోయాడు. వయసు కూడా అరవై దాటటంతోనూ, సుగర్ వ్యాధి రావడం వలనను గబ గబా పనులు చేయటం ఆయనకు కుదరటం లేదు. ఇది అర్ధం చేసుకున్న సత్యపాల్ తానుగా ముందుకు వచ్చి ఆయనకు సహాయపడ్డాడు. బి.కాం. చదువుకుంటున్న సత్యపాల్....ఖాలీ సమయాలలోనూ, సెలవు రోజుల్లోనూ ఆఫీసుకు వెళ్ళి ఆయన పనులన్నీ తన పనులుగా చేశాడు.  

'ఇంజనీరింగ్' లో చేరిన గాయత్రి, తాను కూడా ఆఫీసుకు వచ్చి పనులు చూసుకుంటానని మొండికేసింది. పరంధామయ్య మొదట్లో వద్దని చెప్పినా సత్యపాల్ కొరినందువలన గాయత్రి కూడా ఆఫీసుకు వచ్చి పనులు గమనించటానికి ఒప్పుకున్నారు. వసతులున్న ఒక గదిలో ఇద్దరూ కూర్చోటానికి రెండు టేబుళ్ళూ, కుర్చీలూ వేయించి అన్ని వసతులూ ఏర్పరచి ఇచ్చాడు.   

మొదటి రోజు గాయత్రి ఆఫీసుకు బయలుదేరుతున్నప్పుడు "ఏమ్మా...నా అపార్ట్ మెంట్ కట్టే పనులలో అన్నయ్య తో కలిసి నువ్వు పనిచేయాలనే నిన్ను 'సివిల్ చదివిస్తున్నాను. కానీ నేను ఎదురుచూడటానికి ముందే నువ్వు సహాయానికి వస్తానంటున్నావు...ఏ ఉద్దేశ్యం కోసం నువ్వు వస్తున్నావో ఇప్పుడు నాకు తెలియటం లేదు. కానీ, నువ్వూ, అన్నయ్య ఒకే  గదినుండి ఆఫీసు పనులను గమనించుకోవాలి. ఏ నిర్ణయాన్నైనా ఇద్దరూ కలిసి తీసుకుంటే నేను సంతోష పడతాను. మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే సత్యపాల్ తీసుకునే నిర్ణయాన్నే నేను ఆదరిస్తాను. 

ఇంటి విషయాలలో నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నా ఓర్చుకుని వెళ్ళిపోతాను! ఎందుకంటే...దాని బాధింపు మన ఐదుగురికి మాత్రమే. ఆఫీసులోనూ సత్యపాల్ ను  ఎదిరిస్తే, అది మన వ్యాపారాన్నే భాదిస్తుంది. మీ ఇద్దరూ వేరుబడి నిలబడితే పనివాళ్ళు కూడా వేరుబడి నిలబడతారు. నిర్వాహం రెండుగా చీలిపోతుంది. వ్యాపారం దెబ్బతింటుంది. మనమంతా రోడ్డున పడాల్సిందే. ఇప్పటికే వ్యాపారంలో నాకు పోటీ ఎక్కువగా ఉన్నది. దానితో పాటూ నువ్వు కూడా నాకు సమస్యలు ఏర్పరచకు. అలాంటిది ఏదైనా జరిగితే నిన్ను ఆఫీసులోపలకు వెళ్ళనివ్వను. నువ్వు చదువుకున్న ఆమ్మాయివి. అర్ధం చేసుకుంటావని నమ్ముతున్నాను"

ఆయన ఇంత కఠినంగా గాయత్రి దగ్గర మాట్లాడటం చూసి రాజరాజేశ్వరి మరియు మంగమ్మ అధిరిపడ్డారు. ఆయన మాటల్లో ఉన్న నిబ్బరాన్నీ, న్యాయాన్నీ గాయత్రి కూడా అర్ధం చేసుకుంది.   

తండ్రిని ఎదిరించి గాయత్రి అరవబోతుందని అందరూ ఎదురు చూశారు. కానీ గాయత్రి, "సరే నాన్నా, నేను చూసుకుంటాను"  అని చెప్పి పెద్దవాళ్ల కాళ్ళ మీద పడి నమస్కరించి వెళ్ళిపోయింది. అక్కడున్న వాళ్ళందరూ దీన్ని ఎదురు చూడలేదు. అందువలన అందరూ ఆశ్చర్యంతో... గాయత్రి వెళ్ళిపోవటాన్నే గమనిస్తూ నిలబడ్డారు.  

కానీ, గాయత్రి ఆలొచన వేరుగా ఉన్నది. ఆమె ఆఫీసుకు వెళ్ళటానికి కారణమే సత్యపాల్ ఏదైనా 'గోల్మాల్ చేసి డబ్బు కాజేస్తాడేమోనని రహస్యంగా గమనించటానికే! కాబట్టి...ఒకే గదిలో ఇద్దరూ ఉండటం ఆమెకు ఇబ్బంది అనిపించలేదు!!

ఆ రోజు ఆఫీసుకు వచ్చిన గాయత్రిని అభిమానంతో ఆహ్వానించాడు సత్యపాల్. ఆమె  కూర్చోవలసిన కుర్చీ చూపించి అందులో కూర్చోబెట్టాడు. ఆఫీసులో పని చేస్తున్న అందరినీ పిలిచి పరిచయం చేశాడు. 'ఈ కంపెనీ నిర్వాహంలో ఆమెకూ సరిసమమైన హక్కు ఉన్నది అన్నది అని గుర్తు చేశాడు.

ఇవేమీ పట్టించుకునే మనొస్థితిలో లేదు గాయత్రి. 'అంతా ఒక నాటకం...అది చూసి ఆ  మాయలో పడకూడదు అని మనసులో అనుకున్నది.

ఆ రోజు ఎటువంటి సమస్యలతో గాయత్రి ఇంటికి వస్తుందో అని అందరూ ఎదురుచూశారు. కాని గాయత్రి చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చింది. 

"ఆఫీసులో నీ మొదటి రోజు ఎలా గడిచింది?" అని అడిగింది రాజరాజేశ్వరి.

"బాగానే ఉన్నది. విషేషం ఏమీ లేదు" అన్నది గాయత్రి.  ఆమె మాట్లాడిన ఆంగ్లమూ, స్టైలూ మంగమ్మని పూరింపచేసింది. కానీ, తన కడుపు మంటను శ్రమ పడి అణుచుకుంది గాయత్రి.  

ఆ సమయంలో ఇంటికి వచ్చిన సత్యపాల్ అందరూ హాలులో ఉండటం గమనించి "అలాగే కూర్చోండి! ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అన్నాడు.  అందరూ కూర్చుని ఆసక్తిగా గమనించారు.

సత్యపాల్ చెప్పాడు, "మన కంపెనీకి ఒక పేరు రిజిస్టర్ చేయాలి. ఒక మంచి పేరు చెప్పండి"

ఒక్కొక్కరూ ఒక్కొక్క పేరు చెప్పారు. ఏదీ మంచిగా అనిపించలేదు.

గాయత్రి ఏ పేరూ చెప్పలేదు. 'ఇందులో ఎటువంటి మోసం ఉంటుంది?' అనే కోణంలో ఆలోచిస్తూ కూర్చుంది.

చివరిగా పరంధామయ్య అన్నారు, " సత్యపాల్, ఎలాగూ నువ్వు ఒక పేరు మనసులో ఉంచుకోనుంటావు. అది కూడా చెప్పేసేయి"

" గాయత్రి బిల్డర్స్"  చెప్పాడు సత్యపాల్.

అందరూ మిక్కిలి ఉత్సాహంతో ఆ పేరును అంగీకరించారు. గాయత్రి కూడా ఒక్క క్షణం ఉప్పొంగి పోయింది. కానీ మరు క్షణమే ఆమె మనసు ఆమెను హెచ్చరించింది. 'దీనికంతా ఉప్పొంగి పోకు గాయత్రి! సత్యపాల్ కంపనీకి నీ పేరు పెట్టి మిమ్మల్నందరినీ మూర్ఖులుగా చిత్రించటానికి  ప్రయత్నిస్తున్నాడు’.

ఇంట్లో వాళ్ళందరూ ఆ పేరును అంగీకరించటంతో, దాన్ని నిరాకరించటానికి ఎలాంటీ కారణమూ లేదు కాబట్టి గాయత్రి కూడా అంగీకారం తెలిపింది. 'ఇకమీదటే సత్యపాల్ ను తీవ్రంగా వాచ్ చేయాలీ అని నిర్ణయించుకుంది.

త్వరలోనే అమె చదువు పూర్తి అవుతుంది. మొదట్లో పై చదువులకు వీదేశాలకు వెళ్ళాలని అనుకున్న గాయత్రి ఇప్పుడు అది వద్దనుకుని ఫుల్ టైమూ కంపెనీ నిర్వాహంలో పాల్గొనాలని తీర్మానించింది.

బి.కామ్. డిగ్రీతో తన చదువును పూర్తి చేసుకున్న సత్యపాల్, రోజంతా వ్యాపారంలో శ్రద్ద పెట్టి పరంధామయ్యకు సహాయపడుతూ ఉండటం వలన ఆయన కూడా కొంచం కొంచంగా వ్యాపార బాధ్యతను అతనికి అప్పగించాడు.

         ****************************************PART—11***************************************

(అనుకున్న పనులను చేసి ముగించటంలో నీచులు కూడా ఆకాశ దేవతలకు సమం.  కానీ, దేవతలు మంచి దొవలను ఎన్నుకుని పనులు ముగిస్తారు. నీచులు దుర్మార్గమైన దోవలను ఎన్నుకుని తమ పనులు ముగించుకుంటారు)

ఇంటి సమస్యలలో అనవసరంగా తల దూర్చి అవస్త పడుతున్న గాయత్రిని ఇంకొక వ్యాధి కూడా పట్టి పీడించింది. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, యునానీ, న్యాచురోపతి అని ఏ చికిత్సా విధానంలోనూ ప్రపంచంలోనే ఆ రోగానికి నివారణే లేదు. ఆ రోగం ఆమెను పట్టుకుంది. దాని పేరే 'ప్రేమ’.

తనతో చదువుకుంటున్న నవీన్ మీద ప్రేమ ఎలా ఏర్పడిందో ఆమెకే తెలియనప్పుడు మనకు మాత్రం ఎలా తెలుస్తుంది?

అందులోనూ ఇది 'చూసిన వెంటనే' ఏర్పడిన ప్రేమ కాదు. గడిచిన మూడు ఏళ్ళుగా ఒకే క్లాసులో చదువుతూ వస్తున్నా, ఇంత వరకు నవీన్ మీద ఆమెకు రాని ప్రేమ భావం ఇప్పుడు ఎలా వచ్చింది?  

తిరిగి సమాధానం చెప్పలేని ఒక ప్రశ్న.

ఒకవేల ఇంట్లో అందరి మీదా ఏర్పడి పెరుగుతూ వస్తున్న ఏవగింపుకు దారి వెతకటం వలన ఏర్పడిందో?

ఉండొచ్చు! ఎందుకంటే ఇంట్లోని బాంధవ్యాల మధ్య మాటలు తగ్గటం వలన.... నవీన్ తో బాగా దగ్గర అయ్యుంటుంది.

ఇంట్లోని పెద్ద వాళ్ళు పిల్లలను పట్టించుకోకుండా పోవటం వలన వాళ్ళ మధ్య ఏర్పడే దూరం ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకొకరి మీద ప్రేమ ఏర్పడి అది వాళ్ళను తీవ్రంగా తన వసం చేసుకుంటుంది. పిల్లల ప్రేమ వ్యవహారం ఇంట్లోని పెద్దవాల్లకు తెలిసిన తరువాత వాళ్ళు పిల్లల మీద చూపించే జాగ్రత్తను దానికి ముందే చూపించి ఉంటే దేశంలో జరుగుతున్న పలు ఆత్మహత్యలనూ, హత్యలనూ, ఇంకా మరికొన్ని విపరీతాలనూ తప్పించవచ్చు. కానీ, ఏం చేయగలం? పెద్దవ్వాళ్ళు  అయినా  కూడా నిప్పును ముట్టుకుంటేనే కాలుతుందని కొందరికి ముట్టుకున్న తరువాతే తెలుస్తోంది?

మంగమ్మకు, తన తల్లి-తండ్రులకూ మధ్య ఉన్న అత్యంత సన్నిహిత బంధుత్వానికి కారణం ఏమిటి? వాళ్ల మధ్య ఏమిటి బంధుత్వం? ఇన్ని రోజులైనా దాని గురించి తెలుసుకోలేకపోయేమే నన్న ఆగ్రహం కూడా కవితను తన తల్లి -తండ్రులకు దూరం చేసింది.

కాబట్టే  ప్రేమ, ప్రేమికుడే ఇక తన లోకం అనుకుంది. ఆ తరువాత నవీన్ ను కలుసుకోవటానికి వచ్చినప్పుడు ఆమె చాలా ఉత్సాహంగా ఉన్నది.

"సార్ బాగా కుషీగా ఉన్నట్టు తెలుస్తోందే?"

"ఆకాశం నుండి దేవత దిగి వచ్చి 'ఐ లవ్ యూ' చెబితే ఎవరైనా కుషీగానే ఉంటారు"

"కానీ, ఆ దేవత దగ్గర నువ్వింకా నీ సమాధానం చెప్పలేదే?"

"చెప్పాలని ఆశగానే ఉన్నది...కానీ..."

"కానీ...ఏమిట్రా?"

"ఆమె చాలా ఎత్తులో ఉన్నది. నేను నేల మీద ఉన్నాను. నేను ఎలా ఆమెను...?"

"ఇదేనా 'మ్యాటరు?' చాలా 'సింపుల్, కిందకు దిగిరా అని చెబితే వచ్చేస్తుంది"

"వచ్చేస్తుంది. కానీ...అమ్మా, నాన్నా, బంధువులు....?"

"హలో...ఆమె పద్దెనిమిదేళ్ళు నిండిన మేజర్!  ఏదైనా స్వయంగా ఆలొచించగల వయసు అమెకు వచ్చి చాలా సంవత్సరాలైయ్యింది. ఆమె యొక్క నిర్ణయాన్ని ఇంకెవరూ మార్చలేరు"

ఇదే కదా అతను ఎదురు చూశాడు.

మా ఇళ్ళు మీ ఇళ్ళు లాగా బంగళా కాదు. మీ ఇంట్లో ఉన్నట్లు మా ఇంట్లో అన్ని వసతులు లేవు...."

"ఆపు నవీన్. నీ వసతులు చూసి ప్రేమించలేదు. నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. బంగళానూ, వసతులూనూ నాకు ఏమీ ఇవ్వలేదు. నాకు కావలసినదంతా నీ స్నేహమూ, ఆదరణ మాత్రమే. వీటికొసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా...?"

గాయిత్రి మాట్లాడుకుంటూ వెడుతుంటే, తన గురించి గాయిత్రి పూర్తిగా తెలుసుకుంటే ఏం జరుగుతుంది అని ఆలొచించాడు. 'తాలి కట్టిన తరువాత ఆమె నన్ను ఏమీ చేయలేదు అనుకుంటూ తన పాత ఆలొచనను వెంటనే నిర్లక్ష్యం చేశాడు.

"ఏయ్ నవీన్...నేనిక్కడ పరితపిస్తుంటే...నువ్వేంటి వేరే ఆలొచనలో ఉన్నావు?" అని అతన్ని కదిలించిది.

"మనం ఈజీగా పెళ్ళిచేసుకోవచ్చు. కానీ, ఆ తరువాత నిన్ను మా ఇంటికి  తీసుకువెళ్ళాలే? మా అమ్మా-నాన్నలు నిన్ను అమోదించాలే? అది తలుచుకుంటేనే భయంగా ఉంది"  అన్నాడు నవీన్.

"వాళ్ళు అమోదించకపోతే ఏమిట్రా? మన పెళ్ళి లోపల నా 'బ్యాంకు బాలన్స్ పెంచేస్తాను. వచ్చేటప్పుడు సాధ్యమైనంతవరకు నగలు తీసుకు వస్తాను. ఇంతకంటే ఏం కావాల్రా? మనం జాలీగా జీవితాన్ని ప్రారంభిద్దాం. అంతలో నువ్వొక ఉద్యోగం వెతుక్కోలేవా? కావాలంటే నేను కూడా ఉద్యోగానికి వెలతాన్రా. ఎప్పుడూ మన సంతోషమేరా ముఖ్యం"

"సరే గాయిత్రి...ఎందుకైనా మంచిది నేను మా అమ్మతో మాట్లాడతాను"

ఎడతెరిపి లేకుండా ప్రేమ భాషతో అతనికి ఆనుకుని కూర్చుంది.

పార్కూ, బజారు వీధి, సినిమా హాళ్ళు, రెస్టారెంటులు అంటూ ఒక్క చోటును కూడా వదిలిపెట్టకుండా తిరుగుతూ ప్రేమను అభివ్రుద్ది చేశారు. కాలేజీ క్యాంపస్ కూడా వాళ్ళకు స్వర్గంగా మారింది. నేరుగా కలుసుకోలేపోయిన సమయాలలో సెల్ ఫోన్,  అంతర్జాలం వాళ్ళకు సహాయపడింది.

ఇప్పుడంతా గాయిత్రి చదువు మీద పూర్తి శ్రద్ద పెట్టలేకపోయింది. చదువు ముగియబోయే సమయం కాబట్టి...పెద్ద బాధింపు ఏర్పడలేదు.

ఇప్పుడు నవీన్ గురించి మీకు కొంచమైనా చెప్పే తీరాలి.

మీరు అనుకుంటున్నట్టు అతనేమీ అంత మంచివాడు కాదు. ఇంట్లో బంధుత్వాలలో ఏర్పడిన ఘర్షణ, పగుళ్ళ వలనే గాయిత్రి నవీన్ ని ఆశ్రయించింది.  అతన్ని ఆశ్రయించడమే ఆమెను మరింత వేదనకు గురి చేస్తుందని ఆమె అర్ధం చేసుకోనుంటే, ఖచ్చితంగా నవీన్ ఉన్న వైపుకు వెళ్లేదే కాదు.  

గాయిత్రి ప్రేమను అంగీకరించటంలో ఉండే సాధక బాధకాలను జల్లించి పరిశోధించాడు నవీన్. ఇంతవరకు అమ్మాయలను ప్రేమించడంలో అతని దారి, వేరే దారిగానే ఉన్నది. ప్రేమించటం, అనుభవించటం, వదిలేయటం...ఇవే అతను ఎన్నుకున్న విధానం. 

అత్యంత వివేకంగా నడుచుకున్నాడు. ఏదైనా సమస్యలో తప్పించుకోలేనంతగా ఇరుక్కుంటే...అతని పరిస్థితి ఇంతే సంగతులే?

కానీ, గాయిత్రి ప్రేమ విషయంలో నవీన్ అతని రెగ్యులర్ విధానాన్ని అనుసరించ దలుచుకోలేదు! 'అది బంగారు గుడ్డు పెట్టే బాతు. ఆ బాతును కోసుకు తినడం మూర్ఖత్వం అవుతుంది...'అని అర్ధం చేసుకున్నాడు.  కల్పితాలకు కూడా దొరకనంత ఆస్తిపరురాలు. ఆమెను పెళ్ళిచేసుకుంటే, కొట్లకొలది ఆస్తికి అధిపతి అవుతాడు. దాని తరువాత తన ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. అందువలన గాయిత్రి ప్రేమను  అంగీకరించి జీవితంలో 'సెటిల్ అయిపోదాం అని ఆలొచించాడు.

ఆమె ఇంట్లో ఈ ప్రేమను ఖచ్చితంగా అంగీకరించరు. వాళ్లను ఎలా ఒప్పించాలి?

నవీన్ కు అతనిలాగానే గుణం కలిగిన కొందరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళను కలిసి సలహా అడిగాడు.

"బంగారు నిధి దొరికినప్పుడు దాన్ని తీసుకుందామా...వద్దా అని ఆలొచించే ఒకే ఒక మేధావి నువ్వొక్కడివే ఉంటావు" అని వాళ్ళు హేలన చేశారు.

"గుప్త నిధీ కావాలి, కానీ దానికోసం ఎక్కువ శ్రమ పడకూడదు. దానికి దారి చెప్పండిరా "

"చాలా 'ఈజీ' రా! గాయిత్రిని వాళ్ళింట్లో వాళ్ళకు తెలియకుండా పెళ్ళి చేసేసుకో"

"దానికి గాయిత్రి ఒప్పుకోవాలి కదరా?"

"ఒప్పించురా. దాంట్లో నీ మొత్త నైపుణ్యం చూపంచు"

"ఇప్పుడే చదువు పూర్తి అయింది. కొద్దిగా 'అరియర్స్ కూడా ఉంది. పెళ్ళి చేసుకుంటే దాని తరువాత ఖర్చులకు ఏం చేయనురా?"

"మావా...చదువు, అరియర్స్, అన్నీ తీసి అవతలపారేయ్. గాయిత్రి వలన రాబోయే ఆస్తికి ఎన్ని సున్నాలుంటాయో అమ్మకు వేసి చూపించు. ఆ తరువాత వాళ్ళు కూడా నీ దారిలోకి వస్తారు. వెళ్ళి ఎంజాయ్ చేయరా"

అంతే...ముగ్గురూ కలిసి ఒక పథకం వేసేరు. దాన్ని అమలు పరిచే మార్గాలు గురుంచి తీవ్రంగా ఆలొచించారు. వాళ్ళు చెప్పే అన్నిటికీ తల ఊపినా అతని కోతి  మనసు  మాత్రం 'డబ్బు, డబ్బు, మనీ, మనీ' అని ఆటలాడుతోంది!

            ********************************************PART-12*************************************

(రాబోవు కష్టం, పొందబోయే ఫలితం, దొరకబోయే లాభం గురించి బాగా ఆలొచించిన తరువాతే ఏ కార్యాన్నైనా మొదలుపెట్టాలి)

ఎంత ప్రయత్నించినా సత్యపాల్ పైన ఏ నేరమూ, ఏ తప్పూ కనుక్కోలేకపొయింది గాయిత్రి. కంపనీ లాభ-నష్టాల లెక్కల పట్టీని ప్రతి రోజూ ఆమె పర్యవేక్షణకు పంప బడ్డది.

బ్యాంకు అకౌంట్ ఇద్దరి పేరు మీద 'జాయింట్ అకౌంట్' గానే ఉన్నది. చెక్కులలోనూ ఇద్దరూ సంతకం పెట్టాలి. ఒడంబడికల లాంటివి గాయిత్రి చూసిన తరువాతే వాటి మీద తుది నిర్ణయం తీసుకుంటారు. రోజు వారి కూలీలకు ఇవ్వాల్సిన డబ్బు...బ్యాంకు లోనించి తీసిన డబ్బుకు సరిపోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ లెక్కలోనూ, ఏ చోటా చిన్న తప్పు దొరకలేదు గాయిత్రికి.

కానీ ఒక విషయాన్ని మాత్రం గాయిత్రి జీర్ణించుకోలేకపోయింది. ఎవరికైనా ఏదైనా పని చెబితే ఆమె దగ్గర చాలా మర్యాదగా చేయలేమని చెబుతూ సత్యపాల్ వైపు చేయి చూపిస్తారు.

'సత్యపాల్... సత్యపాల్...ఏది చెప్పినా, ఏది చేయమన్నా సత్యపాల్. అలాగైతే ఇక్కడ గాయిత్రి సంతకాలు పెట్టే ఒక యంత్రమా?' అని మనసులోనే మండిపడింది.

'దీన్ని నాన్న దగ్గర చెబుదామా?' అని అనుకున్న గాయిత్రి వెంటనే ఆ ఆలొచనను  మార్చుకుంది. సత్యపాల్ ని రెడ్ హ్యాండడ్ గా పట్టుకుని ఆయన ముందు నిలబెట్టి, ఆయన అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని పటాపంచలు చేయాలి. ఆ తరువాత వెంటనే తల్లినీ- కొడుకునూ ఇంట్లోంచి తరిమేయాలి. అంతవరకు ఓర్పుగా ఉండి అతన్ని గమనిస్తూ ఉండాలి అని నిర్ణయించుకుంది.

ఆ ఒర్పును పరీక్షించే విధంగా ఒక సంఘటన తొందరలోనే జరిగింది. తనకి, సత్యపాల్ కి కలిపి ఒక 'పర్సనల్ సెక్రెటరీ' ని నియమించాలని సత్యపాల్ నిర్ణయం తీసుకున్నాడు. అది అవసరమే నని గాయిత్రి  కూడా అనుకున్నది. ఒక అమ్మాయి తనకు 'సెక్రెటరీ' గా వస్తే, ఆమె దగ్గర నుండి కావలసిన వార్తలను తెలివిగా మాట్లాడి పిండేయాలి అని మనసులోనే లెక్క వేసుకుంది.

దాని గురించిన ప్రకటన వచ్చినప్పుడు, చాలా మంది దరఖాస్తు పెట్టారు. వాటన్నిటినీ పరిశీలించి, అందులో ఇద్దర్ని 'సెలెక్ట్' చేసింది. వాళ్ళు బాగా చదువుకున్న వారూ, ఆ ఉద్యోగం లో బాగా అనుభవం ఉన్న వాళ్ళే. దానికి తగినట్లే జీతం కూడా ఎదురు చూశారు.

సత్యపాల్ 'సెలెక్ట్' చేసిన వాళ్లలో అందరూ మామూలు పట్ట బద్రులు గానూ, అనుభవం లేని వాళ్ళు, ఇచ్చే జీతం తీసుకునే వాళ్ళుగా ఉన్నారు.

అతని సెలెక్షన్ ఆమెకు నచ్చలేదు. కడుపు మంటతో రగిలిపోయింది. ఓర్పు వహించింది. 'సరే, రానీ. పర్సనల్ ఇంటర్ వ్యూ లో చూసుకుందాం' అనుకుని వదిలేసింది.

పర్సనల్ ఇంటర్ వ్యూ వచ్చింది. పిలవబడ్డ నలుగురూ వచ్చారు. చివర్లో గాయిత్రి ఒకమ్మాయిని, సత్యపాల్ మరొక అమ్మాయిని 'సెలెక్ట్' చేశారు.

చెల్లెలు 'సెలెక్ట్' చేసిన స్టెల్లా, ఆంగ్లో ఇండియన్ అమ్మాయి. దానికి తగినట్లు నడక-దుస్తులు-భావాలు. సరళమైన ఆంగ్ల భాష. కొన్ని కంపెనీ లలో పనిచేసిన అనుభవం. అడిగినంత జీతం ఇస్తే వెంటనే ఉద్యొగంలో చేరిపోతుంది.  గాయిత్రికి ఆమె బాగా నచ్చింది.

సత్యపాల్ వసంత అనే అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న ఆమె తండ్రి హార్ట్ అటాక్ తో మరణించారు. డిగ్రీ చదువుతున్న ఆ అమ్మాయి చదువు ఆపేసింది. అంతవరకు ఫ్యామిలీ హెడ్ గా ఉండే తల్లి ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతోంది. వచ్చే పెన్షన్ లో సగం డబ్బు తల్లి చికిత్సకు ఖర్చు అవటం వలన ఆమెకు ఉద్యోగం అవసరం. చేతకాని ఉద్యోగంలో నేర్చుకోవడానికి, ఇచ్చే జీతానికి ఉద్యోగంలో జేరటానికి రెడీగా ఉన్నది.

ఈ ఎంపికలో తాను ఎంపిక చేసిన క్యాండిడేట్ ను వదులుకోవటానికి గాయిత్రి ఒప్పుకోలేదు. సత్యపాల్ కూడా తన ఎంపిక చేసిన క్యాండిడేట్ ను వదులుకోదలుచుకోలేదు.

ఈ అభిప్రాయ భేదం...ఇంట్లో అందరి ముందు వాదనగా మారింది.

"పని చేయించుకోవటం కొసమే కదా నువ్వు మనుషులను తీసుకుంటున్నావు?"

సత్యపాల్ మౌనంగా ఉంటూ చిన్నగా నవ్వాడు.

ఎప్పుడూ గాయిత్రి కోసం త్యాగం చేసే సత్యపాల్, ఈ విషయంలో మాత్రం పట్టుదలగా ఉండటం చూసిన పరంధామయ్య , వెంటనే వసంతను ఎంపిక చేశారు. కానీ, దానిని బయటకు చెప్పకుండా....'వాదన ముగింపుకు రానీ' అని కాచుకొని ఉన్నారు.

"ఆమెకు ఇంగ్లీష్ భాష సరళంగా మాట్లాడటం తెలియటం లేదు"

"ఆంధ్ర దేశంలో ఉంటూ ఇంగ్లీష్ భాష మాట్లాడటం తెలియటం లేదు అనేది ఒక అర్హత తక్కువ అని ఆలొచించటం పెద్ద అవమానం. రెండు, మూడు నెలలు స్పోకన్ ఇంగ్లీష్ కోచింగ్ క్లాసులకు వెళ్ళిందంటే అమె కూడా ఇంగ్లీష్ లో సరళంగా మాట్లాడేస్తుంది"

"డిగ్రీ ముగించిన ఆమె తిన్నగా పనికి వస్తే ఏం పని చేస్తుంది?"

"పుట్టేటప్పుడే ఎవరూ అనుభవంతో పుట్టరు! నేర్చుకోవాలనే ఉత్కంఠ ఉంటే...ఎవరైనా, ఏ పనినైనా సులభంగా నేర్చుకోవచ్చు. స్టెల్లా కూడా తన మొదటి కంపెనీలో అనుభవం లేకుండానే జేరుంటుంది"

అన్ని ప్రశ్నలకూ సత్యపాల్ వెంట వెంటనే సరైన సమాధానం చెప్పటం, తనకు  ఆదరణగా ఎవరూ మాట్లాడక పోవడంతో, కొపం తలకెక్కిన గాయిత్రి ఒక అబద్దమైన ప్రశ్న వేసింది.

ఇంతలా ఆమెను సమర్ధించి మాట్లాడుతున్నావే...ఆమె నీకేమైనా చుట్టమా?”

ఎటువంటి సంకోచమూ లేకుండా సత్యపాల్ సమాధానం చెప్పాడు: "స్టెల్లా నీకు చుట్టమైతే, వసంత నాకు చుట్టమే"

కోపం తట్టుకోలేక చెల్లెలు గాయిత్రి అరిచింది, "నా...న్నా"

ఆమె కోపాన్ని నిర్లక్ష్య పరచిన పరంధామయ్య, " గాయిత్రీ...నీకు ఇంతకు ముందే చెప్పేను. 'కంపెనీ విషయాలలో సత్యపాల్ తో గొడవపడొద్దు అని! వ్యాపారంలో అతను తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం. ఈ కంపెనీని మొదలు పెట్టిన వెంటనే హైదరాబాదులో మిగిలిన కంపెనీలతో పోటీ పడేంత ఎత్తుకు కంపెనీని పెంచింది అతనే. అతని నిర్ణయాలు ఏ రోజూ తప్పైందే లేదు. అదేలాగా ఈ నిర్ణయం కూడా కరెక్టుగానే ఉంటుంది. కాబట్టి నా ఎంపిక కూడా వసంతే "

ఆయన నిర్ణయం స్పష్టంగా ఉన్నది.

"ఈ ఇంట్లో నా కోసం ఎవరూ లేరు. సొంత ఇంట్లోనే నేనొక అనాధను" అని అరుచుకుంటూ కోపంగా, ఏడుస్తూ తన గదివైపు పరిగెత్తింది.

మహిళలిద్దరూ, " గాయిత్రి... గాయిత్రి " అని బ్రతిమిలాడుతూ గాయిత్రి వెనుకే పరిగెత్తేరు. కానీ, గాయిత్రి వాళ్ళ మొహం మీద కొట్టేటట్టు గది తలుపులను లోపల నుండి గట్టిగా తోసి తాళం వేసుకుంది.

పరంధామయ్య అంతకు మించి ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయారు.

మంగమ్మ వెనక్కి తిరిగి వచ్చి, “ఏందుకురా ఈ రోజు అంత పట్టుదల పడుతున్నావు? ఈ విషయంలో గాయిత్రి కోసం వదిలిపెడితే నువ్వేమన్నా తగ్గిపోతావా?" అని అడిగింది...కొడుకు దగ్గర.

"అమ్మా, నేను ఏది చేసినా కంపెనీ మంచికోసమే చేస్తాను. నన్ను నమ్ము..."" అని చెప్పేసి అతనూ తన గదికి వెళ్ళిపోయాడు.

'వీడు చెబుతున్న అమ్మాయిని పనిలో చేర్చుకుంటే కంపనీకి ఏమిటంత పెద్ద మంచి జరుగుతుంది?' అని ఇద్దరూ గందరగోళ పడ్డా, సత్యపాల్ పైన వాళ్ళకున్న అపారమైన నమ్మకం కొంచం కూడా తగ్గలేదు!

         *********************************************PART-13************************************

('పేద అని చెప్ప తగింది ఏదంటే, తనకు మంచి చేసే వాళ్ళను వదిలిపెట్టి, అవసరం లేని చెడు సావాసంతో చేతులు కలిపే అమాయకత్వం మే 'పేద అని చెప్ప తగింది)

తనని కలవటానికి వచ్చిన గాయిత్రిలో ఆగ్రహము, కోపముక్షోభ అంటూ పలురకాల భావాలతో పాటూ కలత కూడా ఉండటం చూసిన నవీన్..."ఏమిటీ, దేవత ఈరోజు బాగా నీరసంగా వస్తోంది?" అన్నాడు.

ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తుందేమో అనిపించింది. ఆమె స్వీయ గౌరవం ఆమెను అడ్డుకుంది.

"ఏమిటి...సమాధానమే లేదు?"

"నా ఇల్లే నరకంగా ఉన్నది!  ఎప్పుడ్రా ఆ ఇంట్లో నుండి వచ్చేద్దామని అనిపిస్తోంది"

పరిస్థితి తనకు అనుకూలంగా మారుతూ ఉండటాన్ని... గాయిత్రి మెల్ల మెల్లగా దిగి రావటాన్నీ గ్రహించాడు.

" ఇల్లు వదిలి రావటంలో పెద్ద శ్రమ ఏమీ ఉండదు గాయిత్రీ. ఆ తరువాత వాళ్ల ముందు మనం బాగా జీవించి చూపాలి. దానికి మనం తయారుగా ఉండాలి"

"ఏం నవీన్...నీ 'క్యాంపస్ ఇంటర్ వ్యూ' ఏమైంది?"

"రెండు కంపెనీలు సెలెక్ట్ చేసేయి...ఎప్పుడైనా కాల్ లెటర్ రావచ్చు"--మనసారా అబద్దం చెప్పాడు. నిజానికి అతన్ని ఏ కంపనీ సెలెక్ట్ చేయలేదు.

"సమస్యేమీ లేదు, వదిలేయ్. నీకు ఉద్యోగం దొరికేంత వరకు ఖర్చులు నేను చూసుకుంటాను"

"ఏం చెయ్యబోతావు?"

అతని మనసు, లోపల పాట పాడుతోంది: 'డబ్బు...డబ్బూ, మనీ...మనీ...'

"అది నా సమస్య. నువ్వు ఎందుకు దాని గురించి బాధపడుతున్నావు?"

"లేదు గాయిత్రి, నువ్వు ఏం చెయ్యబోతావు అనేది నేను తెలుసుకుంటే బాగుంటుంది"

ఇంతకు ముందే నా 'బ్యాంక్ అకౌంట్ బ్యాలన్స్ కొద్ది కొద్దిగా పెంచి ఉంచాను. నువ్వు పిలిచేంత వరకు పెంచుతాను. వచ్చేటప్పుడు వీలైనన్ని నగలు వేసుకుని వస్తాను. తరువాత ఏందుకు ఆందోళన?"

"లేదు గాయిత్రి. నాకు నువ్వు మాత్రమే కావాలి. నీ డబ్బుతోనూ, నగలతోనూ మన జీవితాన్ని ప్రారంభించటం నాకు ఇష్టం లేదు"

"ఏమీటి నువ్వు...నీది-నాదీ అని వేరుచేసి మాట్లాడుతున్నావు? మా నాన్న ఆస్తిని ఊర కుక్కలు అనుభవిస్తున్నప్పుడు  ఆ ఆస్తిని మనం అనిభవిస్తే తప్పా?"

ఇది కూడా అతను ఎదురు చూసిన జవాబే!

"అదికాదు గాయిత్రి..."

ఇక నువ్వేమీ మాట్లాడకు! నేను చెప్పేది మాత్రం చెయ్యి. ఏ రోజు అని మాత్రం చెప్పు. ఏ.టీ.ఏం కార్డు, నగలతో వచ్చేస్తాను"

'పెళ్ళి అని చెప్పిన వెంటనే ఇంత అధికారమా? రావే...రా. తాలి కట్టిన తరువాత పెట్టుకుంటాను నీతో కచేరీ'--చొక్కా కాలర్ ఎగరేశాడు. మనసు ఆనంద తాండవం ఆడింది.

స్నేహితులు చెప్పిచ్చినట్లు తల్లితో మాట్లాడాడు. మొదట్లో జాతి, కులం, గోత్రం అంటూ గొడవ పడ్డ ఆమె గాయిత్రి ఆస్తిపాస్తుల గురించి తెలుసుకున్నాకు నోరు వెళ్ళ బెట్టింది.

"ఆ అమ్మాయి నిజంగానే నిన్ను ప్రేమిస్తోందారా?"

అపనమ్మకంతో అడిగింది.

"నిజంగానే నమ్మా"--బల్ల గుద్ది నట్టు చెప్పాడు.

ఆశ్చర్య పోయిన నవీన్ తల్లి, ఈ విషయాన్ని భర్తతో చెప్పటానికి మంచి సంధర్భం కోసం కాచుకోనున్నది.

ఆ మంచి సంధర్భం దొరికింది. భర్తకు విషయం చెప్పింది. ఆయన ఒకే మాటలో 'కుదరదు అని చెప్పేడు.

"నీ కొడుకే ఒక పోకిరి వెధవ. వాడ్ని నమ్మి మరో పోకిరి ఈ ఇంటికి రాబోతోందా?"

 "ఏమిటండి మీరు. మరో ఇంటి అమ్మాయి గురించి అలా మాట్లాడుతున్నారు?”

తన కొడుక్కి ఇంత మంచి జీవితం దొరికే తీరాలి అనే ఆశతో పరితపించింది తల్లి.

"ఇలా చూడవే...నీ కొడుకూ, నువ్వూ కలిసి ఆపద అనే ఆటతో ఆడుకోబోతున్నారు. వాళ్ళు చాలా పెద్ద ఆస్తిపరులు అని చెబుతున్నావు. వాళ్ళకు ఈ విషయం తెలిసినప్పుడు ఉంటుందే మీకు"

"...................."

"కన్నవారి అంగీకారంతో...వాళ్ళ ఆశీర్వాదంతో జరిగేదే పెళ్ళి. తాలి కట్టుకుని లేచిపోవటం సినిమాలలోనే జరుగుతుంది. నిజ జీవితంలో వేలకొలది సమస్యలు ఉన్నాయే. ఇదంతా మనకు మంచిది కాదు"

"మీ ప్రశంగాన్నంతా తరువాత వచ్చి వింటాను. ఇప్పుడు మీరు పెళ్ళికి వస్తారా...రారా?"

 "వెళ్ళండే వెళ్ళండి! ఈ పాపంలో నాకు ఏ సంబంధమూ లేదు"

"కొడుక్కి ఒక మంచి జరుగుతుంటే తండ్రి మాట్లాడుతున్న మాటలను చూడండి" ---అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళింది ఆమె.

'వాళ్ళు పెళ్ళి చేసుకుని వచ్చిన తరువాత ఎన్ని పోలీసు స్టేషన్ల గడపలు ఎక్కాలోఎవరెవరి దగ్గర ఏమేమి అవస్తలు పడతామో?" అని .... రాబోవు పరిణామాలకు తనని తాను సిద్దం చేసుకుంటున్నాడు ఆయన.

తల్లీ, కొడుకులిద్దరూ కలిసి రాబోవు ముహూర్తం రోజుననే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొడుకు కంటే తల్లే ఇప్పుడు ఈ వివాహంలో ఎక్కువ ఆసక్తి చూపింది.

గాయిత్రిని కలిసి పెళ్ళి రోజు తారీఖు చెప్పాడు నవీన్. ఆ రోజే ప్రొద్దున 9.30 కి తాలి కట్టే కార్యక్రమం. ఆతను చెప్పే చోటుకు 8.30 కల్లా గాయిత్రి వచ్చేయాలి. ఆమెను పిలుచుకుని 9 లోపు అమ్మవారి గుడికి వెళ్లాలి. అక్కడ అతని తల్లి, స్నేహితులూ పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసి ఉంచుతారు. 

తాలి కట్టిన వెంటనే ఆలస్యం చేయకుండా నవీన్ తనని వాళ్ళింటికి తీసుకు వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఏం జరుగుతుందో చూసుకుని తరువాత ఏం చేయాలనేది ఆలొచిద్దాం. పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. దానికి కావలసిన ఏర్పాట్లను నవీన్ ఈ రోజే మొదలు పెడతాడు.  

అతను తన పధకాన్ని వివరించి చెబుతుంటే, దాన్ని ఎంతో ఆసక్తితో వింటున్న గాయిత్రి, చివర్లో "సూపర్" అన్నది.

"పెళ్ళి జరిగేంతవరకు మన పధకం రహస్యంగా ఉండనీ. నీకు బాగా క్లోస్ గా ఉండే స్నేహితురాలి దగ్గర కూడా చెప్పకు" అని హెచ్చరించాడు.

"ఇంకో విషయం గాయిత్రి. పెళ్ళి తరువాత ఎలాగూ విషయం మీ ఇంటికి తెలిసిపోతుంది.  అప్పుడు వాళ్ళు ఇచ్చే ఒత్తిడి వలన మీ నాన్న మనుష్యులు---ఆయన అడ్వకేట్లు మన మీద చేసే బెదిరింపు చర్యలు వలన నువ్వు మనసు మార్చుకుని నన్ను విడిచి వెళ్ళిపోవు కదా?"

నవీన్ మాట్లాడిన మాటలతో కరిగిపోయింది గాయిత్రి. నవీన్ యొక్క మనసు, 'హు...'రస్క్' తినాలంటే 'రిస్క్' తీసుకునే కావాలి అని 'పంచ్ డైలాగ్' మాట్లాడుకుంటోంది.

" నవీన్...నువ్వు ఎక్కువ భయపడుతున్నావు! నన్ను తక్కువగా అంచనా వేయకు. నా మాటల్లోనూ, చేష్టల్లోనూ నేను చాలా పట్టుదలగా ఉంటా" అన్నది.

అతని మెదడులో  ఏదో ఒక మూలన 'దీనికొసమే కదా ఆశపడ్డావు నవీన్?' అన్న స్వరం  పలకటాన్ని సంతోష పడ్డాడు.

"లేదు...నువ్వు మాత్రం నన్ను వదిలేస్తే, నన్ను చంపేస్తారు" అంటూ మొహాన్ని డల్ గా పెట్టుకుని చెప్పాడు.

"రేయ్...నువ్వు ఎక్కువ ఆలొచిస్తున్నావని అనుకుంటా. పిచ్చి పిచ్చి ఆలొచనలు మాని జరగాల్సిన పనులు చూడు" అని చెప్పి బయలుదేరింది.

వెళ్ళేటప్పుడు నవీన్ చేతిలో వంద రూపాయల కట్ట ఒకటి ఇచ్చి "ఖర్చులకు ఉంచుకో" అని చెప్పి వెళ్ళిపోయింది.

ఆమె తన కళ్ళకు కనిపించనంత దూరం వెళ్ళిన తరువాత, ఆమె తన చేతికి ఇచ్చిన వంద రూపాయల నోట్ల కట్టని తలపైన పెట్టుకుని నిజంగానే సంతోషంతో ఆడిపాడాడు నవీన్.

డబ్బు...మనీమనీ.

మనీమనీ...డబ్బు.

               ******************************************PART-14**************************************

(మంచి దారి తెలియని పేదవాడు ఏ కార్యం మొదలుపెట్టినా ఒకటి అది పాడైపోతుంది లేకపోతే ఆ పని అతన్ని నేరస్తుడిగా నిలబెడుతుంది)

ఒక రోజు ప్రొద్దున గాయత్రి, రాజరాజేశ్వరితో చెప్పింది: "అమ్మా నేను 7.30 కల్లా ఒక పెళ్ళికి వెల్తాను. కొంచం నగలు ఇవ్వమ్మా" అన్నది.

రకరకాల నగలను కూతురికోసం కొని ఉంచినా వాటిని ఒక్క రోజు కూడా కూతురికి వేసి అలంకరించి చూడలేదు. అందువల్ల ఈ రోజు ఆమె నగలు కావాలని అడగగానే ఆశ్చర్యంతో నగల పెట్టెను తీసుకువచ్చి ఇచ్చింది.

తరువాతి కొద్ది నిమిషాలలో పట్టు చీర యొక్క తలతల మెరుపులతో...ఒళ్ళంతా నగలతో నిండిన కాంతితో వచ్చి నిలబడ్డ గాయత్రిని ఆశ్చర్యంగా చూసింది. అంతవరకు గాయత్రి పట్టు చీర కట్టలేదు...ఇన్ని నగలు వేసుకోనూ లేదు.

"టిఫిన్ తిని వెళ్ళవే..."

"పెళ్ళివాలింట్లో తింటానమ్మా! నా 'ఫ్రండ్స్  అందరూ నా కోసం కాచుకోనుంటారు" -- తొందర తొందరగా చెప్పి వేగంగా నడుచుకుంటూ వెళ్ళింది.

కూతురు నడిచి వెడుతున్న అందాన్ని చూసి ఆనందపడుతూ వెనక్కి తిరిగిన రాజరాజేశ్వరి, వెనుక మంగమ్మ నిలబడి గాయత్రిని చూసి ఆనందపడుతుండటం గమనించింది.

"ఏమిటి మంగమ్మా...అలాగే నిలబడిపోయావు?"

"చిన్నమ్మగారే పెళ్ళి కూతురులాగా ఉన్నారు. తిరిగి వచ్చిన వెంటనే ఆమెకు దిష్టి తీసి వేయండి. దేవత లాగా ఎంత అందం? నా కళ్ళే పడేటట్టు ఉన్నది"

"మన కళ్ళన్నీ గాయత్రిని ఏమీ చెయ్యవు. ఊరి కళ్ళు కోసమే దిష్టి తీసేయాలి" అని చెప్పుకుంటూ లోపలకు వెల్లిపోయింది రాజరాజేశ్వరి.

దేవత ఎక్కడికి వెలుతోందో తెలియని ఆ ఇద్దరు మహిళలపై జాలి చూపాల్సిందే!

నవీన్ - గాయత్రి ఒక 'టూ వీలర్ లోనూ, అతని స్నేహితులు ఇద్దరు వేరొక 'టూ వీలర్ లోనూ ఎక్కగా ఆ రెండు 'టూ వీలర్ లు అమ్మవారి గుడి వైపుకు వెళ్ళే దారిలో వెళ్ళటం మొదలైయ్యింది.  

గాయత్రి మొహంలో కళ్యాణ కళ ఉట్టి పడుతుంటే, నవీన్ దగ్గర వేరే విధమైన ఉత్సాహం కనబడుతోంది. 

దానిని చెదరగొట్టే విధంగా రోడ్డు వంకర తిరుగులో హఠాత్తుగా రెండు కార్లు వచ్చి వాళ్ళకు అడ్డుపడింది.

ఆ కార్లలో నుండి గబ గబ మంటూ దిగిన కొందరు, 'టూ వీలర్ లను ఆపారు. వాళ్ళ చేతులలో ఉన్న ఆయుధాలను చూసి గాయత్రి, మిగిలిన వారు అధిరిపడ్డారు.

కార్లో వచ్చిన వాళ్ళలో కొంతమంది నవీన్ స్నేహితులను చూసి, "ప్రాణాల మీద ఆశ  ఉంటే పారిపొండి" అంటూ బెదిరించారు.

ఆయుధాలను చూసి భయపడిపోయిన స్నేహితులు ఇద్దరూ ఎటువంటి తిరుగుబాటూ చూపకుండా వాళ్ళ 'టూ వీలర్ ను వెనక్కు తిప్పుకుని కనిపించకుండా పారిపోయారు.

కొందరు నవీన్ గొంతు మీద కత్తి పెట్టి లాక్కుని వెళ్ళి కారు వెనుక సీటులో కూర్చో బెట్టి అతని చెరోపక్క ఇద్దరు కూర్చున్నారు.

ఒక్క క్షణంలో ఇవన్నీ జరిగిపోగా...ఒకడు గాయత్రి దగ్గరకు వచ్చి, "మేడం, మేము మీ దగ్గర మొరటుగా ప్రవర్తించటానికి ఇష్టపడటం లేదు. మమ్మల్ని శ్రమ పెట్టకుండా ఆ ముందు కారులో ఎక్కి కూర్చోండి" అన్నాడు.

ఎదురు చూడని ఈ సంఘటనతో షాక్ తిన్న గాయత్రి, "మీరు ఎవరు? ఎందుకోసం మమ్మల్ని ఎత్తుకుపోతున్నారు? నేను ఎవరనేది మీకు తెలుసా?" అని కోపంగా అడిగింది.

"అవన్నీ మాకు తెలియదు. తెలుసుకోవలసిన అవసరమూ లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి కారులో ఎక్కలేదనుకోండి  మేము లాక్కుని వెళ్ళి బలవంతంగా ఎక్కించవలసి వస్తుంది"

తనకు సహాయపడటానికి ఎవరైనా కనిపిస్తారా అని అటూ ఇటూ చూసింది. జన సంచారమే లేని ప్రాంతాన్నే వాళ్ళు ఎన్నుకున్నారు.

ఆ షాక్ నుండి తేరుకోలేకపోయిన గాయత్రి కారు వైపుకు నడిచింది. ఆ మనిషి కూడా ఆమెతో కలిసి వెళ్ళి, కారు డోర్ తెరిచాడు. ఆమె అందులో ఎక్కింది.

అప్పుడు డ్రైవర్ సీటులో కూర్చున్న వ్యక్తిని చూసి ఇంకోసారి  షాకుకు గురైంది.

అది సాక్షాత్తు సత్యపాల్!

"అరే దుర్మార్గుడా...నువ్వా?" అంటూ ఆమె అరవటాన్ని అతను పట్టించుకోలేదు.

బయట నిలబడి ఉన్నతనితో చెప్పాడు: నవీన్ నోరుకు ప్లాస్టర్ అతికించండి. చేతులను వెనుకపెట్టి కట్టేయండి. ఎదురు తిరిగితే కొంచం కూడా జాలి చూపకండి. అతని 'టూ వీలర్ ను ఎవరైనా ఒకరు తీసుకుని మా వెనుకే రండి" అని గబ గబా ఆదేశాలిచ్చి, ఆ తరువాత కారు స్టార్ట్ చేసి పోనిచ్చాడు.

గాయత్రి, సత్యపాల్ ను శపించటం, కొట్టటం, కారును తోలనివ్వ కుండా అడ్డుపడటం చేసింది.

ఓర్పు కోల్పోయిన సత్యపాల్, "ఒక అరగంట సేపు మౌనంగా ఉన్నావంటే నీకు పలు నిజాలను నిరూపిస్తాను. కానీ, నువ్వు ఇలా మొరాయిస్తే, అది వెనుక కారులో వస్తున్న నవీన్ కు ఇబ్బందిగా మారుతుంది. పరవాలేదా?" అని కఠినంగా అడిగాడు. 

పరిస్థితిని తనకు అనూకులంగా వాడుకుంటున్నాడనేది గ్రహించిది గాయత్రి. తన ముఖాన్ని రెండు చేతులతో మూసుకుని తల దించుకుని మౌనంగా కూర్చుంది.

'తరువాత ఏం జరుగుతుంది?' అని ఆలొచించింది.

పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి నిలబెడతాడు. తన పలుకుబడి నంతా ఉపయోగించి బెదిరిస్తాడు. 'అక్కడే మనం గట్టిగా మన మాట మీదే నిలబడాలీ

వాళ్ళకు ఎలా సమాధానం చెప్పాలి అని ఆలొచిస్తూ తనని తాను తయారుచేసుకుంటోంది. తల్లీ-తండ్రీ వచ్చి బ్రతిమిలాడినా ఎటువంటి పరిస్థితిలోనూ నవీన్ ను కాపాడాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ వచ్చినప్పుడు, కారు వాళ్ళ ఆఫీసులోకే వెళ్ళటం గాయత్రి గమనించలేదు. 

****************************************PART-15****************************************

(అనురాగం గురించి ఎమీ తెలియన వాళ్ళు, అనురాగం అనేది సంతోషాన్ని మాత్రమే ఇస్తుందని చెబుతారు. కానీ, కొన్ని సమయాలలో మనం మిగిలినవాళ్ళకు ఇచ్చే కష్టాలకు కూడా అనురాగమే మూలాధారంగా ఉంటుంది)

ఆఫీసుకు చేరుకున్న గాయత్రి, అక్కడకి ఎందుకు తనని తీసుకు వచ్చారో తెలియక సతమత పడింది.

పోలీస్ స్టేషన్ కు కాదు అని తెలిసినప్పుడ ఆమె మనసులో లోతుగా ఏర్పడిన భయం పోయింది. కొత్త ఉత్సాహంతో, కొత్త ధైర్యంతో పరిస్థితిని ఎదుర్కొనటానికి తయారయ్యింది.

కారులో నుండి దిగిన సత్యపాల్, ఆఫీసులోని తన గదిలోకి వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు.

గాయత్రి ఆ గదిలోకి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు రావటానికి ముందే పరంధామయ్య, రాజరాజేశ్వరి, మంగమ్మ అని ముగ్గురూ ఉన్నది చూసి ఆశ్చర్యపోయింది. జరిగేదంతా వీళ్ళందరూ 'కలిసి చేసిన కుట్ర అనేది గ్రహించిన ఆమె కోపం వెర్రిగా మారింది.   

కానీ, వీళ్ళ ప్లాను ఏమిటి అనేది తెలుసుకుని ఆ తరువాత మన ప్రతాపం చూపిద్దం అని అనుకుని, తన కోపాన్ని అణుచుకుని తన కుర్చీలో కూర్చుని, 'తరువాత సత్యపాల్ ఏం చెయ్యబోతాడు?' అని ఎదురుచూస్తూ కాచుకోనుంది.

నవీన్ ను ఇద్దరు మనుషులు ఆ గదిలోకి లాక్కుని వచ్చారు.

సత్యపాల్ కళ్ళతో సైగ చేయగా... నవీన్ కట్లు ఊడదీసి వాళ్ళిద్దరూ ఆ గదిలో నుండి వెళ్ళిపోయారు.

ఇంతవరకు సత్యపాల్ కఠినత్వాన్ని చూడని గాయత్రి ఇప్పుడు చూడటంతో ఆమెకే ఒక విధమైన భయం ఏర్పడింది. సత్యపాల్ ఇంత కఠినంగా నడుచుకోవటం ఇంతకు ముందు చూడని వారు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు.  

"నవీన్, అందులో కూర్చో" -- సత్యపాల్ చూపించిన కూర్చీలో కూర్చున్నాడు నవీన్. అతను బాగా భయపడుతున్నాడని అతని మొహమే బయటపెడుతోంది.

కఠినత్వం తగ్గని స్వరంతోనే అడిగాడు: " నవీన్, నువ్వు దాచకుండా నిజం చెబితే  ఎటువంటీ తరుగు లేకుండా ఇంటికి వెళ్ళిపోవచ్చు"

'ఏ నిజాన్ని ఇతను ఎదురుచూస్తున్నాడు?' అనేది అర్ధం కాక తడబడ్డ నవీన్, ఏదైనా  తానుగా ఏదీ వాగకూడదు అని జాగ్రత్త పడ్డాడు.

"మీరేం అడుగుతున్నారో నాకు అర్ధంకావటంలేదు"

"సరే...తిన్నగానే అడుగుతున్నా. గాయత్రిని నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా?"

గాయత్రికి ఒకప్రేమ వ్యవహారం ఉన్నదని గ్రహించిన గాయత్రి తెల్లి-తండ్రులు ఆశ్చర్యపోయారు.

నవీన్ ఎటువంటి సమాధానం చెప్పకుండా గాయత్రినే చూస్తూ ఉండటం గమనించిన సత్యపాల్, కోపంగా మళ్ళీ అదే ప్రశ్ననే అడిగాడు.    

"నేనూ, గాయత్రి ఒకర్నొకరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం. మీ దగ్గర చెబితే ఖచ్చితంగా మా పెళ్ళి చెయ్యరు. అందువల్ల మేమే పెళ్ళి చేసుకోవటానికి అమ్మోరి గుడికి వెలుతున్నాము. ఇప్పుడు కిరాయి గూండాలను పెట్టి మమ్మల్ని ఎత్తుకోచ్చి ఇక్కడకు తీసుకు వచ్చి బెదిరిస్తున్నారు"

'ఇప్పుడు మమ్మల్ని ఏం చేయగలరు?' అంటునట్టు సత్యపాల్ ని నిర్లక్ష్యంగా చూసింది గాయత్రి.

"దుర్మార్గురాలా! దీనికొసమేనా ప్రొద్దున పట్టుచీర, నగలతో బయలుదేరి వెళ్ళావు? ఇది గ్రహించలేక నిన్ను గుమ్మం వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించాను?" అంటూ మహిళలిద్దరూ కోపగించుకున్నారు.

ఎదురుచూడని ఈ సంఘటన గురించి విని పరంధామయ్య ఆశ్చర్యంతో నోరెల్లబెట్టేరు.

వీటి గురించి ఆందోళన చెందని సత్యపాల్, మరొక ప్రశ్నను పిడుగులాగా దింపాడు: "సరే నవీన్... గాయత్రి నీకు ఎన్నో ప్రేమికురాలు?"

ఈ ప్రశ్న అతనిని మాత్రమే కాదు, గాయత్రిని కూడా కలవరపరిచింది.

కానీ, నవీన్ కలవరం నుండి వేగంగా తేరుకుని, "మిస్టర్. సత్యపాల్, అన్యాయమైన నేరాలను మోపి నన్నూ, గాయత్రిని విడదీయటానికి ప్రయత్నిస్తున్నారు" అని విరక్తిగా సమాధానం చెప్పాడు.

కోపంతో చూసిన గాయత్రిని నిర్లక్ష్యపరిచిన సత్యపాల్, ఇంటర్ కాం లో ఎవర్నో..."లోపలకు రా" అన్నాడు.   

లోపలకు వచ్చిన వసంతను చూసిని నవీన్ కు వెంటనే చెమటలు పట్టినై. అతని మొహంలో భయం కనబడ్డది. తను సత్యపాల్ దగ్గర బాగా చిక్కు కున్నట్టు అర్ధం చేసుకున్నాడు.   

"ఏం నవీన్, ఈ వసంత నీకు గుర్తుందా? పవిత్రా హాస్పిటల్ ఎక్కడుందో నీకు తెలుసా?  డాక్టర్ జయలక్ష్మి తెలుసా? అక్కడ పనిచేస్తున్న నీ స్నేహుతుడు రాజును కూడా మర్చిపోయావా?" అంటూ సత్యపాల్ ప్రశ్నలడుగుతూ వెడుతూంటే, తన జాతకమే సత్యపాల్ చేతిలో ఉన్నదని బాగా అర్ధమయ్యింది నవీన్ కు. 

ఇంతకు మించి ఎదిరించి మాట్లాడితే తన గురించి మొత్తం కథ బయటకు వచ్చేస్తుంది అని భయపడి అక్కడ్నుంచి తప్పించుకుంటే చాలు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు.

"సార్. నేను ఏం చేయాలి చెప్పండి?" శరణాగతి అయ్యాడు.

పరిస్థితి తలకిందలుగా మారిపోవటాన్ని చూసి గాయత్రి కూడా నోరెళ్లబెట్టింది.

"గుడ్! ఇకమీదట వసంతకో, గాయత్రికో నీవల్ల ఎటువంటి ఇబ్బందీ రాకూడదు. అలా ఏదైనా జరిగితో నేను నీకు శత్రువుగా మారిపోతాను. ఇంకోసారి ఇలా నాగరీకంగా కూర్చోబెట్టి మాట్లాడను--మిక్కిలి కఠినంగా హెచ్చరించాడు.

దాన్ని అక్కడున్న అందరూ ఆశ్చర్యంతో చూశారు.

ఎలాంటి బురద గుంటలో నుండి గాయత్రిని కాపాడాడు అనేది అర్ధం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషించారు. అందుకోసమే ఆ రోజు వసంతను ఉద్యోగంలోకి తీసుకోవాలని పట్టుదల పట్టటంలో అతని తెలివితేటల తీరు, నిర్వాహ తెలివి, గాయత్రి మీద అతనికున్న అనురాగం, ఆమెకు ఎటువంటి హాని జరగకూడదని జాగ్రత్త పడటంలో అతను చూపిస్తున్న ఇంటరెస్టు ను తలచుకుని ఆశ్చర్యపోయారు.     

మంగమ్మకి దగ్గరే కూర్చోనున్న రాజరాజేశ్వరి మంగమ్మ చేతి మీద తన చెయి వేసి నొక్కి, వెయ్యి మాటలతో చెప్పాల్సిన మెప్పును ఆ ఒక్క స్పర్శతో తెలియజేసింది.

"ఇంకెవరైనా ఏదైనా అడుగుతారా?" అని గాయత్రిని చూసి అడిగాడు.

అతను చూసిన ఆ చూపులో తన శరీరాన్ని తొలుచి వెడుతున్న తూటాలు, తాను మరోకసారి ఓడిపోయిన భావాన్ని ఏర్పరచి అవమానంతో తల దించుకునేటట్టు చేసింది. దానికి కారణమైన నవీన్ ను కాల్చివేసేలాగా ఉగ్రంగా చూసింది గాయత్రి.

ఆ చూపులను తట్టుకోలేక తలవంచుకుని కూర్చున్నాడు నవీన్.

వసంతను పంపించి గాయత్రిని చూశాడు సత్యపాల్. ఆమె ఏమీ మాట్లాడే దోరణిలో లేదనేది అర్ధం చేసుకున్నాడు.

అతను పిలిచిన వెంటనే ఒకడు లోపలకు వచ్చాడు. అతనితో "సార్ గారికి ఆయన బండి ఇచ్చేసి దగ్గరుండి జాగ్రత్తగా పంపించండి" అన్నాడు. ఆ తరువాత నవీన్ వైపు తిరిగి "నువ్వు వెళ్ళొచ్చు. మళ్ళీ మనిద్దరం కలిసే సంధర్భం రాకూడదు. వస్తే అది నీకే మంచిది కాదు" అన్నాడు.

వెంటనే అతను లేచి తడబడుతున్న నడకతో నడిచాడు...కాల్చివేసేలాగా చూసింది గాయత్రి.

జరుగుతున్నవన్నిటినీ సినిమాలాగా చూస్తున్నారు అందరూ.ఎందుకంటే విషయం గురించి ఏమీ చెప్పకుండా వాళ్ళను అక్కడకు తీసుకు వచ్చాడు సత్యపాల్.

పరంధామయ్య అడిగాడు: "ఇన్ని విషయాలు తెలుసుకోవటానికి నువ్వు ఎంతో శ్రమ పడుంటావే?"

ఆయన ప్రశ్నలో...ఇతను ఉన్నప్పుడు ఇక నాకు ఎటువంటి ఆందోళన ఉండదు అనే గర్వం కనబడుతోంది.

"దీనికంతా ఇప్పుడు మనం పెద్దగా శ్రమ పడక్కర్లేదు పెదనాన్నా. ప్రైవేట్ గూఢాచార సంస్థలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర మనకు కావలసిన సేవలు చెప్పి డబ్బులు కడితే చాలు. రహాస్యంగా పనిచేసి మనకు కావలసిన వివరాలు అందజేస్తారు"

గాయత్రి తాను ఒక మోసగాడి దగ్గర నుండి కాపాడ బడ్డను అనేది నిదానంగా అర్ధం చేసుకుంది.  దాని కోసం సంతోష పడాల్సిన ఆమె, సత్యపాల్ మీద మరింత కోపం పెంచుకుంది. చాలా రోజులుగా అతను తనను, నవీన్ ను ఫాలో చేశాడు. మా వెనుక నీడలాగా పలువురు చుడుతూ వచ్చారు. నా ప్రైవసీ లో తల దూరుస్తూ ఉన్నారు. ఇంకా ఏమేమి తెలిసిపెట్టుకున్నాడో? ఏమేమి చెయ్యబోతాడో? వీడిని ఇలాగే వదిలేస్తే నాకు ప్రశాంతత ఉండదు. వీడిని, వీడి తల్లినీ వెంటనే ఇంటి నుండి తరిమేయాలి అని గట్టిగా తీర్మానించుకుని ఎవరి దగ్గరా, ఏమీ చెప్ప కుండా ఆఫీసు గదిలో నుండి తుఫాన లాగా బయటకు వెళ్ళింది. 

ఇంటికి వెళ్ళిన వెంటనే తుఫాన తాకబోతోందని మిగిలినవారు అర్ధం చేసుకున్నారు. ఆ తుఫాన తాకిడి నుండి ఎలా తప్పించుకోవాలో నని ఒక్కొక్కరూ తమ తమ ప్లానుల గురించి ఆలోచిస్తూ ఇంటి దారి పట్టారు.

కన్నవారిని పంపిచేసి సత్యపాల్ కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. కొంతసేపైన తరువాత వసంతను పిలిచి మాట్లాడాడు, "చాలా థ్యాంక్స్".

అంతకు మించి మాట్లాడలేక అతని గొంతు బొంగురు పోయింది.

"నాకు ఎందుకు సార్ థ్యాంక్స్ చెబుతున్నారు? మ్యాడం ను ఆమెకు రాబోయే పెద్ద ఆపద నుండి కాపాడటంలో నేనూ సహాయ పడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్"

"అయినా కానీ వసంతా, నీ పర్సనల్ రహస్యాలను బయట చెప్పాల్సి వచ్చిందే...?"

"పరవాలేదు సార్. 'ఇలాంటి ఒక సమయం వస్తుంది...అప్పుడు మీకు సహాయంగా ఉంటుందని ఇంతకు ముందే తెలుసు. అందువల్ల దీని గురించి నేనేమీ బాధపడటంలేదు. మీరు కూడా బాధపడ అక్కర్లేదు"

"థ్యాంక్స్ వసంతా, చాలా థ్యాంక్స్"

ఆమెను పంపించి, తాను కూడా ఇంటికి వెళ్ళాడు.

         ********************************************PART-16************************************

(చేసిన ద్రోహాన్ని సహించుకోలేక ద్రోహం చేసిన వాళ్ళను ధండించటం అప్పటికప్పుడు సంతోషం కలిగిస్తుంది. కానీ, ఆ ద్రొహాన్ని సహించుకోగలిగిన వారే...ప్రపంచం ఉన్నంతవరకు నిలకడైన సంతోషం పొందుతారు)

విపరీతమైన కోపంతో ఇళ్ళు జేరిన గాయత్రి, తన గదిలోకి వెళ్ళి తలుపును గట్టిగా తోసి మంచం మీద దబాలున పడింది. ప్రేమించినవాడు ఇంత నీచుడుగా ఉంటాడని ఆమె కలలో కూడా ఎదురుచూడలేదు. ఓటమిని ఆమె జీర్ణించుకోలేకపోయింది. తనని రహస్యంగా ఫాలో చేసింది కూడా ఆమె సహించుకోలేకపోయింది. సత్యపాల్ ను, వాడి తల్లిని బయటకు పంపకపోతే తాను ప్రశాంతంగా జీవించలేదని అనుకున్నది.

'వాళ్ళను ఎలా బయటకు పంపేది? నాన్నా, అమ్మా వాళ్ళను ఎందుకు నెత్తికి ఎక్కించుకుని ఆడుకుంటున్నారు?

ఇప్పుడు ఇతను...వాళ్ళ కళ్ళకు 'హీరో'గా కనబడతాడే! ఇంటి నుండి పారిపోయిన నా మాటలను ఇక వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు?'

ఇలాంటి ప్రశ్నలు ఆమె మెదడును కెలుకుతుంటే ఆమె ప్రశాంతత కోల్పోయింది.

నన్ను కన్న వాళ్ళు నాకు ఎలాంటి శిక్ష వేయాలనుకున్నా వేయనీ. కానీ, 'ఎలాగైనా వీళ్ళను బయటకు పంపించే' కావాలి అని నిర్ణయించుకుంది.

గదిలో నుండి బయటకు వచ్చి హాలులో నిలబడి, "నా..న్నా..." అని అరిచింది.

ఎదురు చూసిన సునామి...హాలులోకి వచ్చిందని గ్రహించిన అందరూ వెంటనే అక్కడికి వచ్చారు.

గాయత్రి...మళ్ళీ అరిచింది, "నాన్నా...ఈ అనాధ ఇక ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. వెంటనే బయటకు పంపించండి" అని చెబుతూనే సత్యపాల్ ను చూసి గుమ్మం వైపు చేయి చూపింది.

అదిరిపడ్డ పరంధామయ్య, భార్య వైపు చూశాడు. ఆయన మౌనాన్ని తనకు అనుమతిగా తీసుకుని ఇంకా గట్టిగా అరిచింది. బిచ్చం అడుక్కోవటానికి వచ్చిన వాళ్ళు, ఈ రోజు ఇంటినే ఆక్రమించారు. వీళ్ళను ఇంకా ఇక్కడ ఉంచితే త్వరలో మనల్నే రోడ్డు మీదకు పంపించేస్తారు"

అంతవరకు ఓర్పుతో ఉన్న రాజరాజేశ్వరి, "ఒసేయ్...ఎవర్ని చూసి ఏం మాట్లాడుతున్నావు?" అన్నది కోపంగా!

దానికంతా ఆమె అనిగిపోవటానికి తయారుగా లేదు. వాళ్ళు ఎవరు...ఎందుకని ఇక్కడ అతుక్కుని ఉన్నారుఇది తెలుసుకోవటం కోసమే కదా ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు పడ్డాను.

ఇదొక మంచి సంధర్భం. ఈ సంధర్భాన్ని సరిగ్గా వాడుకోవాలి. అందుకని, తల్లి దగ్గర కఠనంగా అరిచింది, "నాకంటే వాళ్ళే నీకు ముఖ్యమా? కన్న కూతురు కంటే మిగిలినవాళ్ళు నీకు బాగా కావలసిన వాళ్ళు అయిపోయారు కదా?"

"నిన్ను నిజంగా కన్నది ఎవరో నీకు తెలుసా?'...పేలింది రాజరాజేశ్వరి.

మంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి రాజరాజేశ్వరి చేతులు పుచ్చుకుని, "అమ్మా...వద్దమ్మా. ఏదీ చెప్పేయకండి" అని బ్రతిమిలాడింది.

కోపంగా మంగమ్మ వైపు తిరిగి చూసిన గాయత్రి, "ఓవర్ గా నటించకే! ఏవేవో కధలు చెప్పి మా  అమ్మను మోసం చేసి నీ గుప్పిట్లో ఉంచుకున్న మాయాలమారివి నువ్వు" అన్నది.

గాయత్రి చెప్పి ముగించే లోపు గాయత్రి చెంప మీద 'చెల్లు మని లాగి ఒక దెబ్బ కొట్టింది రాజరాజేశ్వరి.

ఎదురుచూడని ఆ దెబ్బతో తడబడిపోయింది గాయత్రి. అయినా, అమె కోపం, ఆగ్రహం అన్నీ వెర్రిగా మారి... మంగమ్మ చేతులు పుచ్చుకుని ఇంటి బయటకు లాక్కుని  వెళ్ళింది.

పరిగెత్తుకు వచ్చి వాళ్ళను అడ్డుకున్న రాజరాజేశ్వరి, “బయటకు వెళ్ళాల్సింది ఈమె కాదే. ఈ రోజు వరకు గొడ్రాలుగా ఉంటున్న నేనేనే బయటకు వెళ్ళాల్సింది. నేను కన్న కూతురివి కావు నువ్వు. మీ నాన్నకూ, ఈ మంగమ్మకి పుట్టిన దానివి నువ్వు"

తన తల మీద పిడిగు పడినట్లు అయ్యింది గాయత్రికి. ఆమె అది నమ్మలేకపోయింది. రాజరాజేశ్వరియే చెప్పినందువలన నమ్మకుండానూ ఉండలేకపోయింది. రెండు చేతులతోనూ తల పట్టుకుని కూర్చుండిపోయింది.

కోపంగా ఆమె దగ్గరకు వచ్చి చేతులు పుచ్చుకుని పైకి లేపి మాటలు పొడిగించింది రాజరాజేశ్వరి, "నువ్వు నిజంగానే మంగమ్మ కన్న కూతురివే. తపం చేసి గర్భం దాల్చి పది మాసాలు మోసి నొప్పులను భరించి కనాల్సిన పుత్ర భాగ్యానికి నోచుకోని అర్హతలేని గొడ్రాలైన నాకు, నిన్ను పూర్తిగా కూతురిగా ఇచ్చేసిన త్యాగి అది.

చేసిన ఒకే ఒక తప్పుకోసం తనని తానే దండించుకుని...తపస్సు చేసే జీవితం జీవిస్తూ వస్తున్న పుణ్యవతే ఆమె. అదిమాత్రమే కాదు...నీ మీద ఎటువంటీ బంధుత్వాన్నీ కలుపుకోక -- ఆమెకూ, సత్యపాల్  కూ నువ్వు చేసిన ఘోరాల నన్నిటినీ సహించుకుని...నిన్ను అభిమానిస్తూ...నీకు మంచి చేయాలని, చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పు...వాళ్ళను బయటకు పంపేద్దామా?”

ఒక్క క్షణంలో పర్వత శిఖరం పై నుండి ఎగరేయబడి చదురమైన నేల మీద పడినట్లు ఫీలైంది. తాను ఏదేదో ఊహించుకుని తప్పుగా అనుకుంటుంటే, అందరూ ఓర్పుగా ఉండటంతో పాటూ ఆమె మీద ప్రేమానురాగాలు కుమ్మరించేరనేది ఫీలై నప్పుడు ఏడుపు ముంచుకు వచ్చింది. అలాగే ఒక స్తంభానికి ఆనుకుని జారుతూ కింద కూర్చుండిపోయింది. రెండు కాళ్ళనూ దగ్గరగా పట్టుకుని మోకాళ్ళపై తల దించుకుని '' అంటూ ఏడ్చింది.

ఆమెను సమాధాన పరచటానికి రాజరాజేశ్వరి ప్రయత్నించినప్పుడు  'ఏడ్చి ముగించనీ' అని సత్యపాల్ సైగ చేసి అడ్డుపడ్డాడు.   

ఏడ్చి ముగించిన తరువాత రాజరాజేశ్వరి గాయత్రి దగ్గరకు వెళ్ళి కూర్చుని ఆదరణగా ఆమె తల నిమిరింది.

"అమ్మా, మీరందరూ నా మీద అంత ప్రేమ చూపించినప్పుడు...నేను మిమ్మల్ని అర్ధం చేసుకోకుండా తప్పుగా నడుచుకున్నాను. నేనూ కష్టపడుతూ...మీ అందరినీ ఆవేదనకు గురిచేశాను. నేను తప్పుగా నిర్ణయం తీసుకుని ఇంటి నుండి వెళ్ళినప్పుడు కూడా అన్నయ్య ఎంతో శ్రమపడి నా తప్పును ఎత్తి చూపినప్పుడు అది కూడా అర్ధం చేసుకోకుండా మిమ్మల్ని మరింత కష్టపెట్టాను.

మీరు ఆ కష్టాలన్నిటినీ సహించుకుని...నా మీద ప్రేమ కురిపించారు. మీదగ్గర ఎలా క్షమాపణలు అడగాలో తెలియటం లేదు" అన్నది.

దానికి రాజరాజేశ్వరి, "నువ్వు చిన్నప్పటి నుండీ మంచిదానివే. ఆ విషయం మాకు బాగా తెలుసు. మధ్యలో నీకు కొన్ని సందేహాలు ఏర్పడటంతో అప్పట్నుంచీ నువ్వు చేసేవన్నీ తప్పుగా చేశావు. నీకు వివరాలు అర్ధం చేసుకునే వయసు వచ్చినప్పుడు నీతో నిజం చెప్పాలని అనుకున్నా. కానీ, దానికి ముందే అన్నిటినీ తప్పుగా అర్ధం చేసుకున్నావు...నువ్వూ కష్టపడి, మమ్మల్నీ కష్టపెట్టావు! నీ పట్టుదల మాకు తెలుసు. మేము చెబితే వినవు. అందువల్ల నువ్వుగా అర్ధం చేసుకునేంత వరకు కాచుకోనున్నాము. మాలో ఎవరికీ నీమీద కోపం లేదు. అందువల్ల నువ్వు ఎవరి దగ్గరా క్షమాపణ అడగక్కర్లేదు" అన్నది.

అయినాకానీ గాయత్రి సమాధాన పడలేదు. తండ్రిని చూసి, "నన్ను క్షమించడి నాన్నగారూ. మీ గురంచి చాలా నీచంగా ఆలొచించాను. అందువల్ల మీ దగ్గర బాగా నిర్లక్ష్యంగా మాట్లాడాను. నన్ను క్షమిస్తారా నాన్నా?" అని ఏడ్చింది.

పరంధామయ్య ప్రేమగా కూతుర్ని దగ్గరకు తీసుకుని, " గాయత్రీ, అయ్యిందేదో అయిపోయింది. పాతవన్నీ మరిచిపోయి ఇకనైనా మనమందరం సంతోషంగా ఉందాం" అని చెప్పి గాయత్రి కన్నీరును తుడిచాడు.

తరువాత ఆమె సత్యపాల్ ను చూసినప్పుడు, అతను గాయత్రిని మాట్లాడనివ్వకుండా,   "చాలు గాయత్రీ...నువ్వు ఏడ్చిందీ చాలు. క్షమించమని అడగటం కూడా చాలు. ఏప్పుడూ నువ్వు నా ప్రియమైన చెల్లివే. నీమీద నాకు ఎప్పుడూ కోపం వచ్చిందే లేదు"  అన్నాడు.

మంగమ్మ వైపు తిరిగిన గాయత్రికి, ఆమె మొహాన్ని నేరుగా చూడడానికి ధైర్యం చాల లేదు. ఆమె దగ్గరకు నడవాలనుకున్నప్పుడు గాయత్రికి అడుగులు తడబడ్డాయి. కింద పడబోతుంటే మంగమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి గాయత్రిని పట్టుకుంది.

"అమ్మా...అమ్మా..." అని ఏదేదో చెప్పాలనుకున్నది. కాని నొటి నుండి ఒక్క మాట కూడా బయటకు రాలేకపోయినై. కన్నీళ్ళు మాత్రం ధార ధారగా వచ్చింది.

మంగమ్మ ఆమెను పొగడింది. "నీ మీద తప్పేమీ లేదమ్మా. అందువల్ల నువ్వు క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు.

సత్యపాల్ కు వివరాలు అర్ధం చేసుకునే వయసు వచ్చినప్పుడు, వాడి దగ్గర ఏ ఒక్కటీ దాచకుండా అన్నీ చెప్పాను. వాడు దానిని సరిగ్గా అర్ధం చేసుకున్నాడు కనుక ఎటువంటి  సమస్య లేకుండా పోయింది. కానీ, నీకు మా మీద చిన్న వయసు నుండే సందేహం రావడంతో, నీ దగ్గర ఏ విషయాన్నీ చెప్పలేకపోయాము. చెప్పినా నువ్వు అర్ధం చేసుకునే పరిస్థితిలో లేవు. సరే, నువ్వు అర్ధం చేసుకునేంత వరకు ఆగాలని ఆగాము. ఆ మంచి రోజు ఈ రోజే వచ్చింది. నువ్వూ నిజాలను సరిగ్గా అర్ధం చేసుకున్నది మంచిదయ్యింది. దీనికి సంతోషించాలి. ఏడవకూడదు."

"అమ్మా... నాకొసం నువ్వు ఎంతో పెద్ద త్యాగం చేశావు?"

"లేదు. నేను చేసిన దాంట్లో ఏ త్యాగమూ లేదు. నీవలన నాకు మంచి రక్షణ దొరికింది. సత్యపాల్ కు మంచి జీవితం దొరికింది. ఈ ఇంటికి ఒక వారసురాలు దొరికింది. అమ్మగారికి  సంఘంలో ఉన్న చెడ్డ పేరు తొలగిపోయింది...ఇలా నువ్వు నా కడుపులో పడిన దగ్గర నుండి మాకు మంచి చేసే పుట్టావు.

'తాను ఇన్నిరోజులుగా వాళ్ళ దగ్గర తప్పుగా నడుచుకున్నా, వాళ్ళ తన మీద ఎటువంటి కోపమూ చూపకుండా ఎంతో ప్రేమగా ఉన్నారే? ఈ స్వర్గాన్ని అనుభవించకుండా నరకంగా చేసుకున్నానే?' అని తలచుకుని బాధపడింది. వాళ్ళింట్లో ఉన్న ఒక్కొక్కరి మీద ప్రేమ, అభిమానం, మర్యాద పెరిగింది.

అందువలన, తిరిగి ఇంకోసారి ఆమె మొహం వైపు చూసి ప్రేమగా "అమ్మా"అని పిలిచింది

"కాదు...నేను మీ అమ్మను కాదు. అది నువ్వు పూర్తిగా మరిచిపోవాలి"

"అమ్మా..."

"ఇదిగో ఈమే నీకు అమ్మ. నేను ఎప్పుడూ పిన్నినే"

మంగమ్మ ఎందుకు అలా మాట్లాడుతోందనేది ఎవరికీ అర్ధం కాలేదు.

"ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నా మీద ఇంకా కోపం పోలేదా?" అడిగింది గాయత్రి.

"కోపం కాదురా పండూ. నువ్వు కడుపులో ఉన్నప్పుడే ఎవరేవరికి మంచి జరిగిందో చెప్పానే, అవన్నీ కొనసాగాలి...నిలబడాలి. దానికి నేను కాలమంతా నీకు పిన్నిగానే ఉండాలి. అమ్మగారే నిన్ను కన్నది అనేది మారనే కూడదు. అదే అందరికీ మంచిది"

".................................."

"అది మాత్రమే కాదు...నేను నిన్ను కన్నదానిని మాత్రమే. ఆ తరువాత నీకు జోలపాట పాడి, ఊయల ఊపి ప్రేమ కురిపించి పెంచింది ఆమే. నీకు చిన్నగా వొళ్ళు వేడిగా ఉందంటే ఆమె ఎంత ఆందోళన చెందుతుందో తెలుసా? 'అమ్మా' అని నువ్వు పిలిచిన ప్రతిసారి ఆమె ఎంత ఆనందపడేదో తెలుసా? నీకొసం ఆమె ఎన్ని పథకాలును, కలలు కని ఉంచుకుందో తెలుసా?"

"అమ్మా, ఆమెను నేను ' అమ్మ కాదని చెప్పలేదే! నిన్ను కూడా 'అమ్మ అని పిలుస్తాను" .........ఆమెను చూడటానికే అందరికీ జాలి, ఆశ్చర్యం వేసింది. 'ఇదే గాయత్రి నిన్నటి వరకు అందరి దగ్గరా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడింది. అందరినీ ఎదిరించి మాట్లాడింది? ఇప్పుడు ఇంత బ్రతిమిలాడుతోందే" అని తలచుకుని ఆశ్చర్యపోయారు.

అప్పుడు రాజరాజేశ్వరి, "ఎందుకు మంగమ్మ ఇంత పట్టుదల పడుతున్నావు? అది ఇష్టపడినట్లే పిలవనీ?" అని చెప్పగా...

"లేదమ్మగారూ...ఇది ఇరవైరెండేళ్ళు కట్టి కాపాడిన రహస్యం. మధ్యలోనే చెదిరి పోకూడదు. ఇక దీనిని గాయత్రి కూడా కలిసి చివరి వరకు కాపాడే తీరాలి"  అని చెప్పిన  ఆమె కూతురి వైపు తిరిగి "నేను జీవితాంతం నీకు పిన్నినే. ఆమే నీకు అమ్మ. దీన్ని నువ్వు మీరనని నాకు వాగ్ధానం చెయ్యి" అని చెప్పి తన కుడి చేతిని ముందుకు జాపింది.

"కుదరదు...కుదరనే కుదరదు" అంటూ వెనకడుగు వేసింది గాయత్రి.

ఈ తల్లీ-కూతుర్ల ప్రేమ పొరాటం చూసినవాళ్ళు కన్నీరు పెట్టుకున్నారు.

"కుదరదని చెబితే నా నిర్ణయం వేరే విధంగా ఉంటుంది. నా పట్టుదల గురించి కూడా నీకు తెలుసు కదా?' -- జాపిన చేతిన జాపినట్లే ఉంచి స్వరంలో కఠినత్వం చూపింది మంగమ్మ.

"సరేనమ్మా...'పిన్నీ'అని వద్దు. 'చిన్నమ్మా' అనైనా పిలుస్తానమ్మా?" -- బ్రతిమిలాడింది.

అందరూ కలిసి మంగమ్మని ఒప్పించటంతో వేరే దారిలేక "సరే" అని చెప్పి ఒప్పుకుంది.

సత్యపాల్ ని అడిగింది: "అన్నయ్యా...నువ్వైనా నాన్నను, నాన్నా అని పిలవచ్చు కదా. మనమందరం కలిసిపోయినప్పుడు ఎందుకు వేరుబాట్లు?"

అందరి మొహాలలోనూ...'గాయత్రి కోరికను సత్యపాల్ అంగీకరించాలి!" అనే ఉత్కంఠ కనబడింది.

సత్యపాల్ ఎప్పుడూ రాజరాజేశ్వరికి పెద్ద కొడుకే. అందువల్ల 'ఆయన్ని నాన్నా అని అతను పిలవటం సబబే' అనిపించింది.

పరంధామయ్య మనసులోనే ఆనందపడ్డారు. కొడుకుకు కోడుకుగా ఉంటూ ఇంటి పెద్దగా ఉండి ఇంటినీ, కంపెనీని తెలివిగా నిర్వాహం చేస్తూ వెడుతున్న అతను కొడుకుగా ఉండటం సరైనదే' అని అనుకున్నారు.

తండ్రి ప్రేమను సత్యపాల్ పూర్తిగా పొందటానికి తాను అడ్డుగా ఉండకూడదని మంగమ్మ నిర్ణయించుకుంది.

సత్యపాల్ కీ అదే ఆశ ఉన్నది. వివరం తెలిసిన రోజు నుంచి తండ్రి కొడుకుకు చేయాల్సిన అన్ని భాద్యతలను ఏ లోటూ లేకుండా చేస్తూ వస్తున్నారు ఆయన. అపరిమితమైన ప్రేమను చూపిస్తూ వస్తున్నారు.

పెద్దై అన్నీ బాధ్యతలూ తీసుకున్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలను మరు పరిశీలన చేయకుండా నా నిర్ణయాన్ని అలాగే అంగీకరించేరంటే నా మీద ఎంత నమ్మకం ఉంచారో ఎవరికైనా అర్ధమవుతుంది. ఆయన్నీ 'నాన్నా' అని పిలవడం తనకు హక్కుగా దొరకటం పెద్ద భాగ్యంగా భావించాడు.

మెల్లగా తల తిప్పి మంగమ్మని చూశాడు.

ఆమె కూడా 'సరే' నని తల ఊపింది.

రాజరాజేశ్వరి సత్యపాల్ దగ్గరకు వచ్చి అతని చేతులు పుచ్చుకున్నది. "నువ్వూ, మంగమ్మ ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ, ఈ ఇంటికి నువ్వే బాబూ పెద్ద కొడుకువి" అని ఆవేశంగా చెప్పింది.  

సత్యపాల్ తిన్నగా పరంధామయ్య దగ్గరకు వెళ్ళి ఆయన చేతులు పుచ్చుకుని "నాన్నా" అన్నాడు.

ప్రేమతో నిండిన అతని చేతుల స్పర్శ తగలగానే పరంధామయ్య కళ్ళల్లో ఆనంద కన్నీరు బయటకు వచ్చింది.

              *****************************************PART-17****************************************

(భార్య యొక్క మంచి గుణాలు కుటుంబ జీవితం యొక్క అందమైన, మంగళకరమైన లక్షణం. ఇవి కుటుంబానికి గౌరవ మర్యాదలు తీసుకు వస్తాయి. అలాంటి గౌరవం తీసుకు వచ్చే భార్యకు...మంచి పిల్లలు ఉండటం మరింత గౌరవం చేరుస్తుంది)

రాజరాజేశ్వరిని, సత్యపాల్ ని పిలిచి అత్యవసర సమావేశం పెట్టింది గాయత్రి. ఆ టైములో ఇంట్లో మంగమ్మ లేకుండా జాగ్రత్త పడింది. 

ఆమే వివాదాన్ని మొదలుపెట్టింది: ఇది కొంచం తొందర పడాల్సిన - అత్యవసర విషయం"

ఆమె ఏం చెప్పబోతోంది అనేది తెలుసుకోవటానికి ఆసక్తిగా ఉన్న వాళ్ళిద్దరూ ఆమె మొహాన్నే చూస్తూ ఉన్నారు. గాయత్రి మొదలుపెట్టింది, "చిన్నమ్మకు ఈ ఇంట్లో ఒక సరైన చోటు ఇవ్వాలి"

"ఏం, ఆవిడకు మనం ఏదైనా తక్కువ చేశామా?"

"మనం ఏమీ తక్కువ చేయలేదు. కానీ, నాన్నే తక్కువ చేశారు."

"అమ్మకు నాన్న ఎటువంటి కొరత పెట్టినట్లు నాకేమీ అనిపించటం లేదు. నువ్వు చెప్పేదేమిటి గాయత్రి?" సత్యపాల్ అడిగాడు.

"నాన్న, చిన్నమను ఈ ఇంట్లో ఏ బంధుత్వం చెప్పి ఉంచారు?"

"వాళ్ళిద్దరూ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈరోజు వరకు కరెక్టుగా నడుచుకుంటున్నారు. మేము ఈ ఇంట్లో సంతోషంగానూ, బద్రతతోనూ, అన్ని  వసతులతోనూ జీవిస్తున్నాము. దీని కంటే ముఖ్యంగా 'నాన్నా' అని పిలవటానికి హక్కు ఇచ్చారు. ఇంతకంటే మాకు ఇంకేమీ అక్కర్లేదు" - నీళ్ళు నిండిన కళ్ళతో చెప్పాడు సత్యపాల్.

"అమ్మా...అన్నయ్య స్వీయ నియంత్రణతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఇది నగరం కాబట్టి చిన్నమ్మ గురించి ఎవరూ సూటిపోటి మాటలు అనడంలేదు.. ఇదే గ్రామం అయ్యుంటే ఆమెను ఏం పేరు పెట్టి పిలిచేవారో మీకు తెలియదా? మన గ్రామంలో చిన్నమ్మను  ఎంతెంత మాటలతో ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వాళ్ళతో కలిసి నేనూ ఒక కాలంలో చిన్నమ్మ గురించి ఎంతో అసహ్యంగా మాట్లాడాను" ఆవేదనతో చెప్పింది కవిత.

"అందుకని...?"

"నాన్నా, చిన్నమ్మా తాము వేసుకున్న ఒప్పందం నుండి బయటకు రావాలి. ఇప్పుడు నేను కూడా వాళ్ళను బాగా అర్ధం చేసుకున్నాను కాబట్టి వాళ్ళ మధ్య ఒప్పందం  అవసరం లేదు. చిన్నమ్మని నాన్న బహిరంగంగా ఏలుకోవాలి"

"ఇప్పుడు దానికి ఏమిటమ్మ అవసరం?"

"అవసరం మనకు లేదు. చిన్నమ్మకు ఉంది. ఆమె బయటకు వెళ్ళదు. కానీ, ఆమెకు ఒక వాంఛ ఉంటూనే ఉంటుంది. దాన్ని ఆమె చెబుతుందని అనుకుంటున్నారా?"

ఆడదాని మనసు ఆడదానికి అర్ధం కాదా? కానీ, ఇంత కాలంగా దీని గురించి నేను ఎందుకు ఆలొచించ లేదు అని బాధ పడ్డది రాజరాజేశ్వరి.

రాజరాజేశ్వరి ఆలొచిస్తూ ఉండటాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న గాయత్రి, "ఏంటమ్మా...నేను ఏదైనా తప్పుగా మాట్లాడేనా?" అని అడిగింది.

"నువ్వేమీ తప్పుగా మాట్లాడ లేదు తల్లీ. ఇన్ని రోజులు దీని గురించి ఆలొచించకుండా ఉండిపోయేనే నని నేను బాధపడుతున్నాను.  ఎందుకంటే, నాకు పిల్లలు పుట్టరని తెలుసుకున్న వెంటనే నేను మీ నాన్నను రెండో పెళ్ళి చేసుకోమని అప్పుడే అడిగాను, బలవంతం చేసాను. కానీ, మీ నాన్నే చేసుకోనంటే చేసుకోనని పట్టుదలగా ఉండిపోయారు.  అలాంటప్పుడు, ఇప్పుడు మీ నాన్నకు రెండో భార్యగా మంగమ్మ ఉంటే నాకేం ఆక్షేపం? నువ్వు కడుపులో ఉన్నది తెలియక సత్యపాల్ ను దత్తత్తు తీసుకుందామని ఆశపడ్డాము. మంగమ్మ కూడా దానికి ఆమోదం తెలిపింది. కానీ, నువ్వు కడుపులో పెరుగుతున్నావని తెలుసుకున్నాక మా పధకాన్ని మార్చుకున్నాము. వాళ్ళను ఎప్పుడో ఒకటిగా చేర్చుండాలి. నేనే తప్పు చేశాను"

"అమ్మా, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు బాధ పడితే ఏ ప్రయోజనమూ లేదు. ఇంకా సమయం పోనివ్వకుండా నాన్ననూ, చిన్నమ్మనూ చేర్చటానికి ఒక దారి చూడండి"

"అది సరేనే....వాళ్ళిద్దరి దగ్గరా దీని గురించి ఎలా మాట్లాడేది?"

"మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో...అవన్నీ మాకు తెలియదు. ఎలాగైనా వాళ్ళిద్దరినీ కలపండి. అన్నయ్యా...రా"

నిర్ణయం తీసుకునే హక్కును నాయకుడికి వదిలేసి బాధ్యతగా వెళ్ళిపోయే రాజకీయ కార్యకర్తలలాగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.

"ఇంత చిన్న వయసులోనే దీనికి ఎంత తెలివి?" అంటూ ఆశ్చర్య పడుతూ ఆమె వెనకాలే వెళ్ళాడు సత్యపాల్.

'ఇది ఎలా చేసి ముగిస్తాను?' అని ఆలొచించటం మళ్ళీ మొదలుపెట్టింది రాజరాజేశ్వరి.

భర్త ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి చెప్పింది రాజరాజేశ్వరి.

"ఏమండీ...మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి"

"ఏమైంది...ఎందుకిలా ఆందోళనగా మాట్లాడుతున్నావు?"

"మీ దగ్గర ఎలా ప్రారంభించాలో తెలియటం లేదు"

"అదే మొదలు పెట్టేశావు కదా...పైన చెప్పు"

"లేదండీ...మనం మంగమ్మ..."

" మంగమ్మకి ఇప్పుడేమిటి?"

"ఏమీలేదండి...కానీ, ఆమెకు ఒక చిన్న కొరత..."

"ఆమెకు ఏం కొరత? ఆమెను బాగానే చూసుకుంటున్నావుగా?"

మేము బాగానే చూసుకుంటున్నాం. కానీ, మీరే..."

పరంధామయ్య మనసులో ఆందోళన పెరిగింది. "కొత్తగా ఏదైనా సమస్యా? నేను బాగానే కదా నడుచుకుంటున్నాను" అని ఆలొచించిన ఆయన...కన్ ఫ్యూజ్ అయిన ఆయన, “చెప్పేదేదో క్లియర్ గా చెప్పు" అన్నారు.

"అందరం ఆమెను బంధువుగానే చూస్తున్నాము. కానీ, మీకు ఆమె ఎవరనేది మీరు బహిరంగంగా ఒప్పుకోవాలని ఇష్టపడుతున్నాం"

"ఇప్పుడే ఒక పెద్ద సమస్య నుండి బయటపడి ఇళ్ళు కొంచం సైలంటుగా ఉన్నది. ఇంతలో ఏమిటిది ఇంకో వ్యవహారం? మీదగ్గర మంగమ్మ ఏమైనా అడిగిందా?"

"ఆమె ఏదీ అడగలేదండి! ఇది మనంగా ఆమెకు ముఖ్యంగా చేయాల్సిన ఒకటి. దీన్ని నేను ఎప్పుడో చేసుండాలి. కానీ, అప్పుడు బుర్రలో ఎక్కలేదు. ఇప్పుడు గాయత్రి చెప్పిన తరువాతే అర్ధమయ్యింది"  

"అంటే...ఈ గందరగోళానికీ గాయత్రినే కారణమా?"

"అయ్యో... గాయత్రిని అన్యాయంగా తప్పు పట్టకండి. చిన్న పిల్లగా ఉన్నా కూడా ఏంత వివరంగా మాట్లాడుతోందో? దాని మాటల్లో ఉన్న న్యాయాన్ని గ్రహించే ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నాను"

"ఏం చేయాలని చెబుతున్నావు?"

"మంగమ్మను మీ భార్యగా ఏలుకుని, ఆ విషయాన్ని బహిరంగంగా చూపించాలి"

"ఏమిటి రాజేశ్వరీ...నువ్వే ఇలా మాట్లాడుతున్నావు?"

"అవునండీ....మిమ్మల్ని రెండో పెళ్ళి చేసుకోమని ఎప్పుడో బలవంత పెట్టాను. అప్పుడు చేసుకోనుంటే ఇప్పుడు మీకు ఇంకొక భార్య ఉండేది కదా? ఆమె నన్ను బాగా చూసుకోనుండేది అనేది నమ్మగలమా? మంగమ్మ ఇన్ని సంవత్సరాలుగా మన దగ్గర ఎలా నడుచుకున్నది చూస్తూనే ఉన్నారు కదా. మీరు ఆమెనే రెండో పెళ్ళి చేసుకున్నారనే అనుకుంటాను. ఇది నాకు రెట్టింపు సంతోషమే"

"ఇన్ని సంవత్సరాలైన తరువాత ఈ బంధుత్వం అవసరమా?"

"శరీరాలు కలిపే బంధుత్వాన్ని మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటా. అది ప్రతి భార్యా-భర్తలకు ఏదో ఒక వయసులో తీరిపోతుంది. కానీ, భర్త యొక్క అనురాగం, ప్రేమ, అభిమానం, ఆదరణ అని ఎన్నో విషయాలను ప్రతి భార్య ఆమె చనిపోయేంతవరకు  భర్త దగ్గర ఎదురుచూస్తుంది. మంగమ్మ కూడా ఒక ఆడదే కదా. ఆమెకూ ఇలాంటి ఆశాపాశాలు ఉంటాయి కదా?"

"ఊరు, సంఘం మనల్ని ఇంకో విధంగా మాట్లాడదా?"

"సరే, ఇదే ఊరు, సంఘం ఇప్పుడు మంగమ్మను, భర్తని వదిలేసి పారిపోయి వచ్చింది, మీకు సెటప్పుగా ఉంటోంది, మీరు ఉంచుకున్న ఆమె అని అవీ, ఇవీ అంటూ ఇంతకంటే నీజంగా మాట్లాడుతున్నారే! అది పరవాలేదా? 'ఊరు,సంఘంతో కలిసిపోయి తాను కూడా నీచంగా మాట్లాడేనే...' అని చెప్పి చెప్పి గాయత్రి కన్నీళ్ళు పెట్టుకుంటోందే! అది పరవాలేదా?"

రాజరాజేశ్వరి, పిల్లలూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాశారు. ఇక దీనిలో నుండి నన్ను తప్పించుకోనివ్వరు అనేది గ్రహించారు. భార్య మాటల్లో న్యాయం ఉండటం కూడా గమనించారు పరంధామయ్య. 

"దీని గురించి నేను బాగా ఆలొచించి జవాబు చెబుతా " అని చెప్పి ఆయన గబగబా అక్కడ్నుంచి బయటకు వచ్చారు.

మధ్యాహ్నం భోజన సమయానికి ఇంటికి తిరిగి వచ్చిన ఆయన, హాలులో నిలబడి అందరికీ వినబడేలాగా " మంగమ్మా...ఆకలేస్తోంది. భోజనం పెట్టు" అంటూ పెద్ద స్వరంతో మాట్లాడారు.

మంగమ్మ తన చెవులను నమ్మలేక పోయింది. తాను విన్నది నిజమేనా అని నిశ్చయించుకోవటానికి మెల్లగా వంట గదిలో నుండి తొంగి చూసింది. పరంధామయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోనున్నారు.

అది గమనించిన పరంధామయ్య మళ్ళీ పిలిచారు "ఏం మంగమ్మా...నేను పిలిచింది చెవులకు వినబడలేదా?"

తాను అడిగింది ఇంత త్వరగా నెరవేరుస్తారని ఎదురుచూడని రాజరాజేశ్వరి, తాను కూడా " మంగమ్మా... నాకూ ఆకలేస్తోంది. నాకు కూడా భోజనం పెట్టు" అని చెప్పి తాను కూడా ఆయన పక్కనే కూర్చుంది.

'ఎప్పుడూ భర్తకు తన చేతులతోనే వడ్డన చేసే రాజరాజేశ్వరి ఈ రోజు ఆయనతో కలిసి భోజనానికి కూర్చుందే...' అంటూ ఆశ్చర్యపోయి శిలలా నిలబడి పోయింది మంగమ్మ. 

వేగంగా వచ్చిన గాయత్రి ఆమె చెయ్యి పుచ్చుకుని తీసుకు వెళ్ళి నాన్న దగ్గర వదిలి పెట్టి ఆమె కూడా ఒక కుర్చీలో కూర్చుంది.

సత్యపాల్ కూడా వచ్చి వాళ్ళతో కలిసి కూర్చున్నాడు.

"ఏమిటి మంగమ్మ...అలాగే నిలబడిపోయావు?" అని రాజరాజేశ్వరి అడిగిన తరువాత  మామూలు స్థితికి వచ్చింది....పరిస్థితిని త్వరగానే అర్ధం చేసుకుంది. దానిని అంగీకరిద్దామా...వద్దా అనే గందరగొళంలో ఆమె ఉన్నదని ఆమె మొహంలో క్లియర్ గా కనబడింది. 'చేసిన వాగ్ధానాన్ని ఎలా మీరేది?' అని తడబడింది.

దాన్ని ఈజీగా అర్ధం చేసుకున్న రాజరాజేశ్వరి, "ఇక మీదట నీ వాగ్ధానాన్ని కాపాడాల్సిన అవసరం నీకు లేదు. అందరికీ అన్నీ తెలిసిన తరువాత వాగ్ధానానికి అవసరమేముంది? లోకం గురించి భయపడకుండా మన జీవితం మనం జీవిద్దాం. చివరి రోజుల్లో అదే మనకు మంచిది. ఒప్పుకో మంగమ్మ"

సత్యపాల్, గాయత్రి కూడా ఆమెను బ్రతిమిలాడుతున్న దోరణిలో చూశారు.  

తాను ఎంతో అదృష్టవంతురాలినని అనుకుంది. లోపల మనసు ఆనందపడుతుంటే దానిని బయటకు కనబడనివ్వకుండా అణుచుకుంది. వాళ్ళ కోరికను అంగీకరించిన దానిలాగా పరంధామయ్య కు భోజనం వడ్డించడం మొదలుపెట్టింది. అప్పుడు  వణుకుతున్న చేతులను కనిపించకుండా దాచుకోవటానికి ఎంత ప్రయత్నించినా ఆమె వలన కుదరలేదు.

ఆ ఇంట్లో మంగమ్మకి దొరకవలసిన చోటు దొరికిందని అందరూ సంతోషపడ్డారు.

గాయత్రి యొక్క తెలివితేటలను, దాన్ని అమలు పరిచిన తీరును గమనించి ఎక్కువ ఆశ్చర్యపడిన సత్యపాల్.......

'ఆమె నా చెల్లెలు తనకు తానే గర్వ పడ్డాడు.

           **********************************************PART-18**********************************

(పొందవలసిన బంధం అర్ధం నిండిన బంధంగా పొందటమే అతి పెద్ద బంధం. దానికంటే ఇక దేనినీ పెద్ద బంధంగా మనం గౌరవించం)

ఆ కారు హైదరాబాద్ నుండి గ్రామం వైపు వేగంగా వెడుతోంది. సత్యపాల్ కారు నడుపుతున్నాడు. పక్కన పరంధామయ్య కూర్చోనున్నారు.  మహిళలు ముగ్గురూ వెనుక సీటులో! గాయత్రి మధ్యలో ఉన్నది. కారును చల్లదనంతో పాటూ ఉత్సాహమూ నింపింది. 

"అన్నయ్యా...హైదరాబాద్ కు తిరిగి వెళ్ళిన వెంటనే ఈ కారు అమ్మేసి పెద్ద కారు కొనాలి"

"ఎందుకమ్మా...ఇది మనకి వసతిగానే కదా ఉన్నది?"

"వసతిగానే ఉన్నది. కానీ, వసంత కూర్చోవటానికి ఇందులో చోటులేదే?"

అసలు విషయాన్ని బద్దలుకొట్టింది గాయత్రి.

" వసంతనా...ఇదేమిటి కొత్త పేరు?" అడిగింది మంగమ్మ.

"చిన్నమ్మా...మీకు మాత్రమే ఇది కొత్త పేరు. సత్యపాల్ సార్ గారికి ఇది అలవాటైన పేరు. మెగా ఆలొచనతో ఆమెను ఆఫీసులోకి తీసుకు వచ్చిన సారు...ఇప్పుడు ఇంటిలోపలకూ తీసుకు రావటానికి ప్లాన్ వేస్తున్నారు. వెంటనే ఆమె మెడలో పసుపుతాడు కట్టి ఆమోదించకపోతే, ఆఫీసులో ఆమె హడావిడిని తట్టుకోలేము" కుండ బద్దలు  కొట్టింది.

అందరికీ విషయం అర్ధమయ్యింది. సత్యపాల్ వంకర్లు తిరిగాడు.

"తప్పు చేసిన వాళ్ళను దండిచకుండా వాళ్ళకు జీవితం ఇచ్చి కాపాడే గుణం నీకూ వచ్చేసిందా?" నవ్వుతూ అడిగింది రాజరాజేశ్వరి.

ఆమె ప్రశ్నలోనే తనకి సమ్మతమే అన్నది చిలిపిగా తెలిపింది.

రాజరాజేశ్వరి చిలిపితనాన్ని లోలోనా ఆనందించారు పరంధామయ్య.

"అమ్మా...తల్లుల్లారా నా బుర్ర తినకండి" అని నకిలీగా నటిస్తూ-రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేశారు.

గలగలమని నవ్విన గాయత్రి అడిగింది, "అది సరే నాన్నా... వసంత గురించి  మీరేమనుకుంటున్నారు? అది చెప్పండి మొదట..."

అప్పుడు కొంచం సీరియస్ అయిన ఆయన, “సత్యపాల్ ఏది చేసినా కరెక్టుగానే చేస్తాడు. ఆ నమ్మకం ఇందులోనూ నాకు ఉన్నది. ఆమెను వాడు ఇష్టపడితే దానికి నేను అబ్జెక్షన్ తెలుపను" అన్నారు.

"ఓ.కే.నాన్నా! చిన్నమ్మా...నువ్వేమంటావు?"

"పెద్దలు తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం" అని పరోక్షంగా తన ఆమోదాన్ని తెలిపింది మంగమ్మ.  

మంగమ్మ గాయత్రి వైపు తిరిగి " గాయత్రీ, నువ్వు నీ ఇష్టాన్ని చెప్పలేదే?" అని అడిగింది.

"నాకు ఇది కొంచం కూడా ఇష్టం లేదు" అన్నది గాయత్రి. 

అందరూ గాయత్రిని ఆశ్చర్యంగా చూశారు. సత్యపాల్ కంగారుపడ్డాడు.

వాళ్ళందరి గందరగోళాన్ని ఆనందిస్తూ చెప్పింది, "నా అన్నయ్య ప్రేమలో భాగం పంచుకోవటానికి ఒకామె వస్తే ఆమెను ఎలా ఎన్నుకోను?"

మళ్ళీ అందరూ ఉత్సాహంగా నవ్వారు.

కారు నడుపుతున్న సత్యపాల్ ఒకసారి వెనక్కి తిరిగి ఆమెను చూసి నవ్వాడు. ఆ నవ్వులో ఉన్న  థ్యాంక్స్ ను అర్ధం చేసుకున్న గాయత్రి బోటను వేలు చూపించి 'జయం' అన్నట్టు చెప్పింది.

తల్లి-తండ్రుల దగ్గర వసంత గురించి ఎలా చెప్పబోతాను  అనే సంధిగ్ధంలో ఉన్న సత్యపాల్ కు చెల్లెలు దాన్ని చాలా ఈజీగా తీర్చిపెట్టినందుకు ఆమెకు మానసీకంగా ధన్యవాదాలు చెప్పాడు.

"అది సరే... వసంత విషయం నీకెలా తెలిసింది?" -- పరంధామయ్య అడిగారు.

"నాన్నా...అన్నయ్య పులిలాగా దాగి దాగి నన్ను ఫాలో చేశాడు. కానీ నేను సింహము. ఒకే దెబ్బ. నిజం బయటకు వచ్చేసింది"

"అమ్మా తల్లీ...ఓవర్ 'బిల్డ్ అప్' మంచిది కాదు! జరిగిన విషయం చెప్పు"

జరిగింది తెలుసుకోవటానికి అదుర్దా పడ్డ సత్యపాల్ అడిగాడు. వసంత కూడా ఇంతవరకు అతని దగ్గర చెప్పలేదే!

దాన్ని గాయత్రి ఉత్సాహంగా వివరించగా...అందరూ ఆసక్తిగా విన్నారు.............

ఆఫీసులో నవీన్ ను కలుసుకున్న రోజు నుండి వసంత పైన సత్యపాల్ ప్రత్యేక ఆసక్తి చూపించటం గమనించింది గాయత్రి. 'ఒకవేల ప్రేమగా ఉంటుందా' అని సంతోష పడింది. అదే నిజమైతే ఆమెకు అది సంతోషమే.  

అది నిజమేనని తెలుసుకోవటానికి ఒకరోజు సత్యపాల్ ఆఫీసులో లేనప్పుడు ఆఫీసుకు వెళ్ళి ఇంటర్ కాం లో వసంతను పిలిచింది.

"ఎస్ మ్యాడం" అంటూ లోపలకు వచ్చిన వసంతను చూసి "మాకు సెక్రెటరీ గా వచ్చిన దానివి, ఇప్పుడు ఈకంపెనీకే యజమాని అయిపోదామని ఆశపడుతున్నావా?" అని గట్టిగా అడిగింది.

గబుక్కున ఆమె కళ్ళ వెంట కన్నీరూ ధారగా కారింది. చేతి రుమాలతో అది తుడుచుకుంటూ, "మ్యాడం, అనారొగ్యంతో బాధ పడుతున్న అమ్మకు అవుతున్న హాస్పిటల్ ఖర్చు, మేమిద్దరం గౌరవంగా జీవించడానికి అవుతున్న ఖర్చూ...ఈ రెండింటికీ సరిపోయేంత డబ్బును జీతంగా ఇస్తున్నారు...దీనికంటే ఇప్పుడు నాకు ఇంకే ఆశ లేదు"

ఇప్పుడు లేదంటే...ఇకమీదట వస్తుందా"

తన నోటి నుండి నిజం తెప్పించటానికి గాయత్రి ప్రశ్నలను పొడిగిస్తోందని గ్రహించిన వసంత, గాయత్రి అడగబోయే తరువాత ప్రశ్నకు, ముందుగానే తన జవాబు చెప్పింది. 

"మ్యాడం,జీవితంలో చాలా దెబ్బ తిని ఉన్నాను.ఇప్పటికి నా అవసరాలు, ఆశలు  చాలాచాలా తక్కువ"

"ఇది నేను నమ్మాలంటావా?"

గాయత్రి కూడా వదల దలుచుకోలేదు.

గాయత్రి మనసులో ఏదో పెట్టుకునే తనని ప్రశ్నల బాణాలతో గుచ్చుతోంది అనే కోణంలో ఆలొచించిన వసంత కి 'సడన్ గా ఒక విషయం గుర్తుకు వచ్చింది.

"మ్యాడం, మీరడిగే ప్రశ్నకు నేను తిన్నగానే సమాధానం చెబుతాను. మీ అన్నయ్యే నన్ను ప్రేమిస్తున్నానని ఒక సారి చెప్పాడు. కానీ నేను ఖచ్చితంగా 'నో' అని చెప్పి తిరస్కరించాను. దానితో అది నేను మర్చిపోయాను. మీ అన్నయ్య కూడా ఆ తరువాత దాని గురించి నా దగ్గర మాట్లాడలేదు. దీన్ని మనసులో పెట్టుకునే నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారా?"

"ఏం, మా అన్నయ్యకు ఎం తక్కువ?"

ప్రశ్నను మార్చి అడిగింది గాయత్రి.

"అయ్యో మ్యాడం...మీ అన్నయ్య దగ్గర ఏటువంటి కొరతా లేదు. కోరత అంతా నా దగ్గరే"మళ్ళీ కళ్ళల్లో కన్నీరు.

ఆమెను చూడటానికే గాయత్రికి పాపం అనిపించింది. అయినా కానీ, గాయత్రికి తాను ఉన్న 'జాలి మూడు ను కొనసాగించి వసంతను కెలికింది.

"నీ దగ్గర అలా ఏమిటి కొరత?"

"మ్యాడం, అన్నీ తెలిసిపెట్టుకున్నా, వాటిని నా నోటి నుండి వినాలనే గా మీ ఉద్దేశం. అందుకని చెబుతాను. పెళ్ళి అంటేనే ఆడపిల్ల వారి ఇంటి నుండి సారె ఇవ్వాలి. దానికి నా దగ్గర నయాపైసా కూడా లేదు. అంతకంటే ముఖ్యంగా కన్నె పిల్లలు పెళ్ళి వరకు బద్రపర్చుకోవలసిన కన్యాత్వాన్ని నేను పెళ్ళికి ముందే పోగొట్టుకున్నాను..."

"నాన్సెన్స్"--ఆ రూమే దద్దరిల్లేటట్టు అరిచిన గాయత్రి, పరిగెత్తుకు వచ్చి వసంతను కౌగలించుకుంది.

గాయత్రి భుజాలపై వంగి తలపెట్టుకున్న వసంత తన మనోభారాం తగ్గేంతవరకు వెక్కి  వెక్కి ఏడ్చింది. ఆమె తల్లికి కూడా ఈ విషయం తెలియదు. అందువలన తన ఆవేదనకు పంటకాలువలాగా ఈ సంధర్భాన్ని వాడుకుంది వసంత. 

ఏడుపు ఆగేంతవరకు ఆమెకు ఆదరణగా, కౌగలింతను మరింత బిగువు చేసి మరింత దగ్గరకు చేర్చుకుని సమాధాన పరచింది గాయత్రి.

"ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇంత అమాయకత్వంగానా? ఎప్పుడు నీ తప్పును తెలుసుకుని మనసు విప్పి ఏడ్చేవో...అప్పుడే అది నిన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పలేదు. రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. ఏడుపు ఆపు. కన్నీటిని తుడుచుకో" అని వసంతను సోఫాలో కూర్చోపెట్టింది.  

టీ తెప్పించుకుని ఇద్దరూ తాగారు.

వసంత సహజ స్థితికి రాగానే ఆమెతో చెప్పింది, "సారీ...నిన్ను ఏడిపించి చూడాలని అనుకోలేదు. కానీ, ఒక విధంగా ఇది నీకు మంచే చేసింది. ఇంతవరకు అణిచిపెట్టుకున్న నీ దుఃఖానికి కారణంగా ఉన్న విషయాన్ని బయటకు చెప్పి మనసు విప్పి ఏడ్చినందు వలన నీ మనసు ప్రశాంతంగా ఉంటుందే. కరెక్టే కదా?"

''అని తల ఊపింది వసంత.

గాయత్రి మళ్ళీ మాట్లాడింది, "కానీ దీంతో నిన్ను వదిలిపెట్ట దలుచుకోలేదు"

ఎదురుకుండా ఉన్న వసంత తలపైకెత్తి ఆశ్చర్యంగా చూసింది.

"నీకు ఒక ప్రమోషన్ ఇవ్వబోతాను"

మౌనంగా ఉండిపోయింది వసంత.

"ఏమిటని అడగవా?"

"మీరే చెప్పండి మ్యాడం"

"నాకు 'వదిన గా 'ప్రమోట్' చెయ్య బోతాను. ఏమిటి...ఓ.కే.నేనా?"

"మ్యాడం, మీ ఇంట్లో..."

"మా ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు ఆలొచించకు! అది నేను చూసుకుంటాను. నీకు ఓకేనా? అది చెప్పు మొదట"

"లేదు మ్యాడం. నేను కొంచం ఆలొచించాలి"

"నువ్వు ఏం ఆలొచిస్తున్నావో నాకు తెలుసు"

'ఏం తెలుసు?' అన్నట్లు ఆమెను ఆశ్చర్యంగా చూసింది.

"పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే అమ్మను ఎవరు చూసుకుంటారు అనే కదా ఆలొచిస్తున్నావు! కరెక్టే కదా?"

'ఈమె సత్యపాల్ యొక్క చెల్లెలు. ఈమె కూడా తెలివిగలదిగా  ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు...'అనుకుంది వసంత.

"ఒకటి చెయ్యి...నువ్వు కట్నంగా ఇవ్వవలసిన వస్తువులు మా ఇంట్లో ఏదీ లేదు. మీ అమ్మను కట్నంగా మా ఇంటికి ఇచ్చేయి"

అదిరిపడ్డది వసంత. దీనికిపైన ఆలొచించ వలసినది ఆమెకు ఏముంటుంది?

"హలో, ఏమిటి ఇంకా ఆలొచన...ఓకేన కదా?"

ఒకేనే అన్నట్టు తల ఊపింది వసంత.

"వదిలిపెట్టను. నువ్వు నోరు విప్పి జవాబు చెప్పేంతవరకు వదిలిపెట్టను"

."ఓకేనే మ్యాడం"--సన్నటి స్వరంతో జవాబు, పెదాలలో సిగ్గుతో కూడిన నవ్వు కనబడింది.

"అది సరే, ఓకే చెప్పేవు కదా? ఆ తరువాత ఇంకా దేనికి మ్యాడం...మ్యాడం?” 

"మ్యాడం, జీవితంలో ఒక సారి తొందరపడినందువలన తగిలిన దెబ్బతో మంచి పాఠం నేర్చుకున్నాను. ఇక మీదట వేసే ప్రతి ఒక్క అడుగు నిదానంగా వేయబోతాను. ఎందుకంటే...నేను ఆశపడినది ఏదీ పూర్తిగా దొరికిందేలేదు. నా మెడలో మీ అన్నయ్య తాలి కట్టేంత వరకూ మీరు 'మ్యాడమే', నేను వసంత నానే..."

"సరే నండి మ్యాడం"---లేనిపోని భవ్యం నటిస్తూ ప్రతి మర్యాద చూపింది గాయత్రి.

ఇద్దరు ఆడవాళ్ళూ కలిపి గలగలమని నవ్వటంతో ఆ గదంతా ఆనందంతో నిండింది.

అప్పుడు ఆ కుటుంబంలో వచ్చి చేరాల్సిన కొత్త బందువు ఒకటి విరబూనసిన పువ్వు వాసన మొదలయ్యింది.

కవిత మాటలను పొడిగించింది, "మనిద్దరి మధ్య ఒక 'డీల్ . ఈ విషయాన్ని నేను మన కుటుంబంలో మాట్లాడి వాళ్ళ అంగీకారం తీసుకునేంత వరకూ నువ్వు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. మా అన్నయ దగ్గర కూడా!"

కవిత 'మన కుటుంబం' అనే మాటను నొక్కి చెప్పటంతో కరిగిపోయింది అర్చనా. దానికి జవాబుగా "ఎస్ మ్యాడం" అని వసంత చెప్పిన జవాబులో ఉత్సాహం తీరం దాటి వెళ్లటంతో గాయత్రీ కూడా సంతోషపడింది.

ఆమె వివరించటంతో "ఓసినీ దుంపతెగ...ఆ అమ్మాయిని ఇలాగా బాధపెట్టేది?" అన్నది రాజరాజేశ్వరి.

"అబ్బో ఇది మరీ ఎక్కువగా ఉందే. అప్పుడే కొడలు పిల్లకు అత్తగారు సపోర్టా" అన్నది గాయత్రీ.

ఆ ఉత్సాహంలో గాయత్రీను వెక్కిరించటం మొదలుపెట్టాడు సత్యపాల్.  అందులోనూ వచ్చే సంవత్సరం నువ్వు ఈ కారులో రావు!  అందువలన నీ చోటు అర్చానాకే"

"ఈ కారులో రాకపోతే అప్పుడు నేనెక్కడి వెడతాను?"

"నిన్ను ఇంట్లోంచే తరిమేయబోతానే"

ఇన్నిరోజులుగా నేను నిన్ను ఇంట్లో నుండి తరిమేయాలని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను తరిమేయ బోతావా?"

"లేదులేదు, నిన్ను ఒకడి చేతిలో పెట్టి కట్న కానుకలతో...ఆస్తిపాస్తులతో తరమ బోతాను"

ఉత్సాహంగా మాట్లాడాడు. కానీ, గాయత్రీకు అది ఉత్సాహంగా లేదు.

"అన్నయ్యా...నా పెళ్ళి విషయాన్ని రెండు, మూడు సంవత్సరాలవరకు వాయిదా వెయ్యి. స్వర్గంలోనే ఉంటూ అది అర్ధం చేసుకోకుండా ఇన్ని రోజులు దాన్ని నరకంగా పెట్టుకున్నాను. ఇప్పుడే ఆ నరకాన్ని కొంచం కొంచం స్వర్గంగా మార్చుకుని అందులో జీవించటం ప్రారంభించాను. కొన్ని సంవత్సరాలు దీన్ని అనుభవించ నివ్వు..."

ఆమె మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. గాయత్రీ ఇంత ఇదిగా తనని తానే మార్చుకున్నది చూసి ప్రశాంతత చెందేరు.

గాయత్రీను మాట్లాడించే విధంగా మాట్లాడాడు సత్యపాల్. "డ్రైవర్ సీటును స్వర్గం అని చెబుతావే! కారు నువ్వు నడుపుతావా? నేను వెనుక సీటులో కూర్చుంటాను"

"తప్పైన ఆలొచనతో డ్రైవర్ సీటును స్వర్గమని చెప్పాను. అది మాత్రమే కాదు అన్నయ్యా...నేను ఇప్పుడు ఉన్న చోటే నిజమైన స్వర్గం. ఇక మీదట ఏ కారణం చేత కూడా ఈ స్వర్గాన్ని వదిలిపెట్టను"

తనకు చెరో పక్క కూర్చున్న తల్లుల చేతి వెళ్లలో తన చేతి వేళ్లను పోనిచ్చి మరింత గట్టిగా పట్టుకుని చెప్పింది గాయత్రీ.

 ఆమె జవాబుతో ఆనందం పొందిన అందరూ, మానసికంగా వాళ్ళను వదిలి దూరంగా వెళ్ళిన గాయత్రీ మళ్ళీ వాళ్ళను బాగా అర్ధం చేసుకున్నదని ఆనందపడ్డారు.

వాళ్ళ దగ్గర కనిపించిన ఉత్సాహం ఆ కారుకూ అంటుకుంది. అది వేగం పెంచింది.

          **************************************సమాప్తం*******************************************                                                                                                                                                                                         

కామెంట్‌లు

  1. ఈ app లో ఉన్న కథలు నవలలు చదివి ఆడియో YouTube channel లో uplode చైవచ్చునా...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్షమించాలి. ఒక ప్రింట్ మీడియా కంపెనీతో చర్చలు జరుగుతున్నాయి. దాని ఫలితం తెలిసిన తరువాతే ఇంకేదైనా చేయగలం.

      తొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తొలిచూపు...(పూర్తి నవల)

శతమానం భవతి…(పూర్తి నవల)